Skip to main content

భారతదేశంలో ముస్లింల స్థితిగతులు, సంక్షేమం - విశ్లేషణ

-ప్రేమ విఘ్నేశ్వర రావు .కె, పోటీ పరీక్షల విశ్లేషకులు.
దేశంలోని మైనారిటీల్లో అత్యధికులు ముస్లింలు. మొత్తం జనాభాలో 13.4% ఉన్న ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం సంపన్న, ఉన్నత వర్గాలకు చెందిన ముస్లింలు పాకిస్తాన్, లండన్ తదితర దేశాలకు వలస వెళ్లారు. మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోయారు. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా దళితుల కంటే వెనుకబడి ఉన్నారు. వీరి సరాసరి ఆదాయం ఇతర మతస్తుల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. దీనికి స్త్రీలలో నిరక్ష్యరాస్యత, అధిక సంతానం, నిరుద్యోగం, పేదరికం, భూములు లేకపోవడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్య, పరిజ్ఞానాలు లేకపోవడం, విద్యా విజ్ఞానాల పట్ల నిర్లక్ష్యవైఖరి లాంటి అనేక కారణాలున్నాయి.

ముస్లింల స్థితిగతులు - కారణాలు:
అక్షరాస్యత:
అక్షరాస్యత శాతం ముస్లింలలో 59.1 శాతం ఉంటే, క్రైస్తవుల్లో 80.3 శాతం, సిక్కుల్లో 69.4 శాతంగా నమోదైంది. 2004-05 NSSO సమాచారాన్ని 2009-10తో పోల్చుకుంటే, ఈ కాలంలో ముస్లిం yఓబీసీల అక్షరాస్యత స్థాయిలు గ్రామీణ ప్రాంతాల్లో 5.9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.3 శాతం మెరుగుపడినట్లు నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక తెలిపింది. ఇదే కాలంలో దళితులలో అక్షరాస్యత గ్రామీణ ప్రాంతాల్లో 8.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.1 శాతం పెరిగింది. గిరిజన కులాల్లో అక్షరాస్యత గ్రామీణ ప్రాంతాల్లో 11.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8.6 శాతం పెరిగింది. ఫలితంగా, దళితులు, గిరిజనులతో సుమారు సమాన స్థాయిలో ఉన్న ముస్లింలు ఇప్పుడు వారికంటే వెనుకబడి ఉన్నారు. పదో తరగతి పూర్తి చేసుకుంటున్న ఎస్‌టి, ఎస్‌సి విద్యార్థుల సంఖ్య వరుసగా పట్టణ ప్రాంతాల్లో 13, 11 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా 10, 9 శాతం పెరిగింది. ఇది ముస్లిం విద్యార్థుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 5-7 శాతం మాత్రమే. ఇదే కాలంలో, ముస్లిం ఓబీసీలకు సంబంధించి 17-29 సంవత్సరాల మధ్య ఉన్నత విద్యలో ఉన్న వారి వాటా కేవలం 1.6 శాతం మాత్రమే పెరిగింది. ఇతర ముస్లింలకు అది 0.8 శాతం పాయింట్లు మాత్రమే పెరిగింది. హిందూ అగ్రకులాల్లో ఇది 9.4 పాయింట్లు, హిందూ ఓబీసీల్లో 5.3 పాయింట్లు పెరుగుదల ఉంది. దళితులు, గిరిజనుల్లో మెరుగుదల ముస్లింల మాదిరిగానే ఉంది.

పేదరికం:
దేశంలో ముస్లింలలోనే ఎక్కువ పేదరికం ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. భారత దేశంలోని ప్రధాన మతాల్లో 'ఉద్యోగ - నిరుద్యోగ పరిస్థితులు' అనే అంశంపై NSSO (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం ఇతర మతాలతో పోల్చుకుంటే ముస్లింలలో జీవన ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ముస్లింలు రోజుకి సగటున 32 రూపాయల 66 పైసలు మాత్రమే ఖర్చు పెడుతున్నట్టు తేలింది. హిందువుల్లో రోజుకి సగటు వ్యయం 37 రూపాయల 50 పైసలు ఉండగా, క్రిస్టియన్‌లలో ఇది 51 రూపాయల 43 పైసలు ఉన్నట్లు ఈ సర్వేలో తేటతెల్లమైంది. సిక్కులు అత్యధికంగా రోజుకి 55 రూపాయల 30 పైసల చొప్పున ఖర్చు పెడుతున్నట్లు సర్వే వెల్లడించింది. సిక్కు కుటుంబం నెలకు సగటున 1659 రూపాయలు ఖర్చు చేస్తుండగా, ముస్లిం కుటుంబం 980 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతోంది. హిందువుల కుటుంబం 1125 రూపాయలు ఖర్చు చేస్తుండగా, క్రిస్టియన్‌ల కుటుంబం సగటున 1543 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

