Skip to main content

పర్యావరణ ఉద్యమాలు

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను దశాబ్దాల కిందటే గుర్తించినా ఇప్పటివరకూ ఈ దిశగా సరైన చర్యలు తీసుకోలేదు. దీని కోసం అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారు. 1945 నుంచే భూ గోళం పర్యావరణ సంక్షోభంలోకి ప్రవేశించింది. ప్రజలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రకృతిపై అన్ని వైపుల నుంచి దాడి ప్రారంభించారు. ప్రారంభంలో పరిశ్రమల స్థాపన, తర్వాత శాస్త్ర సాంకేతిక విప్లవం, ఇటీవల ప్రపంచీకరణ పర్యావరణ పతనానికి దారితీశాయి. అడవులను నరికి విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలను ఏర్పరచడం కూడా పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడానికి కారణమైంది. నూతన పారిశ్రామికాభివృద్ధి, శాస్త్ర విజ్ఞానం ఫలితంగా సింథటిక్ ఉత్పత్తుల వినియోగం పెరిగింది. ఈ సింథటిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. ఇలాంటి ఉత్పత్తులన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ విస్తరించేకొద్దీ మానవుల కార్యకలాపాలు ప్రకృతికి విరుద్ధంగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం నాశనం అవుతోంది.
పూర్వకాలంలో మానవుల అవసరాలు పరిమితంగా ఉండేవి. వారు ప్రకృతి వనరులను తక్కువగా వినియోగించేవారు. అందువల్ల పర్యావరణ సమతౌల్యం మెరుగ్గా ఉండేది. ప్రస్తుతం విలాసవంతమైన జీవితం, సంపద కోసం ప్రకృతి వనరులపై ఒత్తిడి పెరిగింది. అవసరానికి మించి ప్రకృతి వనరులను వినియోగించడం వల్ల భావి తరాల జీవితం ప్రశ్నార్థకమయ్యే దుస్థితి తలెత్తింది. అమెరికా పర్యావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ గోల్డ్ స్మిత్ పేర్కొన్నట్లు అనేక అవసరాల కోసం తాను ఆధారపడే ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నాడు. అడవుల్లో బంజరు భూములను దుర్వినియోగం చేస్తున్నారు. పగడాల దీవులను విచక్షణా రహితంగా తవ్వేస్తున్నారు. పంట పొలాలు నాశనమై చౌడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. కాలుష్య సమస్య తీవ్రమైంది. ప్రస్తుతం ప్రతి జీవి శరీరంలోనూ పారిశ్రామిక, వ్యవసాయ రసాయనాలు కేన్సర్ కారకాలుగా పరిణమిస్తున్న అంశాన్ని గమనిస్తే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పర్యావరణం అంటే..?
ఒక జీవి లేదా జీవరాశుల చుట్టూ ఉన్న పరిసరాలు (గాలి, నేల, నీరు, జీవ సమూహాలు), వాటి స్థితిగతుల మొత్తాన్ని కలిపి ‘పర్యావరణం’ అంటారు. ఆంగ్లంలో దీన్ని ‘ఎన్విరాన్‌మెంట్’ అంటారు. ఇది ఫ్రెంచి భాషా పదమైన ‘ఎన్విరాన్’ నుంచి ఆవిర్భవించింది. ఫ్రెంచిలో ‘ఎన్విరాన్’ అంటే ‘ఆవరణం - చుట్టూ ఉన్న ప్రదేశం’ అని అర్థం.
ప్రముఖుల నిర్వచనాలు
జీవులు, పరిసరాలకు మధ్య ఒక నిర్దిష్ట సమన్వయ సహకారం ఉంటుంది. ఈ జీవ, నిర్జీవ అంశాల సమన్వయ సహకార సంక్లిష్టతనే ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు.- టాలెమీ
‘మన చుట్టూ ఆవరించి ఉన్న భౌతిక రసాయనిక, జీవ రసాయనిక అంశాల మధ్య ఉన్న సమన్వయ సహకార సమ్మేళన వ్యవస్థీకృత స్వరూపాన్ని ‘పర్యావరణం’ అంటారు. - ఓడమ్

పర్యావరణం - మూలకాల సంఘటనం
ప్రకృతిలోని పంచభూతాలు మానవుడికి పంచ ప్రాణాల లాంటివి. గాలిలో, నీటిలో, భూమిపై ఉండాల్సిన మూలకాలు తగిన నిష్పత్తిలో లేకపోతే మానవుడికి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం..

