Skip to main content

పాలిటీకి పక్కా వ్యూహం అవసరం.. అది ఉంటే విజయం తథ్యం

సివిల్స్ - ప్రిలిమ్స్
జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ అత్యున్నతమైంది, కఠినమైంది. ఈ ఏడాది ప్రకటించిన నూతన విధానంలో జనరల్ స్టడీస్కు ప్రాధాన్యం పెరిగింది. విస్తృత, లోతైన, వైవిధ్యమైన అంశాలను మెయిన్స్ సిలబస్లో చేర్చడం వల్ల జనరల్ స్టడీస్లో పట్టు సాధించడం కష్టసాధ్యమని భావించొచ్చు. ఈ నేపథ్యంలో క్రియాశీలకంగా పోటీపడుతున్న అభ్యర్థులు తమ వ్యూహాన్ని, పద్ధతిని పునః సమీక్షించుకోవాలి.

పాలిటీకి పెరిగిన ప్రాముఖ్యం:
ప్రతి పోటీ పరీక్షలో పాలిటీ విభాగం ముఖ్యమైంది. సివిల్స్ మెయిన్స తాజా విధానంలో పాలిటీకి సంబంధించి 250 మార్కులతో ఒక ప్రత్యేక పేపర్ను కేటాయించారు. పాలిటీపై పట్టుసాధిస్తే ఇతర విభాగాలకూ ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్య్వూలో మరింత ప్రయోజనాన్ని పొందొచ్చు. సాధారణంగా ఇంటర్య్వూలో అధిక ప్రశ్నలు పాలిటీ నేపథ్యం నుంచే అడుగుతున్నారు.

సిలబస్ సూచనాత్మకమే:
జీఎస్లో ఇండియన్ పాలిటీకి ప్రత్యేకత ఉంది. సిలబస్ నిర్దేశించినప్పటికీ అది నిరంతరం విస్తృతమవుతూనే ఉంటుంది. ఎన్నో నూతన అంశాలు, వ్యాఖ్యానాలు, సమకాలీన అంశాలు, వివరణలు చేరుతుంటాయి. ప్రతి సమకాలీన రాజకీయ పరిణామం రాజ్యాంగంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి అందుబాటులో ఉన్న సమయం నుంచి గరిష్టంగా లబ్ధి పొందాలంటే తక్షణ వ్యూహం రూపొందించుకోవాలి.

ఇండియన్ పాలిటీ కంటెంట్ ఏమిటి?
దేశ పరిపాలనకు మూలం రాజ్యాంగం. కాబట్టి పాలిటీ అంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ నిర్మా ణం, రాజ్యాంగ ముఖ్యలక్షణాలు, లక్ష్యాలు, వాటి పనితీరు మొదలైన అంశాలు ఉంటాయి. ముఖ్యంగా రాజ్యాంగ చరిత్ర, రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, రాష్ర్టపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, సమాఖ్య పద్ధతి-కేంద్ర, రాష్ర్ట సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలు-నూతన పంచాయితీ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పరిపాలన-సుపరిపాలన, పాలనా సంస్కరణలు, ప్రత్యేక వర్గాల హక్కు లు, సంరక్షణ, సామాజిక న్యాయసాధన, సాధికారత మొదలైన అంశాలను స్థ్ధూలంగా పేర్కొన్నారు.

ప్రతీ అంశం సమకాలీనమే!
జీఎస్లో వచ్చే ప్రతీ ప్రశ్న సమకాలీన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. రాజ్యాంగంలోని వివిధ వ్యవస్థలు, రాజకీయ పరిణామాల వల్ల ప్రభావితం అవుతాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, వాస్తవికతకు గుణాత్మక తేడా ఉంటోంది. తాజా పరిణామాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు, సవరణలు జోడించి చదవాలి. ప్రాథ మిక హక్కులు విస్తరణ-విద్యాహక్కు, సమా చార హక్కు, మైనారిటీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, చట్టసభల్లో మహిళల కోటా, రాష్ర్టపతి క్షమాభిక్ష అధికారాలు, మహిళలపై లైంగిక హింస, వేధిం పులు, ఉరిశిక్ష, ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాలు, స్వయం ప్రతిపత్తి, అభివృద్ధి కౌన్సిళ్లు, లోక్పాల్ బిల్లు... మొదలైన అంశాల్లో సమకాలీన ప్రాధాన్యం సంతరించుకున్న రాజకీయ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ప్రశ్నల స్థాయి, సరళి- వైవిధ్యమే:
సివిల్స్ ప్రిలిమ్స్ జీఎస్లోని అన్ని విభాగాల్లో అడిగే ప్రశ్నలు అభ్యర్థి జ్ఞానాన్ని అంచనా వేయడమే కాకుండా, అవగాహన, అనువర్తన, తర్కాన్ని కూడా పరీక్షించేవిగా ఉంటాయి. విస్తృత అధ్యయనం, లోతైన అవగాహన, తార్కిక ఆలోచన, సమగ్ర దృక్పథం ఉన్నప్పుడే ఎక్కువ స్కోర్కు అవకాశం ఉంటుందనేది అభ్యర్థులు గమనించాలి. లీనియర్ అప్రోచ్ కాకుంటే లేయర్స/ లేటరల్ అప్రోచ్ ఉండాలి. ఉదాహర ణకు ఈ ప్రశ్న గమనించండి..