పట్టణ ముస్లింలతో పోల్చుకుంటే గ్రామీణ ముస్లింలలో పేదరికం మరీ ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. పట్టణాల్లో ముస్లింలు నెలకు సగటున 1272 రూపాయలు ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంత ముస్లింలు నెలకు 833 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతున్నారు. హిందువులు ఖర్చు పెట్టగలిగే శక్తిలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని హిందువులు నెలకు 1797 రూపాయలు ఖర్చు చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని హిందువులు సగటున 888 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఇకపోతే గ్రామీణ ప్రాంత క్రిస్టియన్‌లు నెలకు సగటున 1296 రూపాయలు ఖర్చు చేస్తుండగా, పట్టణాలలో 2053 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

తలసరి వ్యయం
ప్రణాళిక సంఘం ప్రచురించిన 2011 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోల్చితే ముస్లింల తలసరి కుటుంబ వ్యయం 89 శాతమే. హిందువుల్లో తలసరి కుటుంబ వ్యయం 97 శాతం, క్రైస్తవుల్లో 100 శాతం, సిక్కులు, జైనుల్లో 132 శాతం ఉంది. ఎస్సీలు 78 శాతం, ఎస్టీలు 67 శాతం తలసరి కుటుంబ వ్యయంతో ముస్లింల కంటే వెనుకబడి ఉన్నారు. అంటే ముస్లింలు జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్నారని స్పష్టమవుతుంది.

సాంప్రదాయ వృత్తులు, అల్పవేతనాలు:
దేశ స్థూల జాతీయోత్పత్తికి ముస్లింలు 11.2 శాతం మాత్రమే తోడ్పడుతుండగా, దళితులు, ఆదివాసీలు 16.5 శాతం తమ వంతుగా అందిస్తున్నారు. ఈ వర్గాలవారు పెద్దగా విద్యా వంతులు కాకపోవడం, సాంప్రదాయ, తక్కువ విలువ సృష్టించే వృత్తులలో పనిచేయడానికి నెట్టబడడటం దీనికి కారణం. సాంప్రదాయక సేవల పని సిబ్బందిలో ముస్లింలు, ఎస్‌సి / ఎస్‌టిల ఒక్కొక్కరి వాటా 18 శాతం కాగా, అధునాతన సేవలలో వారి వారి వాటాలు వరుసగా కేవలం 8, 14 శాతం మాత్రమే.

ముస్లింలు తక్కువ చెల్లించే ఉద్యోగాలపైనే కేంద్రీకరణ కొనసాగించారని వివిధ రకాల పనుల్లో ఉపాధి విశ్లేషణ తెలిపింది. వ్యవసాయేతర వృత్తులు, ప్రధానంగా చేతివృత్తుల ద్వారా స్వయం ఉపాధే ముస్లిం కుటుంబాలలోని దాదాపు నాలుగు వంతుల మందికి ఆదాయ వనరు. 14 శాతం మంది దళితులు, 6 శాతం మంది గిరిజనులు మాత్రమే ఇటువంటి వృత్తుల నుంచి వారి జీవన భృతిని ఆర్జిస్తున్నారు. మరో 23 శాతం ముస్లిం కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. దళితులు, గిరిజనులలో 36 శాతం మంది వ్యవసాయ కూలీలుగానే తమ జీవన భృతిని పొందుతున్నారు.

పట్టణాల్లో 45 శాతానికి పైగా ముస్లింలు స్వయం ఉపాధులపై జీవనాన్ని సాగిస్తున్నారు. ఇది ఇతర అన్ని వర్గాల కంటే ఎక్కువ. వారు సాధారణంగా, ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు, మరమ్మత్తులు వంటి వివిధ సేవల్లో నిమగ్నమై ఉంటారు. ఎక్కువ వేతనాలు లభించే ఉద్యో గాల్లో ఇతర వర్గాల కంటే ముస్లింల భాగం చాలా తక్కువ. పట్టణ ప్రాంతాల్లో 15 సంవత్సరాలు ఆపై వయస్సు గల ముస్లిం కార్మికుల్లో 88 శాతం మంది లాంఛనమైన ఉపాధిలో ఉన్నారని 2009 - 10 NSSO నివేదిక వెల్లడించింది.

ముస్లింలకు దక్కని ఉపాధి హామీ:
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కూడా ముస్లిం సమాజానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చట్లేదు. ఈ పథకం క్రింద 2.3 శాతం ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉపాధి పొందగలిగాయని నేషనల్ శాంపిల్ సర్వే అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వివిధ పథకాల ప్రయోజనాలను మైనారిటీ వర్గాలకు చేరే విషయంలో విధానపరమైన గందరగోళం ఉందని కూడా NSSO నివేదిక పేర్కొంది.

