Skip to main content

పరిశుభ్ర వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీకి కిచెన్‌ కమ్‌ స్టోర్‌ రూమ్స్‌..!

సాక్షి, అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని మరింత భద్రంగా.. పరిశుభ్ర వాతావరణంలో తయారు చేయించి నాణ్యమైన భోజనాన్ని పాఠశాల విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
కోవిడ్‌–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి.. పాఠశాలలు తెరిచాక పిల్లలకు రుచి, శుచితో కూడిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘జగనన్న గోరుముద్ద’ మెనూలోని ఆహార పదార్థాలను తయారు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 16,689 కిచెన్‌ కమ్‌ స్టోర్‌ రూమ్‌ షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ.483.98 కోట్లను వెచ్చిస్తోంది. ఒక్కో కిచెన్‌ షెడ్‌ రూ.2.9 లక్షల వ్యయంతో 20 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే 6,128 కిచెన్‌ షెడ్ల నిర్మాణాన్ని మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో చేర్చి పనులను త్వరితం చేయించింది. ఇతర కిచెన్‌ షెడ్ల నిర్మాణం కూడా సమాంతరంగా సాగుతోంది. వంటకు సంబంధించిన పాత్రలు ఎప్పుడో సమకూర్చినవి కావడంతో వాటి స్థానంలో కొత్త పాత్రలు, డివైస్‌లను ప్రభుత్వం సమకూరుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా వంట పాత్రలు, ఇతర డివైస్‌లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.57.06 కోట్లను వెచ్చిస్తోంది.

నాలుగు అంచెల్లో పర్యవేక్షణ
పథకం అమలులో సమస్యలు తలెత్తకుండా రాష్ట్రమంతటా ఒకేలా అమలయ్యేలా విద్యా శాఖ ఆధ్వర్యంలో నాలుగు అంచెల పర్యవేక్షణను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. పాఠశాల, గ్రామ, థర్డ్‌ పార్టీ, రాష్ట్రస్థాయిలో స్టేట్‌ లెవెల్‌ కమిటీలను ఏర్పాటు చేసి పథకం అమలులో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపడుతోంది. ఇవే కాకుండా డిజిటల్‌ సేవలనూ వినియోగిస్తోంది. ‘ఇంటిగ్రేటెడ్‌ మోనిటరింగ్‌ ఫర్‌ మిడ్‌ డే మీల్స్‌ అండ్‌ శానిటేషన్‌’ ద్వారా చాలా దగ్గర నుంచి వాటిని పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్‌ యాప్, డ్యాష్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్య ఉన్నట్టు యాప్‌ ద్వారా తెలియగానే వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది.

కుక్‌ కమ్‌ హెల్పర్ల గౌరవ భృతి పెంపు
జగనన్న గోరుముద్దను సమర్థవంతంగా అమలు చేసేందుకు 88,296 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లను ఏర్పాటు చేశారు. వీరికి గతంలో రూ.వెయ్యి చొప్పున గౌరవ భృతి చెల్లించగా.. ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు. 25 మందిలోపు విద్యార్థులుంటే ఒక కుక్, హెల్పర్, 100 మంది విద్యార్థులుంటే ఇద్దరు కుక్‌లు, హెల్పర్లు, ఆ పైన ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక కుక్, కమ్‌ హెల్పర్‌ను నియమించారు.

విద్యార్థుల ఇళ్లకే సరుకుల పంపిణీ
కోవిడ్‌–19 నేపథ్యంలో పాఠశాలలు మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమవ్వడంతో బియ్యం, పప్పు, కోడిగుడ్లు, చిక్కీలను వారి ఇళ్లకే పంపిణీ చేయిస్తున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు తెరిచి ఉన్న సమయంలో మధ్యాహ్న భోజనాన్ని 36,88,610 మంది విద్యార్థులు స్వీకరించేవారు. ప్రస్తుతం వారందరి ఇళ్లకూ భోజన సరుకులు అందజేస్తున్నారు.

తయారీకి నిధుల పెంపు
టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. అవసరమైన సరుకులను కేంద్రీకృత కొనుగోళ్ల ద్వారా చేపట్టి భారీఎత్తున నిధులను కొల్లగొట్టారు. చిన్నపిల్లలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కూడా నాసిరకంగా మార్చేసి జేబులు నింపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు. కోడిగుడ్లు తదితర సరుకుల కొనుగోళ్లను ఎక్కడికక్కడ చేసుకునేలా డీసెంట్రలైజ్‌ చేశారు. పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో రకమైన మెనూతో రుచికరమైన పదార్థాలు వడ్డించేలా చేశారు. ఇందుకు అదనపు నిధులు కూడా కేటాయించారు. ప్రాథమిక స్థాయిలో ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.15.38, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి రూ.18.06, హైస్కూల్‌ విద్యార్థికి రూ.22.71 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
Published date : 10 Jun 2021 05:16PM

Photo Stories