Skip to main content

టీఎస్‌ఐపాస్ 2015 - నూతన పారిశ్రామిక విధానం

పారిశ్రామిక రంగం దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. అభివృద్ధి, పారిశ్రామీకరణ రెండింటినీ వేరుగా చూడలేం. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన పారిశ్రామిక విధానాలతో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్-2015 చట్టం ద్వారా ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత అంశాలపై గ్రూప్స్ గెడైన్స్...
పారిశ్రామికాభివృద్ధి సరైన దిశలో సమగ్రంగా జరిగేందుకు స్పష్టమైన, దీర్ఘకాలిక పారిశ్రామిక విధానం అవసరం. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పారిశ్రామికాభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన పారిశ్రామిక విధానాలు, చట్టాలను అమలు చేస్తుంటాయి.
పారిశ్రామిక విధానం:
ప్రభుత్వాలు రూపొందించే పారిశ్రామిక విధానాల్లో ప్రధానంగా పరిశ్రమలకు అనుమతుల మంజూరు- విధివిధానాలు, పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాల కల్పన, మూలధన వృద్ధి, పారిశ్రామిక సంబంధాలు, ధరల నియంత్రణ, ఆర్థిక స్థోమత కేంద్రీకరణ నిరోధ విధానాలు, గ్రామీణ చట్టాలు, ఆర్థిక సంస్థల ద్వారా పరపతి సహాయం, ఉత్పత్తి నియంత్రణ, పంపిణీ, సబ్సిడీ , వివిధ రకాల ప్రోత్సాహకాలు, విదేశీ మారక నియమాలు (కేంద్రం) తదితర అంశాలను సమగ్ర, పరిపూర్ణమైన విధానంగా రూపొందిస్తారు.
ఆవశ్యకత: రాష్ట్ర పారిశ్రామిక విధానాలు దేశ పారిశ్రామిక విధాన సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. రాజ్యాంగంలో పారిశ్రామి విధానానికి సంబంధించి కొన్ని అంశాలు కేంద్ర జాబితాలో ఉంటే మరికొన్ని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాలోని అంశాల విషయంలో ప్రత్యేకంగా చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. కాని సంబంధిత చట్టాలు కేంద్ర చట్టాలకు అనుగుణంగా ఉండవలసి ఉంటుంది. ఏ అంశంలోనైనా వివాదం తలెత్తితే కేంద్ర చట్టం మాత్రమే చెల్లుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్థూల పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుంది. దీనికి అనుబంధంగా తమ ప్రాంతాల్లోని పరిస్థితులు, వనరులకు అనుగుణంగా సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన ప్రత్యేక పారిశ్రామిక విధానాలను రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు కేంద్రం అనుమతిస్తుంది. పారిశ్రామిక విధానాల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసానికి ఇదే ప్రధాన కారంణం. వ్యత్యాసాలు ఉన్నా అంతిమంగా దేశ పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా రాష్ర్టం పారిశ్రామిక విధానాలను రూపొందించే అవకాశం లేదు. ఆర్థిక లభ్యత, ఇతర పరిమితుల దృష్ట్యా పెద్ద ఎత్తున, విస్తృతమైన సొంత పారిశ్రామిక విధానాన్ని అమలుచేసే అవకాశం రాష్ట్రాలకు తక్కువ ఉంటుంది.
