Skip to main content

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే-2016

అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతంలో అనుకూలమైన రాజకీయ, సాంఘిక, ఆర్థిక వాతావరణాన్ని నెలకొల్పి.. పెట్టుబడి, వృద్ధి, మానవాభివృద్ధిని నెలకొల్పడం సవాలుగా చెప్పొచ్చు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం గత 23 నెలలుగా అభిలషణీయ విధానాల రూపకల్పన ద్వారా కృషి చేస్తోంది. ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు స్థిర ధరల వద్ద 9.2 శాతం కాగా, భారతదేశ సగటు వృద్ధి 7.6 శాతం మాత్రమే. 1993-94లో రాష్ట్రంలో పేదరికం 44.2 శాతం కాగా, 2011-12లో 8.8 శాతానికి తగ్గింది. పేదరిక రేటు తగ్గింపులో రాష్ట్రం విజయవంతమైనప్పటికీ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల్లో పేదరికం కేంద్రీకృతం కావడాన్ని గమనించవచ్చు. లింగ సంబంధిత అసమానతల తొలగింపు, శిశు మరణాలు, సురక్షితమైన తాగునీరు, మలేరియా, ఇతర వ్యాధుల వంటి విషయాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది.
జనాభా పరమైన లక్షణాలు:
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. రాష్ట్ర జనాభాలో 61.12 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనూ, 38.88 శాతం పట్టణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో పురుషులు- మహిళల నిష్పత్తి 1000:988. 2001 నుంచి 2011 మధ్యకాలంలో జనాభా వృద్ధిరేటు రాష్ట్రంలో 13.58 శాతం కాగా, జాతీయ వృద్ధి 17.7 శాతం. పట్టణ ప్రాంతాల్లో జనాభా వృద్ధిరేటు అధికంగా ఉన్నందువల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలో వేగవంతమైన పట్టణీకరణ (Fastest urbanising state) చెందిన రాష్ట్రంగా అవతరించింది. 2001-11 మధ్యకాలంలో రాష్ట్రంలో పట్టణ జనాభా వృద్ధి 38.12 శాతం కాగా, గ్రామీణ జనాభా వృద్ధి 2.13 శాతం మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం పట్టణ జనాభాలో 30 శాతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.

తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)
ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ 2011-12లో రూ.3,61,701 కోట్ల నుంచి 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం రూ.5,83,117 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద 2015-16లో జీఎస్‌డీపీ వృద్ధి 11.7 శాతం. స్థిర ధరల వద్ద (2011-12) 2012-13లో జీఎస్‌డీపీ రూ.3,70,432 కోట్ల నుంచి 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం రూ.4,68,656 కోట్లకు పెరిగింది. 2015-16లో స్థిర ధరల వద్ద జీఎస్‌డీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది. 2015-16లో భారతదేశంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వాటా 4.1 శాతం.
  • స్థిర ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వివిధ రంగాల వాటాను పరిశీలించినప్పుడు 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం ప్రాథమిక రంగం వాటా 17 శాతం కాగా, ద్వితీయ రంగం వాటా 22.5 శాతం, తృతీయ రంగం వాటా 60.5 శాతం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక మార్పులతో పాటు ఉపాధి ప్రక్రియలోనూ మార్పులను గమనించవచ్చు. వివిధ రంగాల ఉత్పత్తిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రంగాల మధ్య ఉపాధి బదిలీలో వేగవంతంగా మార్పు సంభవించలేదు.

తలసరి ఆదాయం
ప్రస్తుత ధరల వద్ద 2014-15లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,29,182. తలసరి ఆదాయాన్ని జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ జిల