రాష్ర్టపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు. ఈ స్టేట్మెంట్ ద్వారా ఏది వాస్తవమైంది?
ఎ) రాష్ర్టపతిగా పోటీచేయాలంటే పార్లమెంట్లో సభ్యునిగా ఉండరాదు.
బి) పార్లమెంట్ సభ్యునికి ఉండాల్సిన అర్హతలుండాలి.
సి) పార్లమెంట్లో నిర్ణయాత్మక ఓటును కలిగి ఉంటారు.
డి) పైవేవీ వాస్తవమైనవి కావు.
జ: డి

వివరణ:
ప్రకరణ 79 ప్రకారం పార్లమెంట్ నిర్వచనంలో రాష్ర్టపతి అంతర్భాగం. అంటే పార్లమెంట్లోని ప్రతి శాసన ప్రక్రియ రాష్ర్టపతితో ముడిపడి ఉంటుంది. సమావేశాల ఏర్పాటు, ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించటం, బిల్లులకు ఆమోదం తెలపడం, ఆర్డినెన్స్ ల జారీ మొదలైన శాసన అంశాలు ఈ ప్రక్రియలో ఉంటాయి. ఇచ్చిన స్టేట్మెంట్ సభ్యత్వానికి సంబంధించింది కాదు. పోటీ చేయడానికి పార్లమెంట్ సభ్యత్వానికి సంబంధం లేదు. వివిధ పొరలను (లేయర్స) స్పృశించాలి. దీనికి అనుబంధ ప్రశ్న చూడండి.

దేశంలో శాసన సార్వభౌమాధికారం (Legal Sovereign) ఎవరికి ఉంటుంది?
ఎ) పార్లమెంట్ బి) రాష్ర్టపతి సి) ప్రజలు డి) పార్లమెంట్తో రాష్ర్టపతి
జ : డి

వివరణ:
పార్లమెంట్ శాసనశాఖ, చట్టాలను రూపొందించేది పార్లమెంటే. కానీ బిల్లులు చట్టంగా మారాలంటే రాష్ర్టపతి ఆమోదం ఉండాలి. ఇందులో ఇద్దరి ప్రమేయం ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం ‘‘డి’’. ఈ తరహా ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే.. విషయ పరిజ్ఞానం (ప్రకరణ 79 పార్లమెంట్ నిర్వచనం) + అవగాహన (ఎందుకు అంతర్భాగం) + అనువర్తన (ఇచ్చిన సందర్భం శాసన సార్వభౌమాధికారం) తదితరాలు అవసరం.
Linear + layers Þ conclusion

తెలివిని తేల్చే అంశాలు:
కొన్ని ప్రశ్నల విషయంలో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతుగా ఆలోచించాలి. సహజ ప్రతిభ, విచక్షణ శక్తి ఉపయోగించాలి. కేవలం సమాచార సేకరణ, చదవడానికే పరిమితం కారాదు.
ఉదా॥ కింది ప్రశ్నను పరిశీలించండి.
కింద పేర్కొన్న వారిలో ఎవరు అత్యధిక ఎన్నికల్లో ఓటరుగా ఉంటారు?
ఎ) సాధారణ ఓటరు బి) పార్లమెంట్ సభ్యులు
సి) శాసనసభ సభ్యులు డి) శాసన మండలి సభ్యులు
జ: సి

ఆలోచించాలి, పోల్చుకోవాలి, సమాధానం తేల్చాలి. సాధారణ ఓటర్లు కేవలం ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే పాల్గొంటారు.
ఎమ్మెల్యేలు ఏయే ఎన్నికల్లో పాల్గొంటారో తెలిసి ఉండాలి.

