Skip to main content

సివిల్స్-2019 మెయిన్స్‌లో విజయానికి మార్గాలు..!

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష జూన్ 2న ముగిసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అభ్యర్థుల అంచనాకు అందని విధంగా ప్రశ్నపత్రం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఊహించని రీతిలో ప్రశ్నల సరళి ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కాన్సెప్టుల ఆధారంగా ప్రశ్నలు అడిగారన్నది నిపుణుల మాట. దాంతోపాటు సమకాలీన అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. లక్షల మంది అభ్యర్థులు పోటీపడిన సివిల్స్-2019 ద్వారా భర్తీచేసే ఖాళీల సంఖ్య 896. పోస్టుల సంఖ్యకు 12 నుంచి 13 రెట్ల మందిని ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రివ్యూతోపాటు మెయిన్ పరీక్షలో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...
సంపూర్ణ అవగాహన ఉంటేనే...
200 మార్కులకు జరిగిన ప్రిలిమ్స్ పేపర్1లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రామాణిక ప్రశ్నలు వచ్చాయి. పరీక్ష మీద పూర్తిగా దృష్టిసారించిన అభ్యర్థులు మాత్రమే సంతృప్తికరంగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారనీ ఓ అభ్యర్థి అభిప్రాయపడ్డాడు. ప్రశ్నలు చూడటానికి సులువుగానే కనిపిస్తున్నా.. ఐచ్ఛికాల ఆధారంగా సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. సబ్జెక్టుల వారీగా సమప్రాధాన్యం కనిపించినా.. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. అందులోనూ పర్యావరణం, బయోడైవర్సిటీ విభాగం నుంచి కాస్త ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. వేరియబుల్ డివెసైస్, డీఎన్‌ఏ, హెపటైటిస్ బి వైరస్, ఆర్‌ఎన్‌ఏ ఇంటర్‌ఫియరెన్స్ టెక్నాలజీ మొదలైన టెక్నికల్ ప్రశ్నల సంఖ్య అధికంగానే ఉంది. హిస్టరీలో మధ్యయుగ చరిత్ర నుంచి గతంలో చాలా తక్కువగా ప్రశ్నలు అడిగేవారు. కానీ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా 5,6 ప్రశ్నలు మధ్యయుగ చరిత్ర నుంచి రావడం విశేషం. అలానే, ఆధునిక చరిత్ర నుంచి 7 ప్రశ్నలు, ప్రాచీన చరిత్ర నుంచి 1,2 ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రధానంగా స్వాతంత్య్ర అనంతర పరిణామాలపై కూడా ప్రశ్నలు రావడం అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ చట్టాలపై ప్రశ్నలు :
పాలిటీలో హక్కుల మీద అడిగిన ప్రశ్నలు పర్వాలేదనిపించినా.. ఇతర టాపిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. 44వ, 99వ రాజ్యంగ సవరణలు, 9వ షెడ్యూల్ నుంచి లోతుగా ప్రశ్నలు అడిగారు. ఎకనామిక్స్ బేసిక్స్‌పై ప్రశ్నలు వచ్చాయి. పర్యావరణం అంశం నుంచి సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రూల్స్-2016, పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్స్ రూల్స్, మేనేజ్‌మెంట్, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వంటి సామాజిక సమస్యలకు సంబంధించిన చట్టాలపై ప్రశ్నలు గమనించవచ్చు.

పేపర్ 2 కూడా క్లిష్టంగానే ..
ప్రిలిమ్స్ పేపర్ 1లానే పేపర్ 2 కూడా క్లిష్టంగానే ఉంది. ముఖ్యంగా రెండో పేపర్‌లో కాంప్రెహెన్షన్ విభాగం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. మొత్తంగా రెండు పేపర్ల ప్రశ్నల కాఠిన్యత ఓ మోస్తరు నుంచి ఎక్కువ కఠినంగా ఉంది. కటాఫ్ కూడా గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కటాఫ్ జనరల్ కేటగిరీలో 100 -110 ఉంటుందని అంచనా.

మెయిన్స్ ప్రిపరేషన్ :
సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు జూలైలో విడుదలయ్యే అవకాశముంది. సుమారు 11వేల మందిని మెయిన్‌కు ఎంపిక చేసే వీలుంది. ప్రిలిమినరీ బాగా రాశామని భావిస్తున్న అభ్యర్థులు.. సెప్టెంబర్ 20 నుంచి మొదలయ్యే మెయిన్‌కు ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. అందుబాటులో ఉన్న సుమారు 90 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుదీర్ఘ సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మెయిన్ పరీక్ష అత్యంత కీలకం. ఇందులో సాధించే మార్కులు సివిల్స్ విజయంలో నిర్ణయాత్మకం. కాబట్టి పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్ పరీక్షలో విజయం కోసం అభ్యర్థులు పూర్తి ఏకాగ్రతతో కృషిచేయాలి.