ప్రభుత్వోద్యాగాల్లో అత్యల్ప ప్రాతినిధ్యం
సచార్ నివేదిక ప్రకారం, ముస్లింలు ప్రభుత్వ, సామాజిక రంగాల్లో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రభుత్వ రంగాల్లో ముస్లింల ఉద్యోగాలు (సచార్ నివేదిక ఆధారంగా)
రంగం లేదా విభాగం ముస్లింల శాతం
మొత్తం 4.9
పీఎస్ యూలు (PSUs) 7.2
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ 3.2
రైల్వేలు 4.5
న్యాయం 7.8
ఆరోగ్యం 4.4
రవాణా 6.5
హోం అఫైర్స్ 7.3
విద్య 6.5
ఇతర కులాలు, సామాజిక గ్రూపులు కంటే అతి తక్కువగా కేవలం 6 శాతం మంది ముస్లింలే ప్రభుత్వోద్యోగాలలో ఉన్నారని నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించింది.

శిశు మరణాల రేటు:
2001 జనాభా గణాంకాల ప్రకారం ఐదేళ్ల లోపు శిశుమరణాల రేటు (ప్రతి వెయ్యిమందిలో) ముస్లింలలో 95 శాతం ఉంటే క్రైస్తవుల్లో 77 శాతం, సిక్కుల్లో 82 శాతం ఉంది. అంటే ముస్లింల పరిస్థితి మిగతా మైనారిటీల కంటే దారుణంగా ఉందని స్పష్టమవుతుంది.

భూమి యాజమాన్యం:
సచార్ కమిటీ నివేదిక ప్రకారం భూమిలేని ముస్లిం జనాభా శాతం 60.2 ఉంటే, క్రైస్తవుల జనాభాలో 54.81 శాతం, సిక్కులలో 66.50 శాతం మందికి భూమిలేదు. అంటే పై గణాంకాల ప్రకారం మిగతా మైనారిటీలతో పోల్చితే ముస్లింల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్పష్టమవుతుంది. భారతదేశంలో 13.4% ఉన్న ముస్లింలకు, వ్యవసాయ భూమి కేవలం 1% ఉంది. అంటే వీరు వ్యవసాయ రంగంలో దాదాపు లేనట్లే.

నిర్బంధంలోనూ అన్యాయం:
జాతీయ నేర గణాంక సంస్థ 2012 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం విచారణ (జైళ్లలో మగ్గుతున్న) ఎదుర్కొంటున్న వారిలో 21 శాతం మంది ముస్లింలే. అయితే నేరస్తుల్లో కేవలం 17.75 శాతం మంది మాత్రమే ముస్లింలు. మిగతా వారంతా నిరపరాధులే. మిగతా మతస్తుల విషయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఉదాహరణకు జైళ్లలో మగ్గుతున్నవారిలో 69.92 శాతం మంది హిందువులయితే వారిలో 71.35 శాతం మంది నేరస్తులు. క్రైస్తవుల విషయంలో జైళ్లలో ఉన్నవారు 3.5 శాతమయితే నేరస్తులు 3.99 శాతం. కర్నాటక, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ మినహా మిగిలిన 23 రాష్ట్రాల్లోనూ నేరస్తుల కంటే నిర్బంధంలో ఉన్నవారి సంఖ్య అధికంగా ఉంది. గణాంకాల ప్రకారం మిగతా మతస్తులతో పోల్చితే నేరాలు చేయకపోయినా అన్యాయంగా ముస్లింలు జైళ్లలో మగ్గుతున్నారని నిర్ధారణ అవుతుంది. ముస్లింలపై పోలీసులు వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణల్లో నిజం ఉందని స్పష్టమవుతుంది.

రుణ లభ్యత:
ప్రాధాన్యత ప్రాతిపదికపైన మైనారిటీ వర్గాలకు రుణ సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పించడం 15 అంశాల కార్యక్రమం పెద్ద లక్ష్యాలలో ఒకటి. 121 జిల్లాల్లో ముస్లింలకు సగటున తలసరి రుణాలు రూ. 50,000 (2008లో) నుంచి రూ.1,00,000 (2011లో) కు పెరిగినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు సమాచారం తెలిపింది. అయితే అదే జిల్లాల్లో హిందువులకు ఇచ్చిన రుణాలు 2008లో రూ.2,30,000 ఉండగా అవి 2011 నాటికి రూ.2,70,000కు పెరిగాయి.

నిధుల వినియోగం:
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన వ్యయాన్ని నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక సమీక్షించింది. 2008-09లో రూ.500 కోట్లుగా ఉన్న కేటాయింపు 2012-13లో రూ.3,135 కోట్లకు పెరిగిందని, అయితే నిధుల్లో 20 శాతం ఉపయోగించకుండా ఉన్నందున మొత్తం ముస్లిం జనాభాలో 50 శాతం మందికి మాత్రమే పథకాలు వర్తింపజేసిన కారణంగా, వాస్తవంగా తలసరి వ్యయం కేవలం రూ.230 మాత్రమేనని నివేదిక వెల్లడించింది. బహుళ రంగ అభివృద్ధి కార్యక్రమం కోసం 2011-12లో అందుబాటులో ఉన్న రూ.2,966 కోట్లలో 44 శాతం మాత్రమే వెచ్చించారు. స్కాలర్‌షిప్‌ కార్యక్రమాల్లో మాత్రమే పూర్తి నిధులు వినియోగించారు.