విస్తృత అధ్యయనం అనివార్యం:
ప్రిలిమ్స్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అదృష్టానికి, ఊహాగానాలకు ఆస్కారం లేదు. నెగిటివ్ మార్కులుంటాయి. (Penalty for wrong answer) అందువల్ల కష్టాన్ని నమ్ముకోవడమే ఉత్తమం. ఐతే దానికి కొంత తర్కాన్ని జోడించాలి. మెళకువలు పాటించాలి. మెరుగులు దిద్దుకోవాలి. ప్రిపరేషన్ను తరచూ సమీక్షించుకోవాలి. మార్పులు, చేర్పులు, అవసరమైతే చేయాల్సిందే. మూస పద్ధతి మెరుగైన ఫలితాలను ఇవ్వదు. సొంత పద్ధతిని అవలంభించాలి. గుడ్డిగా అనుకరిం చడం ఉపయుక్తం కాదని గుర్తించాలి.

రీడింగ్, రెఫరెన్సకు తేడా తెలియాలి:
ఇది అభ్యర్థులందరికీ సాధారణంగా వచ్చే సందేహం. సిలబస్ విస్తృతి, తాజా స్వభావం దృష్ట్యా ఏవో కొన్ని పుస్తకాలు తిరగేస్తే సరి పోతుందా? అవపోసన.. పరీక్ష అవసరాలను తీరుస్తుందా? అనేది కొంత కఠినమైన అంశమే. ఈ రెండింటి సమతూకం లేదా మేళవింపు చాలావరకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ప్రాథమిక అవగాహనకు ఒకటి లేదా రెండు పుస్తకాలు సమగ్రంగా చదవాలి. సబ్జెక్టుపై లోతైన అవగాహనకు, విస్తృత సమాచారాన్ని అవసరమైన టాపిక్స్లో ప్రామాణిక గ్రంథాలను రెఫర్ చేయాలి. సమాచారం ప్రాథమిక అవగాహనకు రీడింగ్ ఉపయోగపడితే, విషయ విస్తృతికి, స్పష్టతకు, విభిన్న దృక్కోణాలకు రెఫరెన్స దోహదం చేస్తుంది.

ఉదాహరణకు ఈ ప్రశ్నలు గమనించండి.
కేంద్ర సమాచార కమిషన్లో ఎంతమంది సభ్యులుంటారు.
ఎ) పది బి) ఇరవై సి) ఐదు డి) ఏడు
జ: ఎ

ఈ జవాబును గుర్తించడానికి ఏ చిన్న పుస్తకం చదివినా చాలు.
ఈ ప్రశ్నను చూడండి.

లోక్సభ స్పీకర్ ఎన్ని పర్యాయాలు నిర్ణయాత్మక ఓటును వినియోగించారు?
ఎ) ఒకటి బి) మూడు సి) ఐదు డి) ఏదీ కాదు
జ: డి

సమాచారానికి సంబంధించిన ప్రశ్న ఐనప్పటికీ అరుదుగా లభించే సమాచారం. సాధారణ పుస్తకాల్లో ఉండదు. శోధించాలి, సేకరించాలి. మరీ అంత సమయం ఉంటుందా అనేది సందేహం. కాబట్టి అనుభవమున్న ఫ్యాకల్టీ, ఓరియంటేషన్ ఉన్న శిక్షకుల సహాయం అనివార్యం.

గుర్తుంచుకోండి...
ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లు, జీత భత్యాలు, పదవీ కాలం మొదలైన ప్రాథమిక సమాచారంపై పట్టురావాలంటే ఎక్కువ పర్యాయాలు చదవాలి. తరచుగా రివిజన్ చేయాలి. కంఠస్తం చేయడం, సాధ్యం కావచ్చు కానీ, అవసరం లేదు. కొన్ని షార్టకట్స్ టెక్నిక్స్ ఉపయోగించుకోవచ్చు.
ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు, విభాగాల్లో ప్రకరణలు, వివిధ కోర్టు తీర్పులపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి అవసరం.
నూతన సిలబస్లో సామాజిక సమస్యలు, పరిపాలనా క్లేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటి నేపథ్యం, ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయాలి.
ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయా లి. స్వయం అంచనా వేసుకోవాలి. పాసిబుల్ ప్రశ్నలను మీరు ఊహించాలి.
తాజా పరిణామాలు, రాజ్యాంగ సవ రణలు, వివాదాంశాలను లోతుగా పరిశీ లించాలి.
స్వీయ ప్రేరణ, నిరంతర శ్రమ, మొక్కవోని ఆత్మవిశ్వాసం, నిజాయితీ, అవసరమైన మేరకు కోచింగ్, తుదివరకు కొనసాగించే సహనం, ఓర్పును అలవర్చుకోవాలి.
అన్నింటికీ బాధ్యత వహించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి.

Published date : 26 May 2020 05:08PM

Photo Stories