పేపర్లు... తొమ్మిది :
సివిల్స్ మెయిన్స్‌లో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి. రెండు లాంగ్వేజ్ (ఇంగ్లిష్, స్థానిక భాష - ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చిన భాష) పేపర్లు అర్హత పేపర్లు మాత్రమే. మిగిలిన ఏడు పేపర్లలో ఒకటి జనరల్ ఎస్సే, నాలుగు జనరల్‌స్టడీస్ పేపర్లతోపాటు ఒక ఆప్షనల్‌కు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 చొప్పున మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ జాబితా రూపకల్పనకు ఈ ఏడు పేపర్లలో సాధించే మార్కులే ఆధారం. రాత పరీక్ష 1750 మార్కులతోపాటు ఇంటర్వ్యూకు కేటాయించిన 275 మార్కులు కలుపుకొని మొత్తం 2025 మార్కులకు అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

జనరల్ ఎస్సే :
చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్‌కు బాగా ప్రిపేరైతే.. జనరల్ ఎస్సేలో మంచి మార్కులు పొందవచ్చనుకుంటారు. కానీ అది వాస్తవం కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటిసారి మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు అతి ఆత్మవిశ్వాసంతో ఎస్సేను సులువైనదిగా భావిస్తుంటారు. జీఎస్ పేపర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సే పేపర్‌లో వేర్వేరు అంశాల మీద మన అభిప్రాయాలు ప్రతిబింబించేలా సృజనాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో కంటెంట్‌తోపాటు ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో ప్రభావవంతంగా, చక్కటి భాషతో ఎలాంటి గ్రామర్, స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయగలిగితేనే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఎస్సేల్లో ఒక ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించకూడదు.
ఎస్సే పేపర్‌లో రాణించడానికి యోజన, ఈపీడబ్ల్యూ, ఎకనామిక్ సర్వే వంటి వాటిలో వివిధ నిర్దిష్టమైన సమస్యలకు సంబంధించి కథనాలు ఉపయోగపడతాయి. జనరల్ ఎస్సేకు సంబంధించి ముఖ్యంగా సరళమైన, స్పష్టమైన భాష ఉపయోగించాలి. సంక్లిష్ట పదాలు ఉపయోగించే క్రమంలో మొదట వాటి నిర్వచనాలు రాస్తే.. మనం చెప్పదలుచుకున్నది సులువుగా అర్థమవుతుంది. వాక్యాలను చిన్నవిగా, ప్రభావవంతంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఎస్సే రాసేటప్పుడు సబ్ హెడ్డింగ్స్‌ను వినూత్నంగా పెట్టడం లాభిస్తుంది. వ్యాసాన్ని పలు కోణాల్లో స్పృశించాలి. ప్రతికూల, సానుకూల అంశాలు రాస్తూ సమతుల్యత పాటిస్తూ.. నిర్మాణాత్మక ముగింపు ఇవ్వాలి.

జీఎస్..1000 మార్కులు :
  • మెయిన్స్‌లో జనరల్ స్టడీస్‌లో నాలుగు పేపర్లు ఉన్నాయి. వీటికే 1000 మార్కులు ఉంటాయి. వీటిలో భారత వారసత్వం, సంస్కృతి, చరిత్ర, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ, సమాజం జీఎస్ పేపర్-1గా.. గవర్నెన్స్, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు జీఎస్ పేపర్2గా ఉన్నాయి. టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, పర్యావరణం, భద్రత, విపత్తు నిర్వహణ అంశాలను జీఎస్ మూడో పేపర్‌లో చేర్చారు. జీఎస్ నాలుగో పేపర్‌లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ అంశాలు ఉంటాయి.
  • అభ్యర్థులు ఇప్పటికే ఒక దశ ప్రిపరేషన్ పూర్తిచేసుంటారు. అలాంటి వాళ్లు కొత్త మెటీరియల్ జోలికి వెళ్లకుండా.. గతంలో చదివిన వాటినే మళ్లీ మళ్లీ చదవాలి. పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్‌కు సంబంధించిన కోర్ సబ్జెక్టును సమకాలీన అంశాలతో జోడించి చదువుకోవాలి. జీఎస్ పేపర్1 మినహా అన్ని పేపర్లలోనూ కరెంట్ అఫైర్స్‌దే ప్రముఖ పాత్ర. ఈ పేపర్‌లో అడిగే ప్రశ్నలకు వాటికి సంబంధించిన సమకాలీన పరిణామాలను జోడిస్తూ సమాధానాలు రాస్తే సంపూర్ణంగా ఉంటుంది. అభిప్రాయాలు వ్యక్తంచేసే క్రమంలో ఇచ్చే గణాంకాలు, చెప్పే కారణాలు సహేతుంగా ఉండాలి.

