Skip to main content

జాతీయ స్థాయిలో భూసంస్కరణలు

భూ సంస్కరణలలోని వివిధ అంశాలను పరిశీలించడానికి 1972లో తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా.. 1972లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మొదటిసారిగా భూ సంస్కరణలను జాతీయ అంశంగా గుర్తించి, జాతీయస్థాయిలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.
జాతీయ మార్గదర్శక సూత్రాలు
  • సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి గరిష్ట పరిమితి 10 నుంచి 18 ఎకరాలు.
  • సంవత్సరానికి ఒక పంట పండే భూమి (నీటిపారుదల సౌకర్యాలున్న భూమి) గరిష్టంగా 27 ఎకరాలకు మించకూడదు.
  • మిగతా రకాల భూముల గరిష్ట పరిమితి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప (ఎడారి ప్రాంతాలు మొదలైనవి) 54 ఎకరాలకు మించరాదు.
  • కమతం పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోవాలి. కుటుంబం అంటే భార్యా భర్త, ముగ్గురు మైనర్ పిల్లలుగా గుర్తించాలి. అంతకంటే ఎక్కువ మంది సభ్యులుంటే కొంత భూమిని అదనంగా పొందవచ్చు. కానీ ఆ మొత్తం కుటుంబ కమతానికి రెండు రెట్ల కంటే ఎక్కువ ఉండ కూడదు.
  • భార్యాభర్త పేర్ల మీద వేర్వేరుగా భూములున్నప్పటికీ వారిద్దరి భూములను కలిపి గరిష్ట పరిమితిని నిర్ణయించాలి.
  • మేజర్ అయిన కుమారుడిని ప్రత్యేక కుటుంబంగా గుర్తించాలి.
  • నూతన సవరణలతో భూ సంస్కరణల చట్టాలను 1972 డిసెంబర్ 31లోగా అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు రూపొందించాలి.
  • ఈ నూతన సవరణలతో చట్టాలను ఎప్పుడు రూపొందించినా అమలు మాత్రం 1971 జనవరి 24 నుంచే జరగాలి.
మినహాయింపులు
  • కాఫీ, తేయాకు, రబ్బరు, కోకో మొదలైన తోట పంటలను పండించే భూములకు గరిష్ట పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలి.
  • భూదాన ఉద్యమ భూములు, సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, కేంద్ర, రాష్ర్ట, స్థానిక సంస్థల భూములకు గరిష్ట పరిమితి వర్తించదు.
  • వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, పరిశోధనా కేంద్రాల భూములకు మినహాయింపు ఉండాలి.
  • రాష్ర్ట ప్రభుత్వాల అభీష్టం మేరకు మతపరమైన సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు, విద్యాలయాల భూములకు మినహాయింపు ఇవ్వవచ్చు.
  • చెరకు పండించే కమతాలకు మినహాయింపులు ఉండరాదు. పరిశోధన కోసం ఉపయోగపడే భూములు, పంచదార ఫ్యాక్టరీ ఫరిధిలో ఉండే భూముల విషయంలో మినహాయింపు వంద ఎకరాలకు మించకూడదు.
మిగులు భూమి పంపకం - ప్రాధాన్యం
  • మిగులు భూమిని పొందే పేద వర్గాల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకొని నష్టపరిహారాన్ని మార్కెట్ విలువ కంటే తక్కువగా నిర్ణయించాలి.
  • మిగులు భూమి పంపిణీలో భూమిలేని వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా హరిజన, గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • భూ సంస్కరణలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలదే. దీని కోసం అధికారులతో వివిధ స్థాయుల్లో కమిటీలను ఏర్పాటు చేయాలి. పటిష్టమైన పాలనా వ్యవస్థను ఏర్పర్చుకోవాలి.
మొదటి దశ భూ సంస్కరణలు (1947-1970)
భూ సంస్కరణల అమలును ముఖ్యంగా మూడు అంశాలుగా పేర్కొనవచ్చు. అవి...
  • మధ్యవర్తుల తొలగింపు చట్టాలు
  • కౌలు సంస్కరణలు
  • కమతాల గరిష్ట పరిమితి
మధ్యవర్తుల తొలగింపు చట్టాలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ (కుమారప్ప కమిటీ) లేదా ప్రణాళిక సంఘం సూచనల మేరకు భూ సంస్కరణలు అమలు చేశారు. కానీ తెలంగాణ ప్రాంతంలో పోలీసు చర్య తర్వాత(కుమారప్ప కమిటీ సూచనలకు ముందే) జాగీర్దార్ల రద్దు, కౌలు సంస్కరణల చట్టాలను అమలు చేశారు.
తెలంగాణ ప్రాంతంలో జాగీర్దార్ల రద్దు
తెలంగాణ(హైదరాబాద్ రాష్ర్టం)లో జాగీర్ల రద్దు చట్టాన్ని 1949 ఆగస్టు 15న ప్రకటించారు. ఈ చట్టం ద్వారా రూ.18 కోట్లను నష్ట పరిహారంగా చెల్లించి జాగీర్దార్లను, సంస్థానాధీశులను తొలగించారు.
తెలంగాణ ప్రాంతంలో ఇనాందార్ల రద్దు
1955లో తెలంగాణ ప్రాంతంలో ఇనాంల రద్దు చట్టం చేశారు. కానీ ఈ చట్టంలో దేవాదాయ, ధర్మాదాయ భూములకు మినహాయింపులు ఇచ్చారు.
  • 1967 నుంచి ఈ చట్టాన్ని అన్ని రకాల ఇనాంలకు వర్తింపజేశారు.
  • సరైన నష్ట పరిహారం ప్రకటించలేదనే కారణంతో 1970 ఏప్రిల్ 3న హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది.
  • 1973 నవంబర్ 1న ప్రభుత్వం ఈ చట్టాన్ని పునరుద్ధరించి ఇనాం భూములను సేద్యం చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చింది.

