Skip to main content

భారతదేశం - పేదరికం తీరుతెన్నులు

పేదరికంపై ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో లెక్కలు చూపుతోంది. ఎప్పటికప్పుడు ప్రాతిపదికలు మారుస్తూ, ఆ సంఖ్యను సవరిస్తోంది. పేదరికం గణనీయంగా తగ్గిందని, మరింత తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ప్రభుత్వం కావాలనే పేదల సంఖ్యను తక్కువచేసి చూపుతోందనేది స్పష్టం. కానీ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందనేది వాస్తవం. తాజాగా ప్రణాళిక సంఘం పేదరికంపై అంచనాలను విడుదల చేసింది.

పేదరికంపై ప్రణాళిక సంఘం అంచనాలు:
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్యం శరవేగంగా కనుమరుగవుతోందని ప్రణాళిక సంఘం ప్రకటించింది. పేదరికంపై సురేశ్ టెండూల్కర్ కమిటీ సూచించిన పద్ధతిని పాటించి దేశంలో 2011-12 నాటికి 21.9 శాతం ప్రజలు మాత్రమే దారిద్ర్యంలో మగ్గుతున్నారని తేల్చి చెప్పింది. జాతీయ నమూనా సర్వే దేశవ్యాప్తంగా నిర్వహించిన 68వ రౌండ్ సర్వే (2011-12) ఫలితాలు 2013 జూన్ నెలలో వెల్లడైన నేపథ్యంలో ప్రణాళిక సంఘం తాజాగా దారిద్ర్య అంచనాలను రాష్ట్రాల వారీగా దారిద్ర్య రేఖల వివరాలను సవరించింది. ప్రణాళిక సంఘం జాతీయ దారిద్ర్య రేఖకు గ్రామీణ ప్రాంతాలకు నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.816గా, పట్టణ ప్రాంతాలకు నెలవారీ తలసరి వ్యయం రూ.1000 గా గణించింది. 1990లో 51 శాతంగా ఉన్న పేదరికం దాదాపు రెండు దశాబ్దాల్లో 21.9 శాతానికి పడిపోవడం విశేషమే. ప్రణాళిక సంఘం గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభాలో 25.7 శాతం, పట్టణ ప్రాంత జనాభాలో 13.7 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. దేశంలో 26.93 కోట్ల మంది మాత్రమే దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వీరిలో 21.65 కోట్ల మంది గ్రామాల్లోనూ, 5.28 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 2004-05లో గ్రామీణ ప్రాంతాల్లో 41.8 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.7 శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. మొత్తానికి 37.2 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు. 2004-05లో 40.71 కోట్ల మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే 2011-12 సంవత్సరానికి 26.93 కోట్ల మంది మాత్రమే దారిద్ర్యరేఖ కింద ఉన్నారు. అంటే ఏడేళ్ల కాలంలో 13.70 కోట్ల మేరకు పేదల సంఖ్య తగ్గింది.

రెండు దశాబ్దాల్లో పేదరికం తీరుతెన్నులు:
1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 50.1 శాతం (32.86 కోట్ల ) మంది పేదరికంలో మగ్గుతుంటే పట్టణ ప్రాంతాల్లో 31.8 శాతం(7.45 కోట్లు) మంది దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం 43.5 శాతం(40.37 కోట్లు) మంది పేదరికంలో ఉన్నారు. 2004-2005 నాటి లెక్కలను అనుసరించి గ్రామాల్లో 41.8 శాతం(32.63 కోట్ల) మంది, పట్టణాల్లో 25.7 శాతం(8.08 కోట్ల) మంది పేదరికంలో మగ్గుతున్నారు. మొత్తం వీరి సంఖ్య 37.2 శాతం(40.71 కోట్లు)గా ఉంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 2009-10 నాటికి 29.8 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం స్థాయి 33.8 శాతానికి పట్టణ ప్రాంతాల్లో 20.9 శాతానికి తగ్గింది. 2011-12 నాటికి పేదరికం స్థాయి మరింత తగ్గింది. ఆ ప్రకారం గ్రామాల్లో పేదరికంలో ఉన్నవారి సంఖ్య 25.7 శాతానికి(21.63 కోట్ల మంది) పట్టణాల్లో పేదరికంలో ఉన్నవారి సంఖ్య 13.7 శాతానికి (5.28 కోట్ల మంది) తగ్గింది. మొత్తం పేదరికంలో ఉన్నవారి సంఖ్య 21.9 శాతం (26.93 కోట్ల మంది) గా ఉంది.