కార్బన్ డై ఆక్సైడ్
వాతావరణంలో మానవుడికి పెద్దగా అవసరం లేని కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా ఉండగా, అత్యవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) తక్కువ పరిమాణంలో ఉంది. దీంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. ఇది మానవులకు హానికరంగా తయారైంది. సూర్యుడి నుంచి వచ్చే కాంతి, అందులో ఉండే అతినీల లోహిత రేడియో ధార్మికత భూ వాతావరణం ద్వారా నేలను చేరి, దాన్ని వేడెక్కిస్తాయి. ఈ వేడిమి శక్తి తిరిగి పరారుణ రేడియో ధార్మికత రూపంలోకి పరావర్తనం చెందుతుంది. అయితే వాతావరణంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి, మరికొన్ని వాయువులు దీన్ని కొంతమేర గ్రహించి భూ ఉపరితలం వేడిగా ఉండేట్లు చేస్తాయి. ఇది కొంతమేర ఉండటం మేలు చేస్తుంది. కానీ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయికి మించితే భూతాపం పెరుగుతుంది. దీన్నే ‘గ్రీన్ హౌస్ ప్రభావం’ అంటారు. నిత్యం బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను మండించడం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి, సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2) లాంటి వాయువుల స్థాయి పెరిగిపోతోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు 260 PPMV(పార్‌‌ట్స పర్ మిలియన్ బై వాల్యూం) మేర ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ప్రస్తుతం 370 PPMVకి చేరింది. ఈ శతాబ్దాంతానికి దీని స్థాయి 500 PPMVకి చేరొచ్చునని ఆందోళన చెందుతున్నారు. అడవుల నరికివేత వల్ల కూడా ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. భారతదేశ విస్తీర్ణంలో భౌగోళికంగా 33 శాతం అడవులు ఉండాలి. ప్రస్తుతం వీటి విస్తీర్ణం 23 శాతంగా ఉంది.

మిథేన్
మిథేన్‌కు పరారుణ కాంతిని గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువ. వాతావరణంలో ఇది స్వల్పంగానే ఉన్నా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామిక విప్లవానికి ముందు వాతావరణంలో ఇది 600 PPBV మేర ఉండేది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ 1950 నాటికి 1300 PPBVకి, 1990 నాటికి 1700 PPBVకి పెరిగింది.
నీరు నిల్వ ఉండే సాగు విధానం, ఈ వాయువును విడుదల చేసే పేడ లాంటి పదార్థాలు పెరగడం, శిలాజ ఇంధనాల వాడకం ఈ వాయువు అధికమవడానికి కారణాలు. మిథేన్ వాతావరణంలోకి ఒకసారి చేరితే గరిష్టంగా పదేళ్లు ఉంటుంది.

క్లోరో ఫ్లోరో కార్బన్లు (CFC)
వాతావరణంలో వీటి ఉనికి ఇటీవల విపరీతంగా పెరిగింది. ఫ్రిజ్‌లు, బెడ్‌ల కోసం ఉపయోగించే ఫోమ్, అగ్నిమాపక రసాయనాల లాంటి వాటి వాడకం పెరగడమే దీనికి కారణం. 1950లో ‘సున్నా’గా ఉన్న CFC–11 లేదా R-11 (chloro fluoro methane) 1984 నాటికి 3 లక్షల టన్నులకు చేరింది. 1984 నుంచి CFC–11 క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1940లో సున్నాగా ఉన్న CFC–12 లేదా R-12 లేదా freon-12 (DiChloro fluoro methane) పరిమాణం 1984 నాటికి నాలుగు టన్నులకు చేరింది.

నైట్రస్ ఆక్సైడ్
దీన్ని ‘లాఫింగ్ గ్యాస్’ అంటారు. శిలాజ ఇంధనాలను మండించడం, అమ్మోనియా ఎరువుల వినియోగం, అడవుల నరికివేత లాంటి కారణాల వల్ల వాతావరణంలో నైట్రస్ ఆక్సైడ్ పరిమాణం పెరుగుతోంది. పారిశ్రామికీకరణకు ముందు 275 PPBVగా ఉన్న నైట్రస్ ఆక్సైడ్ 1992 నాటికి 311 PPBVకి పెరిగింది.

ఏరోసాల్స్ (Aerosols)
వాతావరణంలో ఉండే చిన్నపాటి ఘన, ద్రవ రేణువులనే ఏరోసాల్స్ అంటారు. వీటి పరిమాణం పెరిగితే భూమి నుంచి విశ్వంలోకి వెళ్లే రేడియో ధార్మికతను ఇవి అడ్డుకుంటాయి. తద్వారా భూతాపం పెరుగుతుంది. ఈ ఏరోసాల్స్ వల్ల ఓజోన్ పొర క్షీణిస్తుంది. శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక ఉద్గారాల వల్ల పొగ, ధూళి రేణువులు పెరిగి వాతావరణంలో ఏరోసాల్స్ పరిమాణం అధికం అవుతోంది. ఈ విధంగా వాతావరణంలో వివిధ వాయువుల పరిమాణం అధికమవడం వల్ల ‘గ్లోబల్ వార్మింగ్’ పెరుగుతోంది. భూగోళంపై ఉష్ణోగ్రత పెరగడం వల్ల గాలి, నీరు, నేల సమతౌల్యం కోల్పోతున్నాయి. దీంతో జీవరాశులన్నింటి మనుగడ దుర్భరమవుతోంది. కాలుష్యాల సాంద్రత, కాలుష్యీకరణ తీవ్రత ఇలాగే కొనసాగితే ప్రపంచ భౌగోళిక ప్రవృత్తుల్లో తీవ్రమైన అనుత్క్రమణీయ (Irreversible) మార్పులు సంభవిస్తాయి. మనల్ని మనం కాపాడుకోవాలంటే పర్యావరణ పరిరక్షణ చేపట్టాల్సిందే.