తెలంగాణ-పారిశ్రామిక స్థితిగతలు: తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 2004-05 నుంచి 2014-15 మధ్య 25-30% మధ్య నమోదయింది. పారిశ్రామిక వృద్ధిరేటు 2005-06లో 13.8 శాతం కాగా 2009-10లో 2.3 శాతం తగ్గి 2014-15లో ముందస్తు అంచనాల ప్రకారం 4.1గా నమోదయింది. దీన్ని బట్టి గత పదేళ్లలో రాష్ట్ర పారిశ్రామిక రంగం ఒడిదొడుకులకు లోనైందని చెప్పవచ్చు. 2008-2015 (ఇప్పటి వరకు) భారీ పరిశ్రమల రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.19, 493 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన పరంగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా తర్వాత క్రమంలో మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఈ జాబితాలో నిజామాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. భారీ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి పరంగా మొదటి స్థానంలో రంగారెడ్డి, చివరి స్థానంలో వరంగల్ జిల్లాలు నిలిచాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆశించిన స్థాయిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు జరగలేదు. 2000-01 నుంచి 2014-15 (ఇప్పటి వరకు) కాలంలో రాష్ట్రంలో మొత్తం 40, 894 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యా పరంగా రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా, తర్వాత క్రమంలో హైదరాబాద్, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
పారిశ్రామికాభివృద్ధి-రాష్ట్ర ప్రభుత్వ చర్యలు:
  • దేశ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం 1/3 వంతు వాటాను కలిగి ఉంది.
  • ఫార్మా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది.
  • ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల దగ్గర 11,000 ఎకరాల్లో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటు చేయనుంది.
  • కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ద్వారా రూ.30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు 70,000 ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.
  • హైదరాబాద్ పరిసరాలు ప్రముఖ బల్క్‌డ్రగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఆయా ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉంది.
  • 2013-14లో రాష్ట్రం నుంచి రూ.90,000 కోట్ల విలువైన బల్క్‌డ్రగ్ ఎగుమతులు జరిగాయి.
  • హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం సంకల్పించింది.
  • పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల జారీ కోసం సీఎం ఆఫీస్‌కు అటాచ్‌మెంట్‌గా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు.
  • సులభతరమైన, మెరుగైన పారిశ్రామిక విధానాల్లో భాగంగా ప్రభుత్వం మెగాప్రాజెక్టులు, పారిశ్రామిక క్లస్టర్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు జారీ చేస్తుంది.
  • నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పరిశ్రమల అవసరాలకు 10శాతం నీటి కేటాయింపులు. భూమి కేటాయించడానికి ముందు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
  • ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు స్టాంప్ డ్యూటీ, విద్యుత్ వ్యయం, వ్యాట్ తిరిగి చెల్లింపు, భూమి వ్యయంలో రిబేటు, వడ్డీ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ వంటి అనేక ప్రోత్సహాకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
  • యువత, మహిళలు, పేద వర్గాల ప్రజల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించేందు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది.
  • పారిశ్రామిక పార్కుల భూకేటాయింపుల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రత్యక్ష నిధుల కేటాయింపు, సబ్సిడీ కల్పన, నైపుణ్యాల పెంపొందించేందు కార్యక్రమాల నిర్వహణ.
పారిశ్రామిక అభివృద్ధి- సూచనలు:
  • పారిశ్రామిక రంగ అభివృద్ధికి అనుకూలమైన ‘ అభిలషణీయమైన కోశ విధానాన్ని’ రాష్ట్ర ప్రభుత్వం అవలంభించాలి.
  • వ్యవసాయ, సేవారంగాల నుంచి పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరిగేలా చర్యలు చేపడితే పారిశ్రామిక వస్తు ఉత్పత్తి వృద్ధిరేటు వేగవంతం అవుతుంది.
  • నాణ్యమైన వినియోగ వస్తువుల ఉత్పత్తి పెంచుతూ, ఉత్పత్తి రంగాన్ని క్రమబద్ధీకరిస్తూ పారిశ్రామీకరణలో వైవిధ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి.
  • ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనమిక్ జోన్స్) ఏర్పాటుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఆకర్షించాలి.
  • తద్వారా ఉపాధి పెరుగదలతో పాటు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పెరుదల సంభవిస్తుంది.
  • భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన విధి విధానాలను రూపొందించాలి.
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి, వెనుకబడిన ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడులు పెంచాలి.
  • ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని సాధించాలి.
  • పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థా పూర్వక, దీర్ఘకాలిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి.