పేదరిక కుదింపులో గ్రామీణ ప్రాంతాలదే అగ్రతాంబూలం:
ప్రణాళిక సంఘం తాజా గణాంకాలను అనుసరించి పేదరికం తగ్గుదల అనేది పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ జనాభా సంఖ్య 2004-05లో 42 శాతం ఉంటే 2011-12 నాటికి ఈ సంఖ్య 25.7 శాతానికి తగ్గింది. అంటే దాదాపు 17 శాతం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గుతున్నవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఈ తగ్గుదల 12 శాతమే. పట్టణ ప్రాంతాల్లో 2004-05లో బీపీఎల్ జనాభా 25.5 శాతంగా ఉంటే 2011-12 నాటికి ఈ సంఖ్య 13.7 శాతానికి తగ్గింది.

మారని బీమారు రాష్ట్రాలు:
బీమారు రాష్ట్రాలుగా పేరుపొందిన కొన్ని పేద రాష్ట్రాలు ఇంకా అదే పరిస్థితిలో కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జనాభాలో 30 శాతం మంది ప్రజలు ఇంకా BPL (Below Poverty Line) పరిధిలోనే ఉన్నారు. అంటే ఆ రాష్ట్రంలో ఆరు కోట్ల మందికి పైగా ప్రజలు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. బీహార్ రాష్ట్రం విషయంలో గడిచిన ఏడేళ్లలో చెప్పుకోదగిన మెరుగుదల సాధించినప్పటికీ ఇంకా ఆ రాష్ట్రంలో 3.58 కోట్ల మంది ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానంలో బీహార్ నిలిచింది. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సైతం 2.34 కోట్ల మంది లేదా 31.6 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. బీమారు రాష్ట్రాలుగా పేరుపొందిన వాటిలో ఒక్క రాజస్థాన్ లో 14.7 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. 2004-05లో ఈ సంఖ్య 34.4శాతంగా ఉండడం గమనార్హం. వాస్తవానికి రాజస్థాన్ రాష్ట్రం ప్రస్తుతం గుజరాత్ కంటే కూడా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి దిశలో ఈ రాష్ట్రం సాగుతోంది. అదే సమయంలో చక్కని మౌలిక సదుపాయాల నెలవుగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 16.6 శాతంగా ఉండటం గమనార్హం.

పేదరికం తగ్గింపులో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు:
మిగతా రాష్ట్రాలతో పోల్చితే చత్తీస్ గఢ్, జార్ఖంఢ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు పేదరికం తగ్గింపులో అత్యంత వెనుకబడి ఉన్నాయి. 2004-05 నాటికి చత్తీస్ గఢ్ ,జార్ఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పేదరికం వరుసగా 49.4%, 45.3%, 37.9%, 31.4%, 54.4% గా ఉంటే 2011-12 నాటికి ఈ రాష్ట్రాల్లో పేదరిక శాతాలు వరుసగా 39.93%, 36.96%, 36.89%, 34.67%, 34.67% గా ఉన్నాయి. అంటే జాతీయ సగటు పేదరికం 21.9 శాతంతో పోల్చితే ఈ ఐదు రాష్ట్రాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్పష్టమవుతుంది.

పేదరికం తగ్గింపులో అత్యంత మెరుగైన రాష్ట్రాలు:
దేశంలో మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే గోవా, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరిలు పేదరికం తగ్గింపులో అత్యంత మెరుగైన ఫలితాలను ప్రదర్శించాయి. 2004-05 నాటికి గోవా, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరిలలో పేదరికం వరుసగా 24.9%, 19.6%, 22.9%, 20.9%, 14.2% గా ఉంటే 2011-12 నాటికి ఈ రాష్ట్రాల్లో పేదరికం 5.09%, 7.05%, 8.06%, 8.26%, 9.69% గా ఉన్నాయి. అంటే జాతీయ సగటు కంటే అత్యంత మెరుగైన ఫలితాలు సాధించాయి.

