Skip to main content

లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక

పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్‌కు లోగోను, నినాదాన్ని ఖరారు చేశారు.
లోక్‌పాల్ లోగో డిజైన్, నినాదం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 6వేల మందికి పైగా ఈ పోటీలో పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపించారు. ఇందులో నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన డిజైన్‌ను లోక్‌పాల్ లోగోగా ఎంపికచేశారు.

లోక్‌పాల్ లోగో
‘లోక్‌పాల్ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది.. ఎలా న్యాయం చేస్తుంది’ అనేది ప్రతిబింబించేలా లోక్‌పాల్ లోగోను ప్రశాంత్ రూపొందించారు. ప్రజలను సూచించేలా ముగ్గురు వ్యక్తులు, అశోక చక్రం, న్యాయవ్యవస్థను సూచించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారుచేశారు. మువ్వన్నెల రంగుల్లో ఈ లోగో ఎంతో ఆకట్టుకుంటోంది. మొత్తం 2,236 మంది లోగో డిజైన్లు పంపగా... ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించారు. లోగో విజేతకు రూ.25వేల నగదు బహుమతి ప్రకటించారు.

లోక్‌పాల్ నినాదం
4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి సంతృప్తికరంగా లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయలేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. నినాదం విషయమై లోక్‌పాల్ కమిటీ చర్చించి సొంతంగా ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని ఎంపిక చేసింది. ‘పరుల సొమ్ము ఆశించరాదు’అనేది ఈ నినాదం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక
ఎప్పుడు : 2019, నవంబర్ 27
ఎవరు : కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
Published date : 05 Dec 2019 01:32PM

Photo Stories