ముస్లింలు- సచార్ కమిటీ నివేదిక
2006లో న్యాయమూర్తి రాజేందర్ సచార్ కమిటీ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితికి సంబంధించి నివేదికను సమర్పించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:
  1. ప్రభుత్వ విధానాల వల్ల ముస్లింలకు లభిస్తున్న ఊరట అంతంత మాత్రమే.
  2. ఉపాధి, గృహ, విద్యా రంగాల్లో వీరు మరింత వివక్షకు గురవుతున్నారు.
  3. లింగపరమైన వివక్షను ముస్లింల పర్సనల్ లాతో ముడిపెడుతున్నారు.
  4. మిగిలిన మహిళల కంటే ముస్లిం మహిళలు, విద్యా, ఉపాధి రంగంలో మరీ ఎక్కువ వివక్షకు గురవుతున్నారు.
  5. మతపరమైన అల్లర్లు జరిగే ప్రాంతాల్లో నివసించే ముస్లింలలో అభద్రతా భావం ఎక్కువ. పోలీస్ వ్యవస్థ అనుసరించే వివక్షా ధోరణి దీన్ని మరింత ఎక్కువ చేస్తుంది.
  6. విద్యారంగంలో వెనుకబాటుతనం ఈ సమాజాన్ని మరింత కుంగదీస్తుంది. మాతృభాషలో విద్యావకాశాలు అంతంత మాత్రంగానే ఉండటం, పాఠ్యగ్రంథాల్లో ఈ వర్గాన్ని జాతి వ్యతిరేకవర్గంగా చిత్రించడం లాంటి అంశాలు వీరిలో మిగిలిన సమాజం పట్ల వ్యతిరేకత, నిరాశావాదానికి దారితీస్తున్నాయి.
  7. మదర్సాలలో లభిస్తున్న విద్యావకాశాలు ఉపాధికి దోహదం చేయడం లేదు.
  8. ప్రపంచీకరణ నేపథ్యలో ఉద్యోగావకాశాలు తగ్గడం ఈ వర్గాన్ని మరింత దెబ్బతీసింది. వీరు ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. చేతివృత్తుల మీద ఆధారపడే వీరు విదేశాల నుంచి చౌకగా దిగుమతి అవుతున్న వస్తువుల పోటీకి తట్టుకోలేకపోతున్నారు.
  9. బ్యాంకుల ద్వారా వీరికి లభించే రుణ సదుపాయాలు అంతంత మాత్రమే. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రదేశాలను బ్యాంకులు రెడ్ జోన్ గా పరిగణిస్తాయి.
  10. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాల విషయంలో వీరు మరింత వివక్షకు గురవుతున్నారు. వీరు నివసించే ప్రాంతంలో రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి
  11. రాజకీయ భాగస్వామ్యంలో కూడా వీరు వెనుకబడి ఉన్నారు. ఓటర్ల జాబితాలో వీరి పేర్లు గల్లంతవ్వడం, వీరి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేయడం లాంటి చర్యలు వీరిలో మరింత నిర్లిప్తతా ధోరణికి దోహదం చేస్తున్నాయి. ఇది పరాయీకరణకు దోహదం చేస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకొని మత ఛాందస సంస్థలు యువతను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించడం, కొన్ని సందర్భాల్లో ముస్లిం యువత అతివాదం, ఉగ్రవాదం వైపు ఆకర్షితుaలవుతున్నారు.
ముస్లిం స్థితిగతులపై రంగనాథ్ మిశ్రా కమిషన్:
మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ 30 ఏళ్లుగా పరిష్కారం లేకుండా నలుగుతున్నది. తమను కూడా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి రిజర్వేషన్‌లు కల్పించాలని ముస్లింలు చాలా కాలంగా కోరుతున్నారు. మైనారిటీ ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి రాబోయే కాలంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సూచించమని 2004 అక్టోబర్ 29న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ దేశమంతా పర్యటించి మైనారిటీ మతాల స్థితిగతులపై, వారి జీవితాలపై రాష్ట్రప్రభుత్వాల నుంచి అధికారిక సమాచారాన్ని సేకరించింది. వాటిని క్రోడీకరించి, అధికారిక గణాంకాలతో వారి వాస్తవ దుస్థితిపై ఒక సమగ్ర నివేదికను 2007 మే 21న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ముస్లింలు అన్నిరంగాలలోనూ సగటు పౌరుల కంటే వెనుకబడి ఉన్నారని, కొన్ని అంశాలలో దళితుల కన్నా హీనమైన పరిస్థితుల్లో ఉన్నారని కమిషన్ వెల్లడించింది.