ఆంధ్రప్రదేశ్ పేదరికం:
పేదరికాన్ని తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చెప్పుకోదగిన పురోగతిని సాధించిందని చెప్పేందుకు ప్రణాళిక సంఘం గణాంకాలే నిదర్శనం. ఆంధ్రప్రదేశలో దారిద్ర్యరేఖకు గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి తలసరి వ్యయం రూ.860, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వ్యయం రూ.1,009గా ప్రణాళిక సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం నిష్పత్తి 9.20 శాతంగా ఉంది. మొత్తం రాష్ట్రంలో 78.78 లక్షల మంది పేదలున్నట్లు ప్రణాళిక సంఘం తెలిపింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో 61.80 లక్షలు పట్టణ ప్రాంతాల్లో 16.98 లక్షల మంది నివసిస్తున్నారు. శాతాల్లో పరిగణనలోకి తీసుకుంటే గ్రామాల్లో 10.96 శాతం, పట్టణాల్లో 5.81 శాతంగా నమోదైంది. 2009-10, 2011-12 మధ్యకాలంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 21.1 శాతం నుంచి 9.37 శాతానికి తగ్గింది. 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో పేదరికం తగ్గుదల జాతీయ సగటు 15 శాతానికి పైగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 20 శాతానికి పైగా తగ్గుదల నమోదు కావడం విశేషం. గడిచిన రెండు దశాబ్దాల్లో రాష్ట్రంలో పేదరికం చెప్పుకోదగిన స్థాయిలో 35 శాతం వరకు తగ్గిపోయింది. ఈ విషయంలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో నిలవడం గమనార్హం. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు పేదరికంలో చెప్పుకోదగిన తగ్గింపును సాధించడానికి ఏడేళ్లు పడితే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే ఈ స్థాయికి చేరింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కేవలం మూడు దశాబ్దాల కాలంలో ఇంతటి స్థాయిలో ప్రజలను పేదరికం నుంచి బయట పడలేదు. ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ విజయానికి కారణాలేమిటి అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాలతో పాటు వ్యవసాయంలో చోటు చేసుకున్న వృద్ధి కారణమని భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు మెరుగైన కనీస వేతనాలు అమలవుతున్నాయి. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధరల్లో పెరుగుదల చోటు చేసుకోవడం రైతులు వ్యవసాయంతో పాటు డెయిరీ రంగంపైనా దృష్టిపెట్టడం ఇందుకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఆదాయంలో పెరుగుదల ఏర్పడి పేదరికం తగ్గడానికి దోహదపడినట్టు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

పేదరికం తగ్గుదలపై ప్రణాళిక సంఘం విశ్లేషణ:
దేశంలో 2015 నాటికి పేదరికం 22 శాతానికి తగ్గుతుందని ప్రణాళిక సంఘం అంచనా వేసింది. గడిచిన 11 ఏళ్లల్లో దేశంలో పేదరికం శాతం ఏటా 0.74 శాతం చొప్పున తగ్గుతూ వస్తోంది. 2004-05 నుంచి ఏటా పేదరికం తగ్గుదల 2.18 శాతం వేగంతో సాగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం చేపట్టిన అనంతరం గ్రామీణ కుటుంబాల తలసరి వ్యయం పెరిగినట్టు తాజా గణాంకాల్లో తేలింది. పేదరికం తగ్గడానికి ఇది కారణమైనట్టు తేల్చింది. 1993 -94 నుంచి 2004 -05 మధ్య కాలంతో పోలిస్తే 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో నెలవారీ తలసరి వినియోగ వ్యయం భారీగా పెరిగింది. ఈ పెరుగుదల సమాజంలోని జనాభా అంతటికీ సమానంగా పంపిణీ జరిగినట్టు ప్రణాళిక సంఘం విశ్లేషించింది. 2011-12 నాటికి అఖిల భారత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 21.7 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 5.3 కోట్లుగా ఉంది. 2004-05లో గ్రామీణ ప్రాంతాల్లో 32.6 కోట్ల మంది, పట్టణ ప్రాంతాల్లో 8.1 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.

టెండూల్కర్ కమిటీయే ప్రాతిపదక:
దారిద్ర్య రేఖ నిర్ధారణకు సురేశ్ టెండూల్కర్ కమిటీ విద్య, ఆరోగ్యం కోసం వెచ్చించే వ్యయంతో పాటు ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటారో ప్రాతిపదికగా తీసుకుంది. ఈ కమిటీ రూపొందించిన విధానాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తి రోజుకు రూ.27.20, పట్టణ ప్రాంతాల్లోఉన్న వ్యక్తి రూ.33.33 ఖర్చుచేస్తే దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్టు గుర్తిస్తారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబం గ్రామీణ ప్రాంతాల్లో తమ నెలవారీ ఖర్చుల కోసం రూ.4,080, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.5000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వారిని దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నట్లు పరిగణిస్తారు. టెండూల్కర్ కమిటీ పద్ధతి ప్రకారం దేశవ్యాప్తంగా నెలవారీ సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.816 ఉంటే, పట్టణ ప్రాంతాల్లో రూ.1000 ఉంది. నెలవారీ సగటు రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా రూ.860, రూ.1009గా ఉంది. తమిళనాడులో రూ. 880, రూ.937 , కర్నాటకలో రూ.902, రూ.1089, కేరళలో రూ.1018, రూ.987, మహారాష్ట్ర రూ.967, రూ.1126, ఢిల్లీలో రూ.1145, రూ.1134, పుదుచ్చేరిలో రూ.1301, రూ.1309, చత్తీస్ గఢ్ లో రూ.738, రూ.849గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగటు నెలవారీ తలసరి వ్యయం గ్రామాల్లో రూ.1287.17 గా ఉంటే పట్టణాల్లో రూ.2477.02గా తేలింది. టెండూల్కర్ కమిటీ దేశంలో 37 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్టు తేల్చింది. ఈ నివేదికను గతంలో ప్రణాళిక సంఘం సైతం ఆమోదించింది.