కౌలు సంస్కరణలు

షక్మిదార్లు (శాశ్వత కౌలుదార్లు)
  • హైదరాబాద్ ప్రాంతంలో 12 ఏళ్లుగా సాగు చేసే వారిని షక్మిదార్లుగా గుర్తించేవారు. వీరు శాశ్వత కౌలుదార్లు.
  • రక్షణ, భూమిని సాగు చేసే హక్కు ఉన్న కౌలుదార్లను షక్మిదార్లు అనేవారు.
అసామి షక్మిదార్లు
  • వీరికి భూమిపై అధికారం ఉండదు.
  • వీరు ఏ హక్కులు లేని కౌలుదార్లు.
  • కౌలుభూమి 12 ఏళ్లపాటు అసామి షక్మిదార్ల స్వాధీనంలో ఉంటే వారు షక్మిదార్లుగా గుర్తింపు పొందుతారు.
  • భరూచా కమిటీ సిఫారసుల మేరకు హైదరాబాద్ సంస్థానంలో 1944లో ‘అసామి షక్మి చట్టం’ చేశారు.
  • ఈ చట్టం ప్రకారం ఆరు సంవత్సరాలు భూమిని కౌలుకు చేసే వారు అసామి షక్మిదార్లు(రక్షిత కౌలుదార్లు) అవుతారు. వీరిని తొలగించే వీలుండదు. భూస్వాముల ఒత్తిడి కారణంగా ఈ చట్టం అమల్లోకి రాలేదు.
  • అసామి షక్మి చట్టం ద్వారా చట్ట వ్యతిరేక లెవీ పద్ధతిని, సెస్‌లను, పన్నులను, వెట్టిచాకిరీని నిషేధించారు. కానీ ఈ చట్టం వల్ల తీవ్ర దుష్ఫలితాలు తలెత్తాయి.
  • హైదరాబాద్ లేదా తెలంగాణ ప్రాంతంలో మూడు రకాల కౌలు చెల్లింపు పద్ధతులు ఉండేవి. అవి..
బెతాయి: కౌలుగా ధాన్యం చెల్లిస్తారు. ఇది పంటలో 20 శాతం నుంచి 40 శాతం ఉండేది.
నగదు రూపకౌలు: నగదు రూపంలో చెల్లించే కౌలు. ఇది ద్రవ్యరూప కౌలు, స్థిరమైన కౌలు.
గల్లామక్త్యా: ఉత్పత్తితో సంబంధం లేకుండా ఒక ఎకరానికి కనీస మొత్తంగా ధాన్యరూపంలో చెల్లించే కౌలు(స్థిరమైంది). కొన్ని సందర్భాల్లో 2/3వ వంతు ఉండేది.
ఈ మూడు పద్ధతుల్లోనూ కౌలు పరిమాణం అధికంగా ఉండేది.
  • ఈ కౌలు రేట్లు నికర ఉత్పత్తిలో 2/3వ వంతు కంటే ఎక్కువగా ఉండేవని, నగదు రూపంలో చెల్లించే కౌలు భూమి అసెస్‌మెంట్ కంటే 5 నుంచి 12 రెట్లు వరకు ఉండేదని భరూచా కమిటీ నివేదిక తెలిపింది. ఇవే కాకుండా భూమిని కౌలుకు తీసుకునే ముందు, రెన్యూవల్ కోసం నజరానాలు కూడా చెల్లించాల్సి ఉండేది.
హైదరాబాద్ (తెలంగాణ) కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950
  • 1944 నాటి ‘హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ’ సూచనల మేరకు 1950 జూన్ 10న ఈ చట్టాన్ని ప్రకటించారు.
ముఖ్యాంశాలు
  1. ఆరేళ్లు కౌలుదార్లుగా ఉన్నవారిని రక్షిత కౌలుదార్లుగా పేర్కొంటారు.
  2. కౌలు ఒప్పందం మౌఖిక రూపంలో కాకుండా ఎంఆర్‌వో సమక్షంలో రాత పూర్వకంగా ఉండాలి.
  3. కౌలు పరిమాణం భూస్వామి ప్రభుత్వానికి చెల్లించే శిస్తు కంటే 3-5 రెట్లు మాత్రమే ఉండాలి. అంత కంటే ఎక్కువ ఉండొద్దు.
  • ఈ చట్టంలోని లోపాలను సవరించి హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్‌‌స -1952ను జారీ చేశారు.
  • భూస్వాములు భారీ సంఖ్యలో కౌలుదార్లను తొలగించారు. దీంతో కౌలుదార్లను తొలగించవద్దని, వారికి భూములను వెనక్కి ఇప్పించాలని, కౌలుదార్ల అనుమతి లేకుండా అమ్మిన భూములకు గుర్తింపు లభించదని ఈ ఆర్డిన్స్ లో పేర్కొన్నారు.
  • 1955లో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ ను అమలు చేశారు. తెలంగాణ అంతటా దీన్ని వర్తింపజేయగా భూస్వాములు కోర్టుకు వెళ్లారు.
  • ఈ చట్టం ప్రకారం భూస్వాములు తొలగించిన కౌలుదార్లందరికీ మళ్లీ భూమిని అప్పగించడంతో పాటు కౌలు పరిమాణాన్ని కూడా ప్రభుత్వమే నిర్ణయించింది.
  • మాగాణి భూమికి - 1/3వ వంతు
  • మెట్ట భూమికి - 1/4వ వంతు.
కమతాల గరిష్ట పరిమితి
  • కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వార్షికంగా రూ. 3,600 నికర ఆదాయం సంపాదించే కమతం ఆధారంగా కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని 1961లో చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం - I
  • ఈ చట్టం 1961 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
  • ఈ చట్టంలో మాగాణి భూమిని ఐదు రకాలుగా, మెట్ట భూమిని మూడు రకాలుగా వర్గీకరించారు.

