Skip to main content

Republic Parade: ఈ సారి పూర్తిగా మేడిన్‌ ఇండియానే.. రిపబ్లిక్‌ డే వేడుకల విశేషాలు తెలుసా... ఆన్‌లైన్‌లో ఇప్పటికే టికెట్లు

74వ గణతంత్ర వేడుకలకు దేశం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా రిపబ్లిక్‌ డే నాడు నిర్వహించే పరేడ్‌ రిహార్సల్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఈ పరేడ్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి ముఖ్య అతిథిగా రానున్నారు.

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు సంబంధించిన టికెట్లను కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. కేవలం భారత్‌లో తయారు చేసిన ఆయుధాలను మాత్రమే ఆర్మీ దీనిలో ప్రదర్శించనుంది. 
ఈ పరేడ్‌కు సంబంధించిన వివరాలను ఢిల్లీ ఏరియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ భవినీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉదయం 10.30కు ఈ పరేడ్‌ విజయ్‌ చౌక్‌ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ ఏడాది కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్‌ డే కార్యాక్రమంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఆయుధాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఆయుధాలు కాకుండా.. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం దీనిలో పాల్గొంటాయి. 
ప్రత్యేకతలు ఇవీ...
ఈజిప్ట్‌ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొననుంది. దీనిలో 120 ఈజిప్ట్‌ సైనికులు ఉంటారు. వీరు ఇప్పటికే దిల్లీ చేరుకొని సాధన చేస్తున్నారు.
 కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్‌లో భాగస్వాములు కానున్నారు. 
పరేడ్‌ కోసం నేవీకి చెందిన ఐఎల్‌38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది.
రిపబ్లిక్‌ డే ఫ్లైపాస్ట్‌లో మొత్తం 44 విమానాలు  పాల్గొననున్నాయి.  వీటిల్లో తొమ్మిది రఫేల్‌ జెట్‌ విమానాలు కూడా ఉండనున్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్‌ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Published date : 24 Jan 2023 07:07PM

Photo Stories