Skip to main content

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నం

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా 2018, నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ చిహ్నాన్ని మల్టీ కలర్, నీలం, నలుపు తెలుపు రంగుల్లో ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు.

కొత్త అధికారిక చిహ్నంలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. చిహ్నం పైభాగంలో ‘ఆంధ్రప్రదేశ్’ అని, కింది భాగంలో ‘సత్యమేవ జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో ‘పూర్ణ కుంభం’ ఉండేది. కానీ ధాన్య కటక మహాచైత్యంలో ఉన్నది పూర్ణఘటమే తప్ప, పూర్ణ కుంభం కాదని...ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక కమిటీని నియమించింది. వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది. అధికారిక చిహ్నాన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదన్న విషయంలోను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

చిహ్నం వాడేందుకు అర్హులు...
  1. ముఖ్యమంత్రి, మంత్రులు
  2. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  3. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు
  4. అడ్వకేట్ జనరల్
  5. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు
  6. జిల్లా కలెక్టర్లు
  7. సచివాలయ మధ్యస్థాయి అధికారులు, వారికి సమాన హోదా కలిగినవారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధికారిక చిహ్నం
ఎప్పుడు : నవంబర్ 14, 2018
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Published date : 15 Nov 2018 05:35PM

Photo Stories