Skip to main content

పర్యావరణం

భూమిపై ఉన్న ఘన, ద్రవ, వాయు, జీవ సమ్మేళనాన్ని పర్యావరణం అంటారు. జీవుల మనుగడకు అవసరమైన గాలి, నీరు, ఆహారం పూర్తిగా కలుషితమవుతున్నాయి. సహజ వనరులు తరిగిపోతుండటంతో డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా వాటి దుర్వినియోగం కూడా అధికమై పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది.
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితిగతులపై పర్యావరణ నష్ట ప్రభావం తీవ్రంగా ఉంది. వంట చెరకు లభ్యత, పశుగ్రాసం, భూగర్భ, ఉపరితల వనరులు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణపై ఆధారపడి ఉంటుంది.

పర్యావరణ విభాగాలు
పర్యావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి..
1. వాతావరణం(అట్మాస్పియర్)
2. శిలావరణం(లిథోస్పియర్)
3. జలావరణం(హైడ్రోస్పియర్)
4. జీవావరణం(బయోస్పియర్)

వాతావరణం (అట్మాస్పియర్)
భూమి ఉపరితలంపై ఉన్న వాయు పొరల నిర్మాణమే వాతావరణం లేదా అట్మాస్పియర్. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇది భూమిపై ఉంటుంది. ఇందులో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్ అనే నాలుగు విభాగాలున్నాయి. రెండు పొరల మధ్య హద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘పాజ్’ అంటారు. ఉదాహరణకు.. స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్ మధ్యనున్న ప్రాంతాన్ని స్ట్రాటోపాజ్ అంటారు.

ట్రోపోస్పియర్
ఇది భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర. ఈ పొర ధ్రువాల వద్ద 6-8 కి.మీ. ఎత్తు వరకు, భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. పైకి వెళ్లేకొద్దీ ప్రతి కిలోమీటరుకు ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల చొప్పున తగ్గుతుంది. సుమారు 12 కి.మీ. ఎత్తు వద్ద ట్రోపోపాస్ అనే పరివర్తన ప్రాంతం మొదలవుతుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయి.

స్ట్రాటోస్పియర్
వాతావరణంలోని రెండో పొర అయిన స్ట్రాటోస్పియర్, ట్రోపోపాజ్ నుంచి మొదలై 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో గంటకు 320 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్ అధిక మోతాదులో ఉండటం వల్ల దీన్ని ఓజోనోస్పియర్ అని కూడా అంటారు. హానికర అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరకుండా ఈ పొర అడ్డుకుంటుంది.

మీసోస్పియర్
స్ట్రాటోపాజ్ నుంచి దాదాపు 80 కి.మీ. ఎత్తు వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి. మీసోస్పియర్ పైనున్న ప్రాంతం వాతావరణంలోని అన్ని భాగాల కంటే అత్యంత శీతలంగా ఉంటుంది. ఉల్కాపాతం భూమిని చేరకపోవడానికి మీసోస్పియరే కారణం.

థర్మోస్పియర్
ఇది మీసోపాజ్ నుంచి మొదలవుతుంది. థర్మోస్పియర్‌ను ఐనోస్పియర్, ఎక్సోస్పియర్‌లుగా విభజిస్తారు. కింది భాగమైన ఐనోస్పియర్ భూవాతావరణంలో 100-120 కి.మీ. ఎత్తు నుంచి 550 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఐనోస్పియర్‌లో నత్రజని, ఆక్సిజన్ లాంటి మూలకాల పరమాణువులు సౌర వికిరణాన్ని గ్రహించి అయానీకరణం చెందుతాయి. భూ ఉపరితలం నుంచి వచ్చే రేడియో తరంగాలను పరావర్తనం చేసి సమాచార ప్రసారానికి ఐనోస్పియర్ తోడ్పడుతోంది. బలమైన సౌరగాలులు వీచినప్పుడు ఐనోస్పియర్ సంఘటనం మారే ప్రమాదం ఉంది. ఫలితంగా సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి.

శిలావరణం
భూమిపై ఉన్న ఖండాలన్నింటినీ కలిపి శిలావరణం అంటారు. భూమి ఉపరితలం మొత్తం కొన్ని ప్రత్యేక ఫలకాలపై అమరి ఉంటుంది. ఈ ఫలకాల నిర్మాణం, వాటి కదలికలను ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం వివరిస్తుంది. 200 మిలియన్ సంవత్సరాల కిందట భూభాగం మొత్తం ఒకే చోట కలిసి ఉండేది. దీన్ని పాంజియా అని పిలుస్తారు. 50 మిలియన్ ఏళ్ల క్రితం ఇది రెండు భాగాలుగా చీలింది. ఉత్తరంగా ఉన్న భాగాన్ని లారెన్షియా అని, దక్షిణ దిశగా విడిపోయిన ప్రాంతాన్ని గోండ్వానా అని పిలుస్తారు. ఇవి మరింత దూరం కదిలి ప్రస్తుత ఖండాలు ఏర్పడ్డాయి. ఖండ చలన సిద్ధాంతం.. ఖండాల నిర్మాణం, వాటి కదలికలను వివరిస్తుంది. భూమి ఉపరితలం నుంచి లోపలి వైపు మూడు భాగాలుంటాయి. భూపటలం(క్రస్ట్), భూప్రావారం (మాంటెల్), భూకేంద్రం(కోర్). భూపటలం ఉపరితలం నుంచి సుమారు 100 కి.మీ. లోతు వరకు ఉంటుంది. భూపటల ఉపరితలంపై వదులుగా ఉండే పొరలను మృత్తిక లేదా నేల అంటారు. 100 కి.మీ. లోతు నుంచి 2900 కి.మీ. లోతు వరకు భూప్రావారం(మాంటెల్) అనే పొర ఉంటుంది. దీని తర్వాత మధ్యభాగం భూకేంద్రం(కోర్). దీనిలో బాహ్యకేంద్రం, అంతర కేంద్రం అనే రెండు భాగాలు ఉంటాయి. బాహ్యకేంద్రం 2900 కి.మీ. నుంచి 5100 కి.మీ. వరకు ఉంటుంది. అంతర కేంద్రం 5100 కి.మీ. నుంచి సుమారు 6378 కి.మీ. వరకు ఉంటుంది.