భూమి రకాలు

రెండు పంటలు పండే భూమి

ఒక పంట పండే భూమి

మాగాణి ఐదు రకాలు

 

 

క్లాస్ - ఎ

6

27

క్లాస్ - బి

8

36

క్లాస్ - సి

10

45

క్లాస్ - డి

12

54

క్లాస్ - ఇ

24

108

మెట్ట మూడు రకాలు

 

 

క్లాస్-ఎఫ్

36

162

క్లాస్ - జి

48

216

క్లాస్-హెచ్

72

324

  • ఈ చట్టం ప్రకారం ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడిని యూనిట్‌గా తీసుకొని, ప్రతి యూనిట్‌కు కుటుంబ కమతానికి 4½ రెట్ల భూమిని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.
  • ఈ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఆరు ఎకరాల నుంచి 324 ఎకరాల మధ్య భూమి ఉండవచ్చు.
  • దేశంలోని రాష్ట్రాలన్ని గరిష్ట పరిమితి విషయంలో సీఎల్‌ఆర్‌ను పాటించాయి. అయితే సీలింగ్‌లో రాజస్థాన్‌లో ఎక్కువ గరిష్ట పరిమితి ఉండగా, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో తక్కువ పరిమితి ఉంది.
  • ఈ చట్టం ద్వారా 2,384 ఎకరాల మిగులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకుగానూ నష్టపరిహారం చెల్లించారు.
  • ఈ చట్టంలో గరిష్ట పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల ఆశించిన రీతిలో మిగులు భూమి లభించలేదు.
  • అందువల్ల కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 1961 చట్టం స్థానంలో ‘భూ గరిష్ట పరిమితి చట్టం - 1973’ను ప్రవేశపెట్టారు.
Published date : 12 Oct 2015 04:40PM

Photo Stories