నివేదికలో ముఖ్యాంశాలు:
  1. ముస్లింలు అన్నిరంగాలలోనూ సగటు పౌరుల కంటే వెనుకబడి ఉన్నారు.
  2. కొన్ని అంశాలలో దళితుల కంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్నారు.
  3. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదు.
  4. వీరి అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది.
  5. ముస్లింల ఉద్యోగాల శాతం తక్కువ.
  6. ఎక్కువ మంది ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.
  7. బాల్య వివాహాలు, పాఠశాలలో డ్రాప్‌ అవుట్‌లు ఎక్కువగా ముస్లింలవే ఉంటున్నాయి.
  8. ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర సంస్థల వల్ల వీరు పొందుతున్న ప్రయోజనం రెండు శాతం మాత్రమే.
  9. బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు 1.3 శాతం మాత్రమే.
నేషనల్ శాంపిల్ సర్వే, మానవాభివృద్ధి నివేదికలు, జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక, సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ లు వెల్లడిస్తున్న సారాంశం ఒక్కటే. అది ముస్లింలు సామాజిక, ఆర్థిక సూచికల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలంటే ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా కృషిచేయాల్సి ఉంది.

సిఫార్సులు:
  1. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ ప్రకారం మైనారిటీ ప్రజలకు న్యాయం చేయాలంటే ఆర్టికల్ 16(4) ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన ప్రజల జాబితాలో మైనారిటీలకు చోటు కల్పించాలని, అప్పుడే వారి అభివృద్ధి జరుగుతుందని మిశ్రా కమిషన్ చెప్పింది.
  2. విద్యా, ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని పేర్కొన్నది.
  3. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 46లో పేర్కొన్న ‘బలహీనవర్గాలు’అనే అర్థంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన మైనారిటీలు కూడా వస్తారని, వారికి రిజర్వేషన్లు ఎంతో అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.
  4. ముస్లింలకు రిజర్వేషన్ సామాజిక వెనుకబాటు ప్రాతిపదికపై కల్పించారు కానీ మత ప్రాతిపదికపై కాదని కమిషన్ స్పష్టంగా పేర్కొంది. హిందూమతంలో వెనుకబాటుకు గురైన వారికి రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు అదే తరహాలో వెనుకబాటుకు గురవుతున్న మైనారిటీలకు రిజర్వేషన్లు లేకుండా చేయడం వివక్ష చూపడమేనని , ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని కమిషన్ వ్యాఖ్యానించింది. అంతే కాదు, ఈ రిజర్వేషన్లు జమ్మూకాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, మిజోరామ్, లక్షద్వీప్‌లలో మైనారిటీలుగా ఉన్న హిందూమతానికి చెందిన వెనుకబడిన ప్రజలకు కూడా వర్తింపచేయాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
  5. కమిషన్ నివేదికను 2007 మే 21న సమర్పించినా.. దీనిని 2009 చివరి వరకూ కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. కొంతమంది ఎంపీల ప్రోద్బలంతో పార్లమెంటులో ప్రవేశపెట్టారు కానీ ఆమోదానికి నోచుకోలేదు.
భారతదేశంలో ముస్లింల సంక్షేమం – సమీక్ష
భారతదేశంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశారు. ముస్లింల సంక్షేమం కోసం అనేక కమిటీలు అనేక విలువైన సిఫార్సులు చేశాయి. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ సంక్షేమ చర్యలు ఎంత వరకు సత్ఫలితాలనిచ్చాయి? సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో సమీక్షిద్దాం.

ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు:
మైనారిటీల సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం కాలక్రమేణా అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించింది. 2006 జనవరి 29న కేంద్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. దీనిని మైనారిటీలకు సంబంధించిన విధానాలు, ప్రణాళికలు, పథకాలు, అభివృద్ధి, సమన్వయం, నియంత్రణల కోసం ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం పథకం (PM’s New 15 Point Programme)
విద్యా, ఉపాధి, ఆర్థిక కార్యకలాపాల్లో మైనారిటీలకు తగిన అవకాశాలు కల్పించి వారి పురోగతికి తోడ్పడేందుకు మైనారిటీల సంక్షేమం కోసం 2006లో ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం ప్రకటించారు.

కార్యక్రమం లక్ష్యాలు:
ఎ. విద్యావకాశాలు విస్తరించడం
బి. ప్రస్తుతం ఉన్న పథకాలు, నూతన పథకాల ద్వారా ఆర్థిక కార్యకలాపాల్లో, ఉపాధిలో సమానమైన వాటాకు హామీ ఇవ్వడం కోసం స్వయం ఉపాధికి రుణ సౌకర్యం విస్తరించడం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టడం
సి. మౌలిక వసతుల అభివృద్ధి పథకాల్లో తగిన అవకాశాల ద్వారా మైనారిటీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం
డి. మత హింసను నియంత్రించడం, నిరోధించడం
వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మైనారిటీల్లో వెనుకబడిన కులాలకు చేరాలన్నది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన లక్ష్యం. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మైనారిటీలకు చేరువయ్యేందుకు మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో నిర్ణీత శాతం అభివృద్ధి ప్రాజెక్టులు ఉండాలన్నది ఈ పథకం నిర్దేశిస్తుంది.