పర్యావరణ వాదం
పర్యావరణాన్ని సంరక్షించడం, పునరుద్ధరించడం లేదా మెరుగుపర్చడంపై శ్రద్ధ కలిగి ఉండటాన్ని ‘పర్యావరణ వాదం’ అంటారు. పర్యావరణ ప్రాముఖ్యాన్ని గుర్తించి వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పర్యావరణాన్ని రక్షించడానికి కృషి చేయడాన్నే ‘పర్యావరణ వాదం’గా పేర్కొంటారు. యూరప్‌లో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, తీవ్రమవుతున్న కాలుష్యానికి ప్రతిచర్యగా దీన్ని ప్రారంభించారు.
1949లో ‘ఆల్టో లియోపాల్డ్’ అనే అమెరికన్ పర్యావరణవేత్త ‘A Sand County Almanac’ అనే పుస్తకంలో పర్యావరణ కాలుష్యం వల్ల మానవ సమాజం ఎదుర్కొనే సమస్యలను ఎత్తి చూపారు. ఈ గ్రంథం 20వ శతాబ్దంలో పర్యావరణ వాదాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. అమెరికాకు చెందిన జీవ శాస్త్రవేత్త ‘రేచల్ కార్సన్’ 1962లో ‘సెలైంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం రాశారు. ఇందులో డి.డి.టి. (dichloro diphenyl trichloroethane), ఇతర పురుగు మందుల వాడకం కేన్సర్‌ను కలిగిస్తుందని, వ్యవసాయంలో వీటిని వినియోగించడం వల్ల వన్యప్రాణులకు.. ముఖ్యంగా పక్షులకు ప్రమాదం ఏర్పడుతోందని ఆమె పేర్కొన్నారు. దీని ప్రభావంతో 1970లో ‘యునెటైడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ని స్థాపించారు. ఇది 1972లో అమెరికాలో డి.డి.టి.ని నిషేధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ పుస్తకం వల్ల పర్యావరణ అంశాలపై శ్రద్ధ పెరిగి ‘గ్రీన్ పీస్’, ‘ఫ్రెండ్‌‌స ఆఫ్ ద ఎర్‌‌త’ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆవిర్భవించడానికి నాంది పడింది.
1973లో Endangered Species Act, 1975లో Convention on International Trade in Endangered Species (CITES) ఏర్పడటంతో పర్యావరణ వాదం మరింత ప్రభావవంతమైంది. 1972లో యూఎన్‌వో ఆధ్వర్యంలో ‘స్టాక్ హోం’లో జరిగిన ‘మానవుడు - పర్యావరణం’ అనే అంశంపై నిర్వహించిన యునెటైడ్ నేషన్‌‌స కాన్ఫరెన్స్ లో 114 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశం ఫలితంగా ‘యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్’ ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ‘నేషనల్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్’, ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్.) లాంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. జూన్-5ను ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’గా యావత్ ప్రపంచం పాటించాలని 1972లో యూఎన్‌వో ప్రతిపాదించింది.
‘యునెటైడ్ నేషన్‌‌స ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రామ్’ (యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణ కోసం 1982లో ‘ధరిత్రీ సదస్సు’ నిర్వహించారు. 1997లో క్యోటో ప్రోటోకాల్ వెలువడింది. 2007లో బాలిలో నిర్వహించిన సదస్సు, 2009లో జరిగిన కొపెన్‌హెగన్ సదస్సులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2015 డిసెంబర్‌లో పారిస్‌లో నిర్వహించిన కాప్-11 సదస్సులో 2100 నాటికి భూతాపాన్ని రెండు డిగ్రీల కంటే తక్కువకు తగ్గించడానికి 195 దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. వర్తమాన దేశాలకు 2020 నుంచి ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఏటా వంద బిలియన్ డాలర్ల మేర సమకూర్చడానికి కూడా ఒప్పందం కుదిరింది.

