Skip to main content

గురుకుల పదో తరగతికి 50 రోజుల ప్రణాళిక!

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయం ముంచుకొస్తోంది.
కోవిడ్ ప్రభావంతో 2020-21 విద్యా సంవత్సరం గందరగోళంగా మారింది. పాఠశాలలు మూతబడటం, ఎన్నడూ అలవాటు లేని ఆన్‌లైన్ బోధన, వీడియో పాఠాలతోనే విద్యా సంవత్సరం ముప్పావు వంతు గడిచిపోయింది. ఈనెల ఒకటో తేదీ నుంచి మాన్యువల్ తరగతులు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులు మాత్రం బోధన, అభ్యాసన కార్యక్రమాల్లో ఇంకా కుదురుకోలేదు. వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో గురుకుల సొసైటీలు 50 రోజుల కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు విన్న పాఠాలకు పునశ్చరణ, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రోజువారీ పరీక్షలు నిర్వహించడం, ఈ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ అదనపు శ్రద్ధ తీసుకోవడమే ఈ 50 రోజుల ప్రణాళిక ముఖ్య లక్ష్యం..

తెలంగాణ పదో తరగతి2021 సిలబస్, టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గెడైన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అవగాహనే ముఖ్యం..
2020-21 విద్యా సంత్సరం ప్రారంభం నుంచి ఆన్‌లైన్ బోధన, వీడియో పాఠాలతోనే గడిచింది. 8 నెలల పాటు సాగిన ఈ కొత్త పద్ధతిలో బోధనతో 70 శాతం సిలబస్ ముగిసింది. కోవిడ్ ప్రభావంతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. విద్యార్థులకు అలవాటుగా వస్తున్న ప్రత్యక్ష తరగతులకు బదులుగా కొత్త విధానం బోధనతో పాఠ్యాంశంపై సరైన అవగాహనలో స్పష్టత లోపించింది. బోధన సిబ్బంది విద్యార్థులతో వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడి బోధన తీరుపై అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ విద్యార్థికి మాత్రం ప్రత్యక్ష బోధనతో కలిగిన ప్రయోజనం భర్తీ కాలేదు.. ఈ అంశాన్ని గుర్తించిన అధికారులు ప్రత్యేక కార్యాచరణ ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లారు.

ఈ క్రమంలో బీసీ గురుకుల సొసైటీ కార్యాచరణకు సిద్ధమైంది. ఇదే ప్రణాళికను అటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాలు ఈనెల 20వ తేదీ నుంచి అమలు చేయనున్నాయి. మరోవైపు మైనార్టీ సంక్షేమ శాఖ కూడా ప్రత్యేక కార్యాచరణ అమలుకు మొగ్గు చూపుతోంది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నిర్దేశించిన 50 రోజుల ప్రణాళిక ముగియనుంది. 100 శాతం ఫలితాలు ప్రధాన లక్ష్యమే అయినప్పటికీ.. ఉత్తమ గ్రేడ్లు ఎక్కువ మందికి వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతూ సందేహాల నివృత్తికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే ప్రతి అంశంపై స్పష్టత వచ్చే విధంగా రాత పూర్వక అభ్యాసం చేయించేలా ప్రత్యేక ప్రణాళికలో నిర్దేశించారు.
Published date : 18 Feb 2021 04:38PM

Photo Stories