రైటింగ్ ప్రాక్టీస్ :
పోటీపరీక్షల్లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రాత పరీక్షలు నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోవకు చెందిందే. కొంతమంది అభ్యర్థులకు సబ్జెక్ట్ పరిజ్ఞానం బాగానే ఉన్నా.. పరీక్షలో సరిగా రాయలేక వెనకబడుతుంటారు. కాబట్టి అభ్యర్థికి మెయిన్ పరీక్షలో ఎంత నాలెడ్జ్ ఉందనే దానికంటే.. ఎంత బాగా రాశారనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. సగటున 150 నుంచి 200 పదాలలో సంపూర్ణంగా సమాధానాలు రాసేలా సిద్ధమవ్వాలి. అందుకు అభ్యర్థుల ముందున్న అస్త్రం.. రైటింగ్ ప్రాక్టీస్. రోజులో కొంత సమయాన్ని దీనికి కేటాయించాలి. పరీక్షలకు సమయం తక్కువ ఉన్న దృష్ట్యా ఒకటి, రెండు ప్రశ్నలకు కాకుండా.. సాధ్యమైనన్ని వాటికి సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి వారం పూర్తిస్థాయి పరీక్షలకు హాజరవుతూ నిపుణులతో వాల్యూయేషన్ చేయించుకోవాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుంటూ చేసిన పొరపాట్లను, జోడించాల్సిన అంశాలను గుర్తించి నోట్ చేసుకోవాలి. నిరంతరం రైటింగ్ ప్రాక్టీస్ వల్ల మెయిన్ పరీక్షలో ఎంత ఒత్తిడిలోనైనా పరీక్షను సునాయసంగా రాసేందుకు వీలవుతుంది. ఆయా టాపిక్స్‌పై అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. ఎందుకంటే... పూర్తి అవగాహన లేకుండా రాసే సమాధానాలు గందరగోళంగా ఉంటాయి. సబ్జెక్టుపై పట్టు లేకుంటే అనవసర విషయాలు రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఎగ్జామినర్ ఇట్టే పసిగట్టగలరు.

ఆప్షనల్.. లోతుగా :
ఆప్షనల్‌లో రెండు పేపర్లకు లోతైన ప్రిపరేషన్ అవసరం. ఇప్పటికే సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్‌ను పరీక్ష ముందు వరకూ పునశ్చరణ చేయాలి. ఇందులో ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకూడదు. ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్‌ను బట్టి ప్రణాళిక వేసుకోవాలి. ఆఫ్షనల్ ఏదైనా పీజీ స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు ఎంచుకున్న అభ్యర్థులు... జీఎస్, ఆప్షనల్ కలిపి ప్రిపేర్ అవ్వొచ్చు. ఎంచుకున్న ఆప్షనల్‌ను బట్టి తాజాగా సంబంధిత రంగాల్లో జరిగిన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

ప్రిపరేషన్ కొనసాగించాలి...
కటాఫ్ మార్కులకు దగ్గరగా ఉన్నామనుకునే అభ్యర్థులు మెయిన్‌కు సన్నద్ధం కావాలి. ఈసారి ప్రిలిమ్స్ కూడా ఎప్పటిలానే ఊహించని విధంగా వచ్చింది. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యత కనిపించింది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. కటాఫ్ జనరల్ అభ్యర్థులకు 97-103 ఉండొచ్చు. ప్రిలిమినరీ ఫలితాలు వెలువడే సమయానికి ఎథిక్స్, ఆప్షనల్ పేపర్లను చదివేయడం ఉత్తమం. ఇక ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్టు కూడా బాగా రాసిన అభ్యర్థులు.. ఈ రెండు పరీక్షలకు సమంగా ప్రిపేర్ అవ్వాలి. ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఏపీ కేంద్రంగా ఉండే సిలబస్‌ను చదవాలి. అప్పటివరకు ఉమ్మడిగా కనిపించే సిలబస్‌ను చూసుకోవాలి. సివిల్స్ ప్రిలిమ్స్ బాగా రాయని అభ్యర్థులు ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ చదువుకోవాలి.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ
Published date : 21 Jun 2019 11:39AM

Photo Stories