భారత్‌లో పర్యావరణ వాదం
దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల్లో మాదిరిగా భారత్‌లో కూడా పర్యావరణవాదం.. సాంఘిక న్యాయం కోసం స్థానికంగా జరిగే క్రియాశీలక కార్యక్రమాల్లో భాగంగానే ప్రారంభమైంది. మన దేశంలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు అద్భుత విజయాలు సాధించాయని చెప్పొచ్చు. దీనికి కొన్ని ఉదాహరణలు..

చిప్కో ఉద్యమం
చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. దీని అర్థం అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం. ప్రజల హక్కులను కాపాడి అడవులకు, ప్రకృతికి మధ్య ఉండే తాత్విక సామీప్యా న్ని రక్షించి, దానికి శాస్త్రీయంగా కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం. ఈ ఉద్యమాన్ని ఉత్తరాంచల్ అడవుల్లో నివసించే గిరిజనులు (ముఖ్యంగా బిష్ణోయ్ తెగ మహిళలు) ఆ ప్రాంతంలోని అడవులను (నరికివేయకుండా) కాపాడుకోవడానికి చేపట్టారు. ఇది ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా, గాంధేయ సత్యాగ్రహ విధానాల్లో నడిచింది. అందువల్ల ఈ ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. తొలుత వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
బ్రిటిషర్లు రూపొందించిన అటవీ చట్టం (ఫారెస్ట్ యాక్ట్-1927) వల్ల పల్లె ప్రజల హక్కులకు భంగం వాటిల్లడం, గ్రామీణులు జీవనోపాధి కోల్పోవడం, అడవులను వాణిజ్యావసరాల కోసం విపరీతంగా కొల్లగొట్టడంతో ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించింది. 1970 దశకంలో సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఊపందుకుంది. చండీప్రసాద్ భట్ అనే మరో పర్యావరణవేత్త ఆయనకు సహకరించారు. వీరి ఆధ్వర్యంలో చిప్కో పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమంగా పేరొందింది.
1973లో చమోలి జిల్లా(ఉత్తరాంచల్)లోని గోపేశ్వర్‌లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరూ ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకొని ‘చెట్లను నరకాల నుకుంటే వాటితోపాటు మమ్మల్నీ నరకండి’ అని హెచ్చరించారు. దీంతో మన దేశంలో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.
ఈ ఉద్యమంలో భాగంగా సుందర్‌లాల్ బహుగుణ 1981-83 మధ్య కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దాదాపు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి హిమాలయ ప్రాంతాల్లో చెట్ల నరికివేతను నిషేధించాలని కోరారు. ఫలితంగా అక్కడ 15 ఏళ్ల పాటు చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచింది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకల్లో కూడా చెట్ల నరికివేతను నిషేధించారు.

