Skip to main content

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2016 సన్నద్ధత

ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల ఎంపిక ప్రక్రియలో రెండో దశ. సివిల్స్-2016 ప్రిలిమ్స్ పరీక్ష ఇటీవల ముగిసింది. ఇక.. అభ్యర్థులు దృష్టిసారించాల్సింది మెయిన్స్‌లో విజయంపైనే! ఈ క్రమంలో నిపుణులు, గత విజేతల సలహాలతో విశ్లేషణాత్మక కథనం..
ప్రిలిమ్స్‌లో 105-115 మధ్య మార్కులు వస్తాయనుకునే అభ్యర్థులు మెయిన్స్పై తక్షణం దృష్టిసారించాలి. అర్హత పేపర్లు సహా మొత్తం తొమ్మిది పేపర్లు ఉండే మెయిన్.. డిసెంబర్ 3న ప్రారంభం కానుంది. అంటే అభ్యర్థులకు దాదాపు 100 రోజుల సమయం అందుబాటులో ఉంది. మెయిన్‌లో విజయానికి ఈ సమయం చాలా కీలకం. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. వాస్తవానికి అభ్యర్థులు ప్రిలిమ్స్ ముగిసే నాటికే మెయిన్ ప్రిపరేషన్‌ను 50-60 శాతం మేర పూర్తి చేస్తుంటారు. ఇలాంటి అభ్యర్థులు ప్రస్తుతం.. సిలబస్‌లో చదవాల్సిన కొత్త అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్స్‌కు కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించిన వారు మరింత ప్రత్యేకంగా వ్యవహరించాలి.

సిలబస్ విశ్లేషణ
తొలుత సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా గత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. ప్రశ్నలు అడుగుతున్న తీరు, వెయిటేజీ అంశాలను గుర్తించాలి. వీటికి అనుగుణంగా తాము చదవాల్సిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో ఒక జాబితాగా రూపొందించుకోవాలి. దీని ప్రకారం చదవడానికి ప్రణాళికను రూపొందించుకోవాలి.

సమతుల్యత.. సమకాలీనం
ప్రిపరేషన్ పరంగా సమతుల్యత పాటించాలి. అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చేలా సమయం కేటాయించాలి. వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. సమకాలీన పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ ప్రిపేరవడం చాలా ముఖ్యం. ప్రధానంగా జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ పేపర్-2, పేపర్-4లకు ఇది ఎంతో అవసరం. పేపర్-3 విషయంలోనూ కాంటెంపరరీ అప్రోచ్ మెరుగైన ప్రదర్శనకు దోహదం చేస్తుంది.

రాజ్యాంగం- చరిత్ర
భారత రాజ్యాంగంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. అధికరణలు, సవరణలను సమకాలీన పరిపాలన, కొత్త చట్టాలతో అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. జనరల్ స్టడీస్ పేపర్-1లో ఉండే చరిత్రకు సైతం సమకాలీన దృక్పథంతో ప్రిపరేషన్ మేలు చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్య చారిత్రక ఘట్టాలు-వాటి ప్రభావాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా సాహిత్యం, కళలు, వాస్తు శిల్ప కళ, ఉద్యమాలపై దృష్టిసారించాలి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమం కీలక ఘట్టాలు, వాటి ప్రభావాలను చదవాలి.

జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ అండ్ టీ
జాగ్రఫీకి సంబంధించి కోర్ జాగ్రఫీ, కాంటెంపరరీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహజ వనరులు, ఆయా ప్రాంతాల భౌగోళిక విశిష్టతలు, ప్రపంచ దేశాల భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి. వీటితోపాటు భౌగోళిక పరిస్థితులను ప్రభావం చేసేలా ఇటీవల కాలంలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలపై సమకాలీన అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. ఎకానమీ ప్రిపరేషన్‌లో స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు దేశంలో చోటుచేసుకున్న ఆర్థికపరమైన ముఖ్య పరిణామాలను చదవాలి. ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, 1991 ఆర్థిక సంస్కరణలు.. వాటి లక్ష్యాలు - ఫలితాలు - ప్రభావాలపై పట్టు సాధించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో భారత్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు, ఇతర దేశాలతో కలిసి చేస్తున్న ప్రాజెక్టులు, రక్షణ రంగంలో ప్రయోగాలు గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు బేసిక్ సైన్స్‌కు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి.

అభ్యసనం.. వినూత్నంగా
ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టులోని అంశాలను సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకుంటూ, అన్వయించుకుంటూ చదవాలి. వివిధ అంశాలను అభ్యసిస్తున్నప్పుడు అభ్యర్థులు వినూత్నంగా వ్యవహరించాలి. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. నిర్దిష్టంగా ఒక సబ్జెక్టులో ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు ఆ అంశం ప్రాధాన్యాన్ని విశ్లేషించగలిగే నైపుణ్యం, ప్రస్తుత పరిస్థితులతో అన్వయించే లక్షణం ఎంతో అవసరం. అదే విధంగా ఆ అంశం నుంచి ఎన్ని కోణాల్లో ప్రశ్న అడగొచ్చు? అనే దానిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలతో సినాప్సిస్ రూపొందించుకోవాలి. అంతేకాకుండా తాము ఎంపిక చేసుకున్న మెటీరియల్‌లో ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసుకునే విధంగా అండర్‌లైన్ చేసుకుంటే రివిజన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

