Skip to main content

ఇఫ్లూ ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌: ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో అధ్యాపక, అధ్యాపకేతర నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఇఫ్లూ ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు ప్రకటించొద్దని, తామిచ్చే తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత జనవరి 21న జాతీయ బీసీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఇఫ్లూ రిజిస్ట్రార్‌ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. ఇంటర్వ్యూలను నిలిపివేసే అధికారం సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంటుందని, జాతీయ బీసీ కమిషన్కు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు లేవని... ఇంటర్వ్యూలను నిలిపివేసే అధికారం లేదని ఇఫ్లూ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

నిబంధనలకు విరుద్ధంగా..
విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధనలకు విరుద్ధంగా ఇఫ్లూలో నియామకాలు జరుగుతున్నాయని జాతీయ బీసీ కమిషన్ తరఫు న్యాయవాది నివేదించారు. చట్ట విరుద్ధంగా ఇఫ్లూ నియా మకాలు చేపడుతున్న నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన జాతీయ బీసీ కమిషన్ కు ఇంటర్వ్యూలను నిలిపివేసే అధికారం ఉందని తెలిపారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు ఇఫ్లూకు బీసీ కమిషన్ నోటీసులు జారీచేసి వివరణ కోరిందని, సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇంటర్వ్యూలను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, జాతీయ బీసీ కమిషన్తోపాటు శ్రవణ్‌కు నోటీసులు జారీచేస్తూ తదు పరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
Published date : 04 Mar 2021 03:00PM

Photo Stories