How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్లైన్లో ఇలా నమోదు చేసుకోండి..
![How To Apply Voter ID Card](/sites/default/files/images/2021/11/05/vote-1636108466.jpeg)
ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ ఓటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ ఓటర్ల జాబితా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అదేవిధంగా గతంలో ఓటు హక్కు పొందలేకపోయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు అక్టోబర్ 6, 7, 27, 28 వ తేదీలలో డిసెంబర్లో రెండు రోజుల పాటు అధికారులు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నేరుగా వెళ్లి నమోదు..
ఓటరు నమోదు, మార్పుల, చేర్పులు, అభ్యంతరాలపై పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు. పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసుకోవచ్చు. జాబితాలో అభ్యంతరాలుంటే తెలపవచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో నమోదై ఉన్నట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. తాను కోరుకున్న చోటుకు తమ పేరు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
ఆన్లైన్లో దరఖాస్తు ఇలా..
డిసెంబర్ 15వ తేదీ లోపు ఓటరుగా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోదల్చినవారు ముందుగా https://voterportal.eci.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి ఆప్లోడ్ చేయాలి. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15 న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి..
పేరు నమోదు చేసుకునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ఆధార్కార్డు ఉండాలి. దరఖాస్తు ఫారాలను పూరించి ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యువత సద్వినియోగం చేసుకోవాలి..
మండలంలోని 50 పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించాం. వారు ప్రతి పోలింగ్బూత్లో అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నమోదు, సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్పులు, చేర్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాçస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యత గుర్తించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకోసం తమతమ పేర్లు నమోదు చేసుకోవాలి.