నూతన 15 సూత్రాల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పథకాలు:
  • మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే సమగ్ర శిశు అభివృద్ధి పథకం(Integrated Child Development Services (ICDS)
  • మానవ వనరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సర్వ శిక్షా అభియాన్ (SSA), కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం(KGBV)
  • గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అజీవిక (Aajeevika)
  • గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వర్ణ జయంతి రోజ్ గార్ యోజన (SJSRY)
  • కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల స్థాయి పెంపు (Up gradation of ITIs)
  • ఆర్థిక సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రాధాన్యత రుణాలు అందజేయటంలో భాగంగా బ్యాంకు రుణం
  • గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా ఆవాస్ యోజన (Indira Awas Yojana (IAY))
సచార్ కమటీ నివేదిక - సిఫార్సులు:
2006లో న్యాయమూర్తి రాజేందర్ సచార్ కమిటీ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితికి సంబంధించి నివేదికను సమర్పించింది. సచార్ కమిటీ సమాజంలో అణగారిన వర్గాలను ఉద్దేశించి రెండు ముఖ్యమైన సిఫార్సులను చేసింది.
ఎ. అణగారిన వర్గాల క్లేశ నివారణ కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయడం
బి. అన్ని రంగాల్లో క్లేశ నివారణ కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయడం

సచార్ కమిటీ సూచనలు:
  1. సామాజిక మతపరమైన వర్గాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం, సంక్షేమ కార్యక్రమాలను ఈ సమాచార ప్రాతిపదికగా రూపొందించడం
  2. బ్రిటన్ లో మాదిరిగా సమాన అవకాశ కమిషన్ ను ఏర్పాటు చేయడం స్థానిక సంస్థల్లో నామినేషన్ ద్వారా ప్రాతినిధ్యం కల్పించడం(ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చొరవ తీసుకుంది)
  3. వైవిధ్యాన్ని ప్రోత్సహించే విద్యాసంస్థలకు ప్రోత్సాహకాలివ్వడం
  4. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలను నెలకొల్పి మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించడం
  5. బ్యాంకింగ్, ప్రభుత్వ రంగాల్లో లభిచే ఉద్యోగావకాశాలను వినియోగించుకోవడానికి ఉచిత శిక్షణా సంస్థలను నెలకొల్పడం
  6. పోలీస్, సైన్యం వంటి రంగాల్లో వీరి శాతాన్ని పెంచడానికి కృషి చేయడం
  7. స్వశక్తి సముదాయాల ద్వారా ముస్లిం స్త్రీలకు పరపతి సౌకర్యాలు విస్తృతం చేయడం
  8. ఉద్యోగాల నియామక కమిటీల్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం
  9. ఈ వర్గం నివసించే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం
  10. వీరు నివసించే ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపడితే సమసమాజ నినాదాన్ని ఆచరించినట్లవుతుంది.
సచార్ కమిటీ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు:
  1. సెకండరీ స్థాయిలో అందరికీ ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (RMSA).
  2. దేశంలో విద్యా పరంగా వెనుకబడిన 374 జిల్లాల్లో ప్రతీ జిల్లాలో ఒక మోడల్ కాలేజ్. విద్యాపరంగా వెనుకబడిన 374 జిల్లాల్లో 67 మైనారిటీలు అత్యధికంగా ఉండే జిల్లాలే.
  3. మైనారిటీలు అందులోనూ ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో బాలికల వసతిగృహాలు ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రాధాన్యత కల్పించడం.
  4. అత్యవసరంగా దృష్టి సారించాల్సిన ప్రాంతం, మదర్సా ఆధునికీకరణ కార్యక్రమా(Area Intensive & Madarsa Modernization Programme)న్ని మార్చి రెండు పథకాలుగా విభజించారు.
    ఎ. మదర్సాలలో ప్రమాణాలతో కూడిన విద్యను అందించే పథకం( Scheme for Providing Quality Education in Madarsas (SPQEM)). ఈ పథకం కింద ఉపాధ్యాయులకు మెరుగైన జీతం, పుస్తకాలు, బోధనా ఉపకరణాలు, కంప్యూటర్ల కోసం అందిస్తున్న సాయం పెంచడం, వృత్తివిద్యా సబ్జెక్టులు (విషయాలు) ప్రవేశపెడుతారు.
    బి. ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడైడ్ మైనారిటీ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకం ( Infrastructure Development of Private aided/unaided Minority Institutes (IDMI)).
  5. ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అభివృద్ధి కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మొదలైన సెంట్రల్ యూనివర్సిటీల్లో బోధనా విభాగాలను ఏర్పాటు చేయడం
బహుళ రంగ అభివృద్ధి కార్యక్రమం:
2008-09లో ప్రభుత్వం బహుళ రంగ అభివృద్ధి కార్యక్రమా(Multi-sectoral Development Programme (MsDP) )న్ని ప్రారంభించింది. మైనారిటీల జీవన ప్రమాణాలు పెంపొందించటానికి, మైనారిటీలు ఎక్కువగా నివసించే జిల్లా (Minority Concentration Districts (MCDs)) ల్లో అసమానతలు తగ్గించడానికి సామాజిక – ఆర్థిక, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. గుర్తించిన అభివృద్ధి లోటుపాట్లను జిల్లా ఆధార ప్రణాళికల ద్వారా పరిష్కరిస్తారు. ఈ ప్రణాళికల్లో పాఠశాల, సెకండరీ విద్య, పారిశుద్ధ్యం, పక్కా గృహాలు ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం నిబంధనలు ఉంటాయి. దీంతోపాటు ఆదాయ కల్పన కార్యక్రమాల కోసం లబ్దిదారుల లక్షిత పథకాలు ఉంటాయి. జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, ఆదాయం సృష్టించే కార్యకలాపాల కోసం రోడ్ల అనుధానం, కనీస వైద్య సదుపాయాలు, ఐసీడీఎస్ కేంద్రాలు, నైపుణ్య అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి ముఖ్యమైన మౌలికవసతులు కల్పన ఈ ప్రణాళికలో భాగం.