నర్మదా బచావో ఆందోళన్
మన దేశంలో పశ్చిమ దిశలో ప్రవహించే నదుల్లో నర్మదా అతి పెద్దది. ఇది మధ్యప్రదేశ్‌లోని అమర్ కంఠక్‌లో జన్మించి సోన్ నదికి వ్యతిరేక దిశలో మహారాష్ర్ట గుండా ప్రవహిస్తూ గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ ఖంభట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీన్ని ఫాల్ట్ రివర్ అని, పాలరాయి నది (మార్బుల్ రివర్) అని కూడా అంటారు.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలోని కొన్ని ప్రదేశాల్లో నీటి కొరత ఉండేది. ఆ ప్రాంతాల్లో నీటి సమస్యను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం నర్మదా నదిపై భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని 1954లో నిర్ణయించింది. 1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. నర్మదా నది, దాని ఉప నదులపై 300 చిన్న ప్రాజెక్టులు, 135 మధ్య తరహా ప్రాజెక్టులు, 30 పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటినీ కలిపి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తాగు నీరు, సాగు నీరు అందించడంతోపాటు 12,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉద్యమానికి కారణం: మేధా పాట్కర్ నేతృత్వంలో నర్మదా బచావో ఆందోళన్ అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం 1988లో ప్రారంభమైంది. మేధా పాట్కర్‌తోపాటు ప్రముఖ సంఘ సేవకుడు బాబా ఆమ్టే ఈ ఉద్యమాన్ని గత రెండు దశాబ్దాలుగా నడిపిస్తున్నారు. నర్మదా ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని వీరి వాదన. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అడవులు నశించిపోతాయని, భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతింటుందని, భూసారం తగ్గిపోతుందని, దాదాపు లక్ష మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారని అంచనా. అయితే ఒక వైపు ఉద్యమం కొనసాగుతుండగా మరో వైపు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. దీంతో ఈ ఉద్యమం 1989 నాటికి తీవ్రతరమైంది. నర్మదా డ్యామ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మేధా పాట్కర్, బాబా ఆమ్టే, సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో 1989లో హర్సుద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో 60 వేల మందికి పైగా కార్యకర్తలు, గిరిజనులు, రైతులు, పౌర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అయినా డ్యామ్ నిర్మాణ పనులు కొనసాగడంతో బాబా ఆమ్టే నేతృత్వంలో కార్యకర్తలు 1990 డిసెంబర్ 25న సంఘర్ష యాత్ర పేరిట పాదయాత్ర చేశారు. ఇది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘాట్ నగరం నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్ సరిహద్దులోని ఫెర్కువా గ్రామం వరకు అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ స్థలం వరకు దాదాపు 250 కిలోమీటర్ల దూరం సాగడం సంచలనం సృష్టించింది. అయినప్పటికీ వీరి డిమాండ్లకు ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో మేధా పాట్కర్, బాబా ఆమ్టే 1991 జనవరిలో ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. మేధా పాట్కర్ పోరాట పటిమకు గుర్తింపుగా ఆమెకు 1991లో స్వీడన్ అత్యున్నత పర్యావరణ పురస్కారం రైట్ లైవ్లీహుడ్ అవార్‌‌డ లభించింది.
మద్దతుదారులు: ఈ ఉద్యమానికి దేశీయం గానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎందరో మద్దతు పలికారు. ‘ది ఫ్రెండ్‌‌స ఆఫ్ రివర్ నర్మద’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఈ ఉద్యమానికి మద్దతిస్తోంది. నర్మదా డ్యామ్ నిర్మాణానికి నిధులు ఇవ్వొద్దని జపాన్, అమెరికాల్లోని పర్యావరణ సంఘాలు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాయి. నర్మదా బచావో ఆందోళన్‌కు ప్రముఖ రచయిత్రి అరుంధతిరాయ్ ‘ది గ్రేటర్ కామన్ గుడ్’ అనే పుస్తకం ద్వారా మద్దతు పలికారు. భారీ డ్యామ్‌ల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాలను యావత్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
ఫలితం: పర్యావరణ పరిరక్షణ, వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో జరిగిన ఉద్యమాలన్నింటిలో నర్మదా బచావో ఆందోళనే ముఖ్యమైంది. అయితే పర్యావరణానికి పెద్దగా హాని కలిగించని విధంగా నిర్మాణాలను చేపట్టి దుర్భిక్ష ప్రాంతాలకు తాగు నీరు, సాగు నీరు అందించే ప్రాజెక్టులను వ్యతిరేకించకపోవడం మంచిదని నిపుణులు, ప్రజలు భావిస్తున్నారు.

తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం
గాడ్వాల్ జిల్లా(ఉత్తరాఖండ్)లోని తెహ్రీ పట్టణానికి సమీపంలో భగీరథీ, భిలాంగన నదులపై జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణ యించాయి. రష్యా సాంకేతిక సహకారంతో నిర్మాణ పనులను 1978లో చేపట్టాయి. ఈ ప్రాజెక్టునే తెహ్రీ డ్యామ్‌గా పేర్కొంటారు. దీని ఎత్తు 260.5 మీటర్లు. ప్రస్తుతం మన దేశంలో ఇదే అత్యంత ఎత్తై డ్యామ్. ఈ ప్రాజెక్టు ద్వారా 2,70,000 హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించాలని; 346 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని; ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు తాగునీటిని అందించాలని, చేపల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ డ్యామ్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని, ఇది పర్యావరణ ఉనికినే ప్రశ్నార్థకం చేయనుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెహ్రీ పట్టణంతో పాటు 23 గ్రామాలు పూర్తిగా మునిగిపోనుండ గా 73 గ్రామాలు సగం మునుగుతాయి. 5200 హెక్టార్ల భూమి రిజర్వాయర్ కిందికి పోతుందని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా. ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతం ప్రకారం హిమాలయ పర్వతాలు జోన్-5లో అంటే భూకంపాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల తెహ్రీ, గాడ్వాల్‌లను భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో భూకంపాలు వస్తే ఆయా ప్రాంతాలు భారీగా నష్టపోతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని; అడవులు నశించిపోతాయని; హిమాలయాల్లో నివసించే అరుదైన, అతి విలువైన వృక్షాలు, జంతువులు అంతరించిపోతాయని, జీవావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.
ఉద్యమ నేతలు: పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీరేంద్ర దత్ సక్లానీ ఈ ఉద్యమాన్ని నడిపించారు. బహుగుణ నేతృత్వంలోని తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్‌‌ష సమితి పోరాటాలు నిర్వహించింది. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారిగా నిలిచినప్పటికీ వివాదాస్పద కట్టడంగా మిగిలిపోయింది.