జలావరణం
భూమిపై వివిధ రూపాల్లో ఉన్న మొత్తం నీటిని జలావరణం లేదా హైడ్రోస్పియర్ అంటారు. పూర్వం సముద్ర జలమంతా పూర్తిగా సాదుజలంగా ఉండేది. కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి నేల క్రమక్షయం జరిగి ఖనిజాలు సముద్రంలోకి చేరడంతో లవణీయత పెరిగింది. భూమి ఉపరితలం 75 శాతం నీటితో నిండి ఉంది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97.5 శాతం సముద్రాల్లోనే ఉంది. మిగతా 2.5 శాతం నీరు సాదుజలం లేదా మంచి నీరు. మంచి నీటిలో 0.3 శాతం నదులు, సరస్సుల్లో ఉంది. భూగర్భ జలంగా 30.8 శాతం, హిమనీనదాల రూపంలో 68.9 శాతం ఉంది.
భూమిపై నీటి విస్తరణను జల వలయం నిర్ధారిస్తుంది. నీరు ఆవిరై మేఘాల రూపంలోకి సాంద్రీకరణం చెంది ఆ తర్వాత మంచు, వర్షం రూపంలో భూమిని చేరుతుంది. ఇలా చేరిన నీటిలో కొద్ది మొత్తం భూగర్భంలోకి ఇంకుతుంది. మిగతాది నదులు, సముద్రాల్లోకి చేరుతుంది. ధ్రువ ప్రాంతాల్లో శీతాకాలంలో ఈ నీరు గడ్డకట్టి వేసవిలో కరుగుతుంది. ఈ రకమైన నిరంతర నీటి ఆవిరి కదలికలను జలవలయం అంటారు.

జీవావరణం
భూమిపై ఉన్న జీవులు, జీవం విస్తరించిన ప్రాంతాలన్నింటినీ కలిపి బయోస్పియర్ అంటారు. భూమిపై సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం జీవం ఆవిర్భవించింది. అనేక సిద్ధాంతాలు భూమిపై జీవం ఆవిర్భవించే విధానాన్ని వివరిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...
  1. ప్రత్యేక సృష్టి సిద్ధాంతం: దీని ప్రకారం భూమిపై జీవులను దేవుడు సృష్టించాడు. ఈ సిద్ధాంతానికి తగిన నిదర్శనాలు లేని కారణంగా దీన్ని నమ్మకంగానే భావిస్తారు.
  2. పాన్‌స్పెర్శియ సిద్ధాంతం: దీని ప్రకారం భూమిపై జీవులు ఆవిర్భవించలేదు. భూమి ఆవల నుంచి గ్రహశకలాలు లేదా గ్రహాంతర వాసుల ద్వారా భూమిపైకి చేరి ఆ తర్వాత పరిణామ క్రమంలో మార్పు చెందాయి.
  3. జీవ ఆవిర్భావ సిద్ధాంతం: అలెగ్జాండర్ ఇవనోవిచ్ ఒపారిన్, జె.బి.ఎస్. హాల్డెన్ అనే శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం భూమిపై జీవ ఆవిర్భావానికి ముందు జీవ రసాయనాలు ఆవిర్భవించాయి. ఈ జీవ రసాయనాల చర్యల ద్వారా భూమిపై పూర్వ జీవకణాలు ఏర్పడ్డాయి. తర్వాత వాటి నుంచి సంపూర్ణ జీవకణాలు ఆవిర్భవించాయి. భూమిపై ఆవిర్భవించిన తొలి తరం జీవులన్నీ అవాయు జీవులు. ఇలాంటి కొన్ని అవాయు జీవులు నీటి అణువులను విచ్ఛిన్నం చేయడంతో గాల్లోకి క్రమంగా ఆక్సిజన్ విడుదలైంది. తొలుత కేంద్రక పూర్వ జీవులు ఏర్పడి ఆ తర్వాత నిజ కేంద్రక జీవులు ఆవిర్భవించాయి.

గతంలో అడిగిన ప్రశ్నలు

1. ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం? (గ్రూప్-2, 2008)
ఎ) ఆహార గొలుసు
బి) ఇకలాజికల్ నిచే
సి) ఎకోటోన్
డి) ఏదీకాదు

Published date : 24 Sep 2015 06:41PM

Photo Stories