భారతదేశ వ్యాప్తంగా మైనారిటీలకు విద్యాపరంగా, సామాజికంగా సాధికారత చేకూర్చేందుకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనేక ఉపకారవేతనాలను(స్కాలర్ షిప్స్) అందజేస్తుంది.

ఉపకారవేతన పథకాలు:
ఎ. ప్రి –మెట్రిక్ ఉపకారవేతన పథకం
బి. పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతన పథకం
సి. మెరిట్ కమ్ మీన్స్ ఉపకారవేతన పథకం
డి. మౌలానా ఆజాద్ నేషనల ఫెలోషిప్
ఇ. ఉచిత శిక్షణ పథకం
ఎఫ్. మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధి పథకం
జి. నేషనల్ మైనారిటీస్ డెవలప్ మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కింద రాష్ట్ర స్థాయి ఏజెన్సీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం
ఈ విధంగా భారత ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అన్నివిధాల కృషిచేస్తుంది.

సచార్ కమిటీ సిఫార్సులు – అమలు తీరు:
సామాజికాభివృద్ధి మండలి రూపొందించిన సామాజికాభివృద్ధి నివేదిక 2012 సచార్ కమిటీ సూచనలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడించింది. ముస్లింలకు ఉద్దేశించిన ప్రయోజనాల్లో అత్యధిక భాగం మెజారిటీ జనాభాకు లేదా ముస్లిమేతర మైనారిటీలకు దారిమళ్లుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

మైనారిటీలకు సంబంధించిన పథకాలపై దృష్టి గాడి తప్పడం, నిధుల లేమి, మైనారిటీలను సంతృప్తిపరచారనే అపవాదులపై భయం మొదలైనవి ప్రభుత్వ హామీలు వైఫల్యానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. ముస్లింల పాఠశాల విద్యను మెరుగుపరిచేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా 4 శాతం మంది మాత్రమే చదువుకుంటున్న మద్రసాల ఆధునీకరణపై దృష్టి పెట్టింది. ఉన్నత విద్య విషయానికొస్తే ముస్లింలను భాగంగా చేసుకునేలా మొత్తం విద్యావ్యవస్థను విస్తరించడానికి బదులు మైనారిటీ విద్యాసంస్థలకు సహాయం అందించడంపైనే దృష్టిసారించింది. ముస్లింల భాగంగా చేసుకునే 25 శాతం ముస్లిం జనాభా ఉన్న 90 జిల్లాలు లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధుల పెంపుదలకు ఉద్దేశించిన బహుళ రంగ అభివృద్ధి పథకం విఫలమైందని నివేదిక వెల్లడించింది. ఈ పథకం ప్రయోజనాలు లక్షిత ప్రాంతాల్లో కేవలం 30 శాతం ముస్లిం జనాభాకు మాత్రమే చేరువయ్యాయని, అంటే నిధులు దారిమళ్లినట్లు స్పష్టమవుతుందని నివేదిక పేర్కొంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ముస్లిమేతర ప్రాంతాలకు దారిమళ్లాయని వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో ముస్లింలు బ్యాంకింగ్ వ్యవస్థకు, రుణ సదుపాయాలకు దూరంగా ఉండిపోయారని సచార్ నివేదిక నిగ్గుతేల్చినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