నిశ్శబ్ద లోయ పర్యావరణ ఉద్యమం
కేరళలోని పశ్చిమ కనుమల్లో వ్యాపించి ఉన్న అరణ్యాన్ని నిశ్శబ్ద లోయ అంటారు. కీచు రాళ్లు లేకపోవడం వల్ల ఈ అడవులు నిశ్శబ్దంగా ఉండటంతో వాటికి ఈ పేరొచ్చింది. ఇవి సతత హరిత వనాలు. ఈ అడవులు లక్షల ఏళ్ల నుంచి అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. ఈ లోయను దేశంలోనే అపురూప సంపదగా పేర్కొంటారు.
ఉద్యమానికి కారణం: లోయలోని నీలగిరి పర్వతాల సమీపంలో 240 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని కేరళ ప్రభుత్వం 1976లో నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల సుమారు 1000 హెక్టార్ల అరణ్యం నశించి పోతుందని, ఫలితంగా పర్యావరణ సమతుల్య తకు భంగం కలుగుతుందని, అరుదైన వృక్ష, జంతు జాతులు నశించిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జల విద్యుత్ కేంద్రం 30 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేయదని, అందువల్ల ఈ అమూల్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని పేర్కొంటూ శాస్త్ర సాహిత్య పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్దఎత్తున ఉద్యమించారు.
ఫలితం: ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేరళ సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయ పార్కుగా ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు దేశంలో ఎంతో అరణ్య సంపద నశించిపోతున్నా నిశ్శబ్ద లోయలోని అపురూప అరణ్యాలు మాత్రం అలాగే నిలిచి ఉన్నాయి.

చాలియార్ నది కాలుష్య వ్యతిరేక ఉద్యమం
బిర్లా సంస్థ 1958లో గ్వాలియర్ రేయాన్స్ ఫ్యాక్టరీని కేరళలోని చాలియార్ నదికి సమీపంలో ఏర్పాటు చేసింది. దీని నుంచి వచ్చే కాలుష్యం వల్ల నదిలోని చేపలు చనిపోయాయి. నది నీళ్లు పారిన పంట పొలాలు బీళ్లుగా మారాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చర్మ వ్యాధులు సోకాయి. దీంతో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ స్థానికులు 1963లో ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్య మించారు. అయినా వాళ్లు స్పందించకపోవడంతో 1966 నుంచి 1973 వరకు అనేక సార్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడకపోవడంతో 1975లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఫలితంగా కాలుష్య నియంత్రణ మండలి 1981లో కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది. ఈ చర్యను కేరళ హైకోర్టు సమర్థించింది.

సోన్ నది కాలుష్య వ్యతిరేక ఉద్యమం
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న ఆమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంట్ పేపర్ మిల్స్‌ను స్థాపించారు. ఫ్యాక్టరీని ప్రారంభించిన రెండేళ్లకే నదిలోని చేపలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులు చనిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల నదీ జలాలు విషపూరితమవుతున్నాయని, అందువల్ల దాన్ని మూసేయాలని తీర ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు 1970 నుంచి సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పశువులు, నదిలో చేపలు మృత్యువాత పడుతున్నాయని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉద్యమ బాట పట్టడంతో కంపెనీ యాజమాన్యం కాలుష్య నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

భోపాల్ విషవాయువు దుర్ఘటన
భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనలన్నింటిలో అతి భయానక విపత్తుగా భోపాల్ విషవాయువు ఉదంతాన్ని పేర్కొంటారు. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి భోపాల్ నగరంలోని యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యూసీసీ) అనే రసాయన పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకర విషవాయువైన మిథైల్ ఐసోసైనేట్ అధిక మొత్తంలో వెలువడింది. దీని ప్రభావంతో 3,000 మంది మరణించారు. 5 లక్షల మందికి పైగా అనారోగ్యం బారిన పడ్డారు. అనధికార లెక్కల ప్రకారం 15,000 మందికి పైగా మరణించారని భావిస్తున్నారు. భోపాల్‌లో యూసీసీ ప్రాంతంలోని గాలి, నీరు, భూగర్భంలో ఉన్న విషపదార్థాల అవక్షేపాలు నేటికీ శాపగ్రస్థంగానే ఉన్నాయి.
ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడైన వ్యక్తి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈవో వారెన్ అండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. కానీ అతడు తిరిగి వస్తాననే హామీతో బెయిలుపై అమెరికా వెళ్లి మళ్లీ రాలేదు. అండర్సన్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది. చివరకు 2014 సెప్టెంబర్ 29న అండర్సన్ మరణించాడు.
పారిశ్రామిక దుర్ఘటన జరిగినప్పుడు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ పూర్తి పరిష్కారం చూపలేకపోయాయి. చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం 330 కోట్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో కేసు వేయగా అమెరికా కోర్టు ఆ కేసులన్నింటినీ మీరే పరిష్కరించుకోవాలంటూ భారతదేశానికి బదలాయించింది. 1989లో కోర్టు వెలుపల ఒప్పందం కింద యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ 470 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1700 కోట్లు) భారత ప్రభుత్వానికి చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం 2010లో అదనంగా రూ.1500 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది.
ఉద్యమ రూపకర్తలు: భోపాల్ బాధితుల్లో చాలా మంది కంపెనీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. వీరిలో రషీదా బీ, చంపాదేవి శుక్లా ముఖ్యమైనవారు. వీరు భోపాల్ బాధితులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. 1989లో వీరి ఆధ్వర్యంలో ‘భోపాల్ సర్వైవర్స్ మూవ్‌మెంట్’ పేరుతో ఢిల్లీలో వేలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ నాటి ప్రధాని రాజీవ్ గాంధీని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారినా స్పందన కరువవ్వడంతో 2002లో రషీదా, చంపాదేవి ఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. వివిధ దేశాల్లో 1500 మంది వ్యక్తులు వీరికి మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. రషీదా, చంపాదేవి చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి గోల్డ్‌మన్ పర్యావరణ పురస్కారం లభించింది. దీన్ని పర్యావరణ విభాగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు.

