Skip to main content

35% convenor quota seats: ప్రైవేట్‌ యూనివర్సిటీల్లోని 35% సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీకి కసరత్తులు..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో సీట్లు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి.
ఈ వర్సిటీల్లో 35 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో భర్తీ చేయనుండటంతో ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటివరకు ఆర్థిక స్థోమత కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వర్సిటీల్లో చేరే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకూ కల్పిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ఖర్చులకు డబ్బులు కూడా చెల్లిస్తూ పేద విద్యార్థులు అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. 2021–22 విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని ప్రైవేట్‌ వర్సిటీల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర ‘సాక్షి’కి వివరించారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కూడా తెచ్చిందని తెలిపారు. దీనివల్ల ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులన్నిటిలోనూ ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ‘ఏపీ ఈఏపీ సెట్‌’ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా, ఇతర కోర్సుల్లో సంబంధిత విధివిధానాలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అమరావతి, వెల్లూరు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అమరావతి, సెంచూరియన్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం, కేఆర్‌ఈఏ యూనివర్సిటీ శ్రీసిటీ సూళ్లూరుపేట, వేల్టెక్‌ యూనివర్సిటీ చిత్తూరు తదితర ప్రైవేట్‌ యూనివర్సిటీల్లోని వివిధ కోర్సులలో 35 శాతం సీట్లు ప్రభుత్వ పరిధిలో భర్తీ కానున్నాయి.

నాడు నిబంధనలు గాలికి..
గత సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారాన్ని తప్పించుకునేందుకు కన్వీనర్‌ కోటా నిబంధన అమలును గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఈ నిబంధనను పట్టించుకోలేదు. ఇప్పుడు దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించడంతోపాటు ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల పథకం కింద అందచేసి విద్యార్థులను ఆదుకుంది. ఫీజులను ఎగ్గొట్టే ఆలోచన చేయకుండా పేద విద్యార్థులు మంచి కాలేజీల్లో ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు ప్రముఖ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయూత అందిస్తోంది.

35 శాతంతో విద్యార్థులకు ఎంతో మేలు...
ప్రతిష్టాత్మక ప్రైవేట్‌ వర్సిటీల్లో ప్రవేశాలు పొందడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులు సైతం చదువుకునేలా చర్యలు చేపట్టారు. వీటిల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు ఇప్పటివరకు అమలు కావడం లేదు. ఇకపై 35 శాతం సీట్ల భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఇవే కాకుండా డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని సీట్లు కూడా ఇదే విధానంలో భర్తీ కానున్నాయని అధికార వర్గాలు వివరించాయి.

‘ఏపీ ఈఏపీ సెట్‌’ ద్వారా ప్రొఫెషనల్‌ సీట్ల భర్తీ
ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్‌ సీట్లను ఏపీ ఈఏపీ సెట్‌ (గతంలో ఏపీ ఎంసెట్‌) ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలలోని సీట్లను ఏపీ ఈఏపీ సెట్‌లో ర్యాంకర్లకు కన్వీనర్‌ కోటాలో కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోటా సీట్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర పథకాలు వర్తిస్తాయి. కన్వీనర్‌ కోటా ఫీజులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేయడం ద్వారా ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ పేదలకు ఉత్తమ కళాశాలల్లో చదువుకునే అవకాశం దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఫీజులను చెల్లిస్తోంది. అలాగే ప్రైవేట్‌ వర్సిటీలలోని 35 శాతం సీట్లను ఇదే విధానంలో భర్తీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని సీట్లను గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి భర్తీ చేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రైవేట్‌ వర్సిటీల్లోని నాన్‌ ప్రొఫెషనల్‌ యూజీ కోర్సులలో 35 శాతం సీట్లను ఆన్‌లైన్‌లో మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి భర్తీ చేయనున్నారు. ఈ వర్సిటీల్లోని వివిధ కోర్సులలో సీట్లు, భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నామని సతీష్‌చంద్ర వివరించారు.

ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేట్‌ కాలేజీల్లో 1.39 లక్షల సీట్లు
రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 272 కాలేజీల్లో 1,39,862 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. ఈసారి కొత్తగా మహిళల కోసం ఆంధ్రా యూనివర్సిటీలో 300 సీట్లతో మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీకి అనుమతి లభించింది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉంటాయి.

వర్సిటీల్లో 4,260.. ప్రైవేట్‌లో 1,35,602
రాష్ట్రంలోని మొత్తం 1,39,862 ఇంజనీరింగ్‌ సీట్లలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు 4,260 కాగా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 1,35,602 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కాలేజీల్లో 21,135 సీట్లుండగా కృష్ణా జిల్లాలో 33 కళాశాలల్లో 17,999 సీట్లు ఉన్నాయి. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో పది కాలేజీల్లో 4,434 సీట్లున్నాయి. ఈసారి ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఆర్టిఫిషియల్‌ ఇంజనీరింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డేటా సైన్స్‌ తదితర విభాగాల్లో 6,660 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ వర్సిటీల్లోని సీట్లు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది.

గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లు
  • l గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,800 కోట్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించి జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థుల చదువులకు భరోసా కల్పించింది. అవికాకుండా ఫీజుల కిందనే మరో రూ.4,207 కోట్లు తొలి ఏడాది ఈ ప్రభుత్వం చెల్లించింది.
  • l ఇక రెండో సంవత్సరం ఎలాంటి ఫీజుల బకాయిలు లేకుండా కాలేజీలకు ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ.671 కోట్లు, రెండో విడతగా జూలైలో రూ.694 కోట్లకుపైగా విడుదల చేసింది. గత సర్కారు మిగిల్చిన పాత బకాయిలను తీర్చడంతోపాటు అవి కాకుండా ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల కింద ఇచ్చింది.
Published date : 30 Aug 2021 03:25PM

Photo Stories