పోటీతత్వం- రాష్ట్రాల అనుభవాలు:
ఒక ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం పెంపొందించుకోవటం, డిమాండ్ స్థితి, ఉత్పత్తికారకాలస్థితి, అవలంభించే వ్యూహం, సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు ఒక ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని నిర్ణయించే పరస్పర ఆధారితాంశాలు. అవస్థాపన సౌకర్యాలు, అధిక విత్త సామర్థ్యం, సంస్థాపరమైన మద్దతు కారణంగా నగర రాష్ట్రమైన గోవా పోటీతత్వాన్ని పెంపొందించుకుంది. స్థూల ఆర్థిక చలాంకాల ప్రగతితో పాటు, నవకల్పన సామర్థ్యం పెంపుతో మహరాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం పెరిగింది. వ్యాపార ప్రోత్సాహకాల అధికవృద్ధి వ్యూహంతో గుజరాత్, అభివృద్ధి చెందిన సమాచార వ్యవస్థ, అడ్మినిస్టేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో హరియాణ ఆర్థిక వ్యవస్థల్లో పోటీతత్వం పెరిగింది. పంజాబ్ డిమాండ్ స్థితిని మెరుగుపరచడంతో పాటు వ్యాపార ప్రోత్సాహకాలను అందించటం ద్వారా వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించింది. పటిష్టమైన సమాచార వ్యవస్థ, డిమాండ్ స్థితిగతులు మెరుగవడం, సంస్థాపరమైన మద్దతు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం పెరిగింది.
టీఎస్‌ఐపాస్ 2015- ముఖ్యాంశాలు
2015 జూన్ 12న సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఆ రోజు నుంచి టీఎస్‌ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టం అమల్లోకి వచ్చింది.
  1. రూ. 200 కోట్ల పెట్టుబడి, 1000 మందికి పైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని తెలంగాణ స్టేట్‌వైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీస్ బోర్డు అనుమతులు మంజూరు చేస్తుంది.
  2. రూ. 5 కోట్ల కన్నా తక్కువ పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలకు జిల్లా పరిశ్రమల కేంద్రం(జీఎమ్) నుంచే అనుమతుల జారీ.
  3. సాధారణ దరఖాస్తు ద్వారా ఏకగవాక్ష విధానంలో (సింగిల్ విండో) అనుమతుల జారీ.
  4. టీఎస్‌ఐపాస్ సెక్షన్ 13(1) ప్రకారం నిర్దేశించిన గడువులోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లే భావించాలి.
  5. లే అవుట్, భవన నిర్మాణం తదితర అనుమతులను గ్రామ పంచాయతీ ద్వారా పొందాలనే నిబంధనను సవరించి ఆ అధికారాన్ని టీఎస్‌ఐఐసీకి కల్పించారు. అయితే ఆదాయాన్ని మాత్రం గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమచేస్తారు.
  6. ఆయా శాఖలు వారంలో రెండుసార్లు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తాయి. పరిశ్రమలశాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఐపాస్ కమిటీ దరఖాస్తు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.
  7. అనుమతుల మంజూరు ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నోడల్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. రూ. 200 కోట్ల పైగా పెట్టుబడి ఉన్న మెగా ప్రాజెక్టులకు 15 రోజులు, అంతకన్నా తక్కువ పెట్టుబడి ఉన్న వాటికి 30 రోజుల్లో అనుమతులు మంజూరు.
  8. పరిశ్రలకు కేటాయించే భూములకు టీఎస్‌ఐఐసీ నోటిఫైడ్ అథారిటీగా వ్యవహరిస్తుంది.
  9. అనుమతి పొందిన రెండు సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి ఉత్పత్తి ప్రారంభించకపోతే సదరు పరిశ్రమకు అనుమతి రద్దుచేసి భూమిని వెనక్కి తీసుకుంటారు.
  10. అనుమతుల్లో జాప్యాన్ని ప్రశ్నించే అధికారం దరఖాస్తు దారునికి ఉంటుంది. నిర్దేశించిన గడువులోగా అనుమతుల పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత విభాగాధిపతికి ఇచ్చారు.
Published date : 10 Sep 2015 06:15PM

Photo Stories