ఉద్యమానికి మద్దతు తెలిపిన అంతర్జాతీయ సంస్థలు:

1. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, బ్రిటన్
2. ది భోపాల్ మెడికల్ అప్పీల్
3. గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్
4. అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్‌మెంట్, కాప్స్ వాచ్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్
5. భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్, జపాన్

అన్నా హజారే వాటర్‌షెడ్ పథకాలు
అన్నా హజారే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి చెందినవారు. ఈ ప్రాంతం నీటి వనరుల కొరత వల్ల చాలా వెనుకబడి ఉండేది. కనీసం తాగునీరు దొరకని దుస్థితి. కరవు కాటకాలతో భూమి బీటలువారి ఎడారిని తలపించేది. జీవనాధారం లేక ప్రజలంతా గ్రామం నుంచి వలస బాట పట్టారు. దీనికంతటికి కారణం జల వనరులు లేకపోవడమే అని గ్రహించిన అన్నా హజారే సాంప్రదాయిక పద్ధతిలో జల సంరక్షణ చేయడానికి కృషి చేశారు. వాటర్‌షెడ్ పథకాలే దీనికి సరైన పరిష్కారంగా భావించి ఒక ఉద్యమంలా వీటి నిర్మాణాన్ని చేపట్టారు.
వాటర్‌షెడ్ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో వర్షపు నీరు భూమి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. అన్నా హజారే కృషితో ఒకప్పుడు 70 ఎకరాలే సాగయ్యే భూ విస్తీర్ణం 1300 ఎకరాలకు పెరిగింది.

రాజేంద్రసింగ్ జోహడ్ పథకం
రాజస్థాన్‌లో అర్ధ చంద్రాకార చెక్‌డ్యాంను ‘జోహడ్’ అంటారు. ఈ రాష్ట్రంలో తరచుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చేది. నీటి సౌకర్యం లేకపోవడంతో తరచుగా కరవు కాటకాలు ఏర్పడేవి. రాజేంద్రసింగ్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చెక్ డ్యాంల నిర్మాణమే అని భావించారు. నలుగురు మిత్రుల తోడ్పాటుతో ‘కిశోరి’ అనే మారుమూల గ్రామంలో నీటి కోసం కృషి చేశారు.
రాజేంద్రసింగ్ 1985లో ‘తరుణ భారత్ సంఘ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆల్వార్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో జోహడ్ కట్టడాలను ఒక ఉద్యమంగా విస్తరించారు. గ్రామ ప్రజల సమష్టి కృషితో కొన్ని వందల చెరువుల్లో పూడిక తీశారు. అనేక ప్రదేశాల్లో చెక్‌డ్యాంలు, జలాశయాలను నిర్మించారు. దీనివల్ల ఎండిపోయిన ఆర్వారీ నది జీవనదిగా మారిపోయింది. ఈ విధంగా 1500 గ్రామాల్లో 4500 జోహడ్‌లను నిర్మించి 2500 జలసంరక్షణ పథకాలను పూర్తిచేశారు. ఫలితంగా అంతరించిపోయిన 5 నదులు జీవ నదులుగా మారిపోయాయి. 650 గ్రామాలకు మెరుగైన జలసౌకర్యం కలిగింది. రాజేంద్రసింగ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రామన్ మెగసెసే అవార్డు అందించారు. రాజస్థాన్ ప్రజలు ఆయనను ‘జోహడ్ వాలా బాబా’ అని పిలుచుకుంటారు.