ఇటువంటి వైఫల్యాలకు మైనారిటీ వ్యవహారాల శాఖదే తప్పని నివేదిక తప్పుబట్టింది. మైనారిటీ శాఖకు సామాజిక నిబద్ధతకానీ, సరైన దృక్పథం లేదని వెల్లడించింది. నివేదిక ప్రకారం నిధులు, వాటి వినియోగం రెండూ సమస్యలే. 11వ ప్రణాళికలో మైనారికటీలకు 6 శాతం నిధులను కేటాయిస్తే, అందులో మైనారిటీ మంత్రిత్వశాఖ వాటా కేవలం 0.79 శాతమే. మైనారిటీ సమస్యలకు ఈ మొత్తం నామమాత్రమే. ఎస్సీ ఎస్టీల్లాగా జనాభాలో ముస్లింల శాతానికి తగిన బడ్జెట్ పరమైన ప్రణాళికలు లేవని నివేదిక స్పష్టం చేసింది.. నిధులు సైతం సక్రమంగా వినియోగించలేదు. 2007-12 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో సగం కూడా సద్వినియోగం చేసుకోలేదు. 12 రాష్ట్రాలు 50 శాతం కంటే తక్కువ నిధులను ఖర్చుచేస్తే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న బీహార్, యూపీ, మహారాష్ట్ర, అసోం రాష్ట్రాలు అత్యల్పంగా 20 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశాయి.

మైనారిటీలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపకారవేతన పథకం పరిమాణం అత్యంత స్వల్పంగా ఉంది. అదేవిధంగా ఈ పథకం అమలుతీరు కూడా దయనీయంగా ఉందని నివేదిక వెల్లడించింది. 2009-10 గణాంకాల ప్రకారం 2.45 కోట్ల మంది ముస్లిం విద్యార్థులు ప్రాథమికోన్నత (Upper Primary) స్థాయిలో నమోదుచేసుకుంటే ప్రభుత్వం కేవలం 2 లక్షల ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్పులను మాత్రమే అందజేసిందని నివేదిక సోదాహరణంగా తెలిపింది. అదేవిధంగా ఉపకారవేతనం కింద చెల్లిస్తున్న మొత్తం రూ.1000 చాలా స్వల్పమేనని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉపకారవేతన పథకంతో పోల్చితే వివక్ష కనిపిస్తోందని నివేదిక తేటతెల్లం చేసింది. ఎస్సీ ఎస్టీలకు ఉపకారవేతనం పొందేందుకు ఆదాయపరిమితి రూ.2 లక్షలు ఉంటే మైనారిటీలకు ఈ పరిమితి రూ.1 లక్ష మాత్రమే ఉండటం వివక్షాపూరితమని స్పష్టం చేసింది.

మైనారిటీలకోసం ముస్లిం పోలీస్‌ అధికారులు
సచార్‌ కమిటీ సిఫార్సుల్లోని కీలకమైంది ముస్లిం పోలీసు అధికారుల నియామకం. మైనారిటీలు అధికంగా నివసించే ప్రాంతాల్లోని ఒక్కో పోలీసు స్టేషన్‌లో కనీసం ఒక్క ముస్లిం పోలీసు అధికారినెైనా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ముస్లిం మైనారిటీల్లో ముందుగా విశ్వాసం కల్పించేందుకు చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సచార్‌ కమిటీ తన నివేదికలో సూచించింది. ఈ క్రమంలో ముస్లిం మైనారిటీలు అధికంగా నివసించే ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కనీసం ఒక్క పోలీసు ఇనస్పెక్టర్‌ లేదా సబ్‌ ఇనస్పెక్టర్‌నైనా నియమించాలని సిఫార్సు చేసింది. ముస్లిం పోలీసు అధికారులను నియమించడం పెద్ద సమస్యేమీ కాబోదని కూడా సచార్‌ కమిటీ అభిప్రాయపడింది. సచార్‌ కమిటీ సిఫార్సుల్లోని కీలకమైన ముస్లిం పోలీసు అధికారుల నియామకానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగేళ్ళ కిందనే హోం మంత్రిత్వ శాఖ సమాచారం పంపించింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ విషయమై నివేదికను హోంమంత్రిత్వ శాఖకు పంపించాలని 2012 డిసెంబర్‌లో మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

విధానపరమై చర్యలు:
విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఈ వర్గానికి రిజర్వేషన్ సదుపాయాలు కల్పించే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వివాదాస్పదమౌతుంది. ఆర్థిక, సామాజిక హోదా ప్రాతిపదికగా రిజర్వేషన్ సదుపాయం కల్పించడం అవసరం. చాలా సందర్భాల్లో కార్యక్రమాల అమల్లో చిత్తశుద్ధి లోపిస్తుంది. ఈ సామాజిక వర్గ ప్రజల చొరవ అవసరం. వక్ఫ్ ఆస్తులను, జకాత్ వనరులను ఈ వర్గ ప్రగతి కోసం వినియోగించాలి. రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టాలి.

ముగింపు:
భారతదేశం త్వరిగగతిన అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాలి. సమతౌల్యత లోపిస్తే అభివృద్ధి దేశ మనుగడకే సవాలుగా పరిణమిస్తుంది. ఈ వర్గాన్ని నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం పీడిస్తున్నాయి. వీటి నుంచి విముక్తి లభించినప్పుడే వారిలో అభద్రతా భావం తొలగిపోతుంది.
Published date : 20 Jan 2014 04:12PM

Photo Stories