ప్రణాళిక సంఘం నివేదికపై విమర్శలు:
దేశంలో పేదరికం శాతం తగ్గిపోయిందని ప్రణాళికా సంఘం విడుదల చేసిన నివేదికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2004-05తో పోల్చుతూ 2011-12 లో పేదరికం తగ్గిందని ప్రణాళిక సంఘం విశ్లేషించింది. కానీ దీనిని 2012-13తో పోల్చితే తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పేదల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నిర్ధారణ అవుతుంది. కాబట్టి ప్రణాళిక సంఘం అంచనా లోపభూయిష్టం అని స్పష్టమవుతుంది. దారిద్ర్య రేఖపై సురేష్ టెండూల్కర్ కమిటీ విధానాల ప్రకారం పేదరికం శాతాన్ని లెక్కించారు. దీని ప్రకారం గ్రామాల్లో నెలసరి తలసరి ఖర్చు రూ.816, పట్టణాల్లోనైతే రూ.1000 దాటితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్టు లెక్క. ఈ పద్ధతిపై గతంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా దీన్నే మళ్లీ ప్రామాణికంగా తీసుకొని లెక్కించడం సబబు కాదు. దారిద్ర్య రేఖను లాక్డావాలా కమిటీ ప్రకారం లెక్కించాలని కోరినా ప్రణాళికా సంఘం పట్టించుకోకపోవడం శోచనీయం. ప్రపంచంలోని మొత్తం పేదల్లో మూడో వంతు మంది భారత్ లోనే ఉన్నారని గతంలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దేశంలో 41.6 శాతం మంది ప్రజల సగటు దినసరి ఆదాయం పట్టణాల్లో అయితే రూ.21.6 , గ్రామాల్లో రూ.14.3 అని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్ లో 70 శాతం జనాభా రెండు డాలర్లు కంటే తక్కువ వ్యయంతో జీవిస్తున్నారు. దీనినే పేదరికానికి కీలక ఆధారంగా తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. కానీ ప్రణాళిక సంఘం మాత్రం సురేశ్ టెండూల్కర్ కమిటీ చెప్పినట్టుగా గ్రామీణులు రోజుకు రూ.27.20, పట్టణవాసులు రూ.33.33 ఖర్చుచేస్తే పేదరికం నుంచి బయటపడినట్లుగా పేదల సంఖ్యను లెక్కించడం సరైన పద్ధతి కాదు. అర్జున్ సేన్ గుప్తా నివేదిక ప్రకారం దేశంలోని 77 శాతం మంది రోజుకు 20 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవితం గడుపుతున్నారు. మరోవైపు ఎన్.సి. సక్సేనా నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది భారతీయులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ఆక్స్ ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ సొసైటీ భారతదేశంలో పేదరికంపై బహుళ కోణ పేదరిక సూచీ సాయంతో అధ్యయనం చేసి 64.50 కోట్ల మంది భారతీయులు పేదలేనని తేల్చింది. ఇందులో 42 కోట్ల మంది ఎనిమిది ఉత్తర, తూర్పు భారతీయ రాష్ట్రాల్లో జీవిస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద సంఖ్య. 26 నిరుపేద ఆఫ్రికా దేశాల్లో కూడా పేదల సంఖ్య 41 కోట్లు దాటలేదు. అయితే ఈ నివేదికల సారాంశాన్ని ప్రణాళిక సంఘం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం అశాస్త్రీయమైనదిగా విమర్శలు ఎదుర్కొన్న సురేశ్ టెండూల్కర్ కమిటీ లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని తాజా గణాంకాలను వెల్లడించడం సరికాదు.

Published date : 08 Oct 2013 03:55PM

Photo Stories