జలమందిర్ ఉద్యమం-గుజరాత్
గుజరాత్‌లోని కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో తరచుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడేవి. స్వామి నారాయణ శిష్యవర్గానికి చెందిన మాధమ్ ప్రియదాస్ ‘రాతి మందిరాల బదులు జల మందిరాలు నిర్మిద్దాం’ అనే నినాదం ఇచ్చి, 2000లో జల ఉద్యమాన్ని నడిపారు. ఈయనతో పాటు వివేకానంద రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇంజనీర్లు ప్రజలను చైతన్యపరిచారు. స్వామి నారాయణ శిష్య బృందంతో పాటు రామ్‌భియా అనే జానపద గాయకుడు దాదాపు 12 గ్రామాల్లో ‘జలమందిర్ యాత్ర’ చేపట్టారు. వీరు 60 శాతం ప్రభుత్వం, 10 శాతం వివేకానంద రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, 30 శాతం ప్రజలు సమకూర్చిన నిధులతో అనేక చెక్‌డ్యాంలను నిర్మించి నీటి సమస్యను చాలావరకు తగ్గించారు.

నవధాన్య ఉద్యమం
ఆహార ధాన్యాలను కేవలం అధిక ఉత్పత్తి పేరుతో విషతుల్యం చేస్తున్నారని, దీనివల్ల మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త వందనా శివ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఫెర్టిలైజర్స్ వాడకాన్ని నిర్మూలించాలని, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని ఆమె పేర్కొన్నారు. క్రిమి సంహారక మందుల వాడకంతో మనం తినే ఆహారం కూడా కలుషితమవుతోందని, ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారని ఆమె ఉద్యమించారు. స్వచ్ఛమైన విత్తనాలను కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో 1991లో ఆమె నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించారు. సహజ సిద్ధ ఆహారాల వినియోగంపై అవగాహన కల్పించడానికి కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలను కూడా రూపొందించారు.
నవధాన్య ఉద్యమంలో భాగంగా చేసిన కృషికి వందనా శివ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆమెను టైమ్ మ్యాగజైన్ ‘పర్యావరణ హీరో’గా అభివర్ణించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన సేవకుగాను ప్రతిష్టాత్మక సిడ్నీ శాంతి పురస్కారం కూడా లభించింది.

తెలంగాణలో పర్యావరణ కార్యక్రమాలు..
స్వచ్ఛ తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపును అందుకొని తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రతి పౌరుడు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేస్తోంది.

హరితహారం
2015 జూలై 3న హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో చిలుకూరు వద్ద ప్రారంభించారు. తెలంగాణ భూభాగంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కార్యాచరణ ప్రణాళిక: రానున్న మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా.. అటవీ ప్రాంతాల్లో 100 కోట్లు, అటవీ ప్రాంతాలకు వెలుపల 120 కోట్లు, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో 10 కోట్ల మొక్కలు నాటుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 3888 నర్సరీల ద్వారా మొక్కలను సమకూర్చనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు.

మిషన్ కాకతీయ
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 2015 మార్చి 12న లాంఛనంగా ప్రారంభించారు.
  • దీని క్యాప్షన్ : మన ఊరు - మన చెరువు.
  • ఉద్దేశం: రాష్ట్రంలో గ్రామాల ఆర్థిక సామాజిక వికాసానికి చెరువులు దోహదపడతాయనే ఉద్దేశంతో వాటిని పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ ప్రారంభించారు. ఈ పథకం కింద దాదాపు 46531 చెరువులను పునరుద్ధరించనున్నారు.
  • కాలం: 5 ఏళ్లు (2014-15 నుంచి 2018-19). ఏటా 9306 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలు
  • పూడిక తీసి చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం.
  • చెరువు కట్టలను బలోపేతం చేయడం. చెరువు అలుగు, తూములను మరమ్మతు చేయడం.
  • క్రాస్, డ్రైనేజీ స్ట్రక్చర్‌ను మరమ్మతు చేయడం.
  • చెరువుల్లో పెరిగే తుమ్మ తదితర చెట్లను నరికేయడం.
  • గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం.
  • మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడం.

మిషన్ భగీరథ(తెలంగాణ వాటర్ గ్రిడ్)

రాష్ట్రంలోని 25,139 గ్రామీణ ఆవాసాలు, 59 పురపాలక సంఘాలు, 5 నగరపాలక సంస్థల పరిధిలో ప్రజలందరికీ నిత్యం రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. 2050 వరకు తెలంగాణలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2015 జూన్ 8న నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం పైలాన్‌ను ఆవిష్కరించారు.
రూ. 35 వేల కోట్లతో ఈ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల తాగునీటిని అందించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ లాంటి ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొనే జిల్లాలకు ఈ పథకం సంజీవిని లాంటిది.
Published date : 23 Dec 2015 11:59AM

Photo Stories