Skip to main content

ఆర్టికల్ 370 రద్దు

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆర్టికల్ 370 రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఆయన ప్రకటించారు. వెనువెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి సర్వాధికారాలు లభించాయి.
కశ్మీర్ రెండుగా విభజన..
ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే ఆర్టికల్ 35ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం జమ్మూకశ్మీర్‌ను రెండు భాగాలు అంటే జమ్ము-కశ్మీర్, లఢక్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.

ఆర్టికల్ 370 గురించి....
  • జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు.
  • కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి.
  • షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు.
  • అధికరణ 35ఏ ద్వారా జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసులను నిర్వచించే అధికారం ఆ రాష్ట్ర శాసన సభకు లభిస్తోంది.
  • 1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక్కడ దీర్షకాలం నివసిస్తున్న వారికి సర్టిఫికేట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఆర్టికల్ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చవచ్చు. ఈ రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే...ఆమెకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో స్థిరాస్తులు ఉండడానికి వీల్లేదు. ఆమె పిల్లలకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శ్వాశత నివాస సర్టిఫికేట్ ఇవ్వరు.

రాజ్యాంగంలో : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చని భారత రాజ్యంగంలో ఉంది.
Published date : 05 Aug 2019 02:39PM

Photo Stories