పరీక్షకు 20 రోజుల ముందు
మెయిన్స్ ప్రారంభానికి 20 రోజులు ముందు నుంచి ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్‌టెస్ట్‌లకు హాజరుకావాలి. వీటి ద్వారా ప్రిపరేషన్ స్థాయిని, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఒక అంశాన్ని అధ్యయనం చేయడం పూర్తికాగానే దాన్నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముందో అంచనా వేసి.. వాటికి సమాధానాలు రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు సంబంధించి ప్రిపరేషన్ పూర్తయ్యాక వాటికి సంబంధించి రావడానికి అవకాశమున్న ప్రశ్నలు (ఉదా: స్థానిక సంస్థల ప్రాధాన్యం; 73, 74 సవరణల ప్రాధాన్యం, ప్రస్తుతం స్థానిక సంస్థల పరిపాలన పరిస్థితులు) రూపొందించుకుని సమాధానాలు రాయాలి. ఈ సమాధానాలు రాసేటప్పుడు పరీక్ష సమయంలో ఒక ప్రశ్నకు లభించే సగటు సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా స్వీయ విశ్లేషణ చేసుకోవడం వల్ల నిర్ణీత సమయంలో ఎన్ని ముఖ్యమైన పాయింట్లు రాయగలిగారు? మిగిలిపోయిన పాయింట్లు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలపై స్పష్టత వస్తుంది. ఇలా రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షలో మెరుగైన ప్రదర్శనకు ఆస్కారం లభిస్తుంది. అభ్యర్థులు మొత్తం 1750 మార్కులకు నిర్వహించే పరీక్షలో 1000 మార్కులు లక్ష్యంగా కదిలితే మెయిన్‌లో విజయావకాశాలు ఖాయమవుతాయని నిపుణుల అభిప్రాయం.

ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు- విధానం; అంతర్జాతీయ ఉగ్రవాదం; ఇటీవల కాలంలో భారత్‌తో ఇతర దేశాల మైత్రీ సంబంధాలు - ఒప్పందాలు; రియో ఒలింపిక్స్; ఆర్థిక సంస్కరణలు - 25 ఏళ్ల కాలంలో పరిణామాలు; నీతి ఆయోగ్ క్రియాశీలత; జీఎస్‌టీ బిల్లు; భూ సేకరణ చట్టం- 2013; అంతర్జాతీయంగా జరిగిన సదస్సులు- తీర్మానాలు - లక్ష్యాలు - భవిష్యత్తు పరిణామాలు; జాతీయ స్థాయిలో కొత్త ప్రజా సంక్షేమ పథకాలు.

రైటింగ్ ప్రాక్టీస్ ప్రధానం
మెయిన్స్ ప్రిపరేషన్‌కు సంబంధించి కేవలం చదవడానికే పరిమితం కాకుండా రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల పరీక్ష రోజున నిర్ణీత సమయంలో కచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇచ్చే సామర్థ్యం ఏర్పడుతుంది. పరీక్ష హాల్లో సైతం అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని.. గ్రాఫ్‌లు, చార్ట్‌ల రూపంలో సమాచారం పొందుపరచడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.
- పి.ప్రావీణ్య, 82వ ర్యాంకు, సివిల్స్-2015.

ప్రజెంటేషన్ ముఖ్యం
మెయిన్స్‌లో విజయానికి ఆన్సర్ ప్రజెంటేషన్ ఎంతో కీలకం. ఒక ప్రశ్నను కేవలం వ్యాసం మాదిరిగా మూసగా పేరాగ్రాఫ్‌లుగా రాసుకుంటూ వెళ్లడం కంటే కొంత భిన్నంగా వ్యవహరించాలి. పాయింటర్స్, అండర్‌లైన్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి నా విషయంలో మెయిన్స్‌లో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ వల్లే మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో 161 మార్కులే వచ్చినా.. మెయిన్స్‌లో 817 మార్కులు లభించాయి. అభ్యర్థులు వీలైనంత వరకు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు, సెల్ఫ్ టెస్ట్‌లు రాసుకుంటూ నిరంతరం తమ ప్రిపరేషన్ స్థాయిని బేరీజు వేసుకుంటూ సాగాలి.
- సి.కీర్తి, సివిల్స్ 2015 విజేత.

సివిల్స్-2015 మెయిన్స్ కటాఫ్స్
సివిల్స్-2015కు సంబంధించి యూపీఎస్సీ ప్రకటించిన కటాఫ్‌ల వివరాలు కేటగిరీల వారీగా...
కేటగిరీ మెయిన్స్ కటాఫ్ మార్కులు ఇంటర్వ్యూ కటాఫ్ మొత్తం కటాఫ్
జనరల్ 676 201 877
ఓబీసీ 630 204 834
ఎస్సీ 622 188 810
ఎస్టీ 617 184 801

మెయిన్స్ తర్వాత అభ్యర్థులను 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది.
మెయిన్, ఇంటర్వ్యూలకు మొత్తం 2025 మార్కులు కేటాయించారు.

మెయిన్స్ పరీక్ష విధానం
పేపర్-ఎ: ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులు
పేపర్-బి: ఇంగ్లిష్ 300 మార్కులు
ఈ రెండు పేపర్లు అర్హత పేపర్లు.

మెయిన్స్ ప్రధాన పేపర్లు

పేపర్    సబ్జెక్టు మార్కులు
పేపర్-1 జనరల్ ఎస్సే 250
పేపర్-2 జీఎస్-1 (హిస్టరీ, జాగ్రఫీ) 250
పేపర్-3 జీఎస్-2 (పాలిటీ) 250
పేపర్-4 జీఎస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) 250
పేపర్-5 జీఎస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ ఆప్టిట్యూడ్) 250
పేపర్-6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1 250
పేపర్-7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2 250
మొత్తం 1750
Published date : 23 Aug 2016 02:06PM

Photo Stories