Skip to main content

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు-సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు

దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు 2020, సెప్టెంబర్ 30న స్పష్టం చేసింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్(సురేంద్ర కుమార్ యాదవ్)కు సెప్టెంబర్ 30వ తేదీ చివరి పని దినం కావడం గమనార్హం.
ఆ 32 మంది వీరే..
బాబ్రీమసీదు కూల్చివేత కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించింది. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది కోర్టుకు హాజరయ్యారు.

32 మంది వివరాలు..
1. ఎల్‌కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్‌ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా.

చదవండి:
అయోధ్య భూ వివాదం- సుప్రీంకోర్టు తుది తీర్పు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు-వివరాలు

శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణానికి భూమి పూజ-వివరాలు

1992 డిసెంబర్ 6న ఏం జరిగింది?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికలో 1992, డిసెంబర్ 6న అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. మన్మోహన్ సింగ్ లిబర్‌హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి.

1526 నుంచి 2020 దాకా..
1526: 1526లో బాబర్ సైనికాధికారి మీర్ బాకీ అయోధ్యలో మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట.
1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది. హషీమ్ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది.
1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ ఈ బృందానికి నేతృత్వం వహించారు.
1986: ఫైజాబాద్ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు.
1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది.
1992: డిసెంబర్ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు.
1993: కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్ బన్సల్, ధరమ్ దాస్, నృత్య గోపాల్‌దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి.
1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్‌కే అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్‌కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్‌బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ తదితరులు కేసు గెలిచారు.
2003: రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్‌కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం.
2005: అలహాబాద్ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది.
2010: అలహాబాద్ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది.
2012: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ.
2015: బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు
2017: అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు.
2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు.
2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే.యాదవ్ తీర్పు.
Published date : 02 Oct 2020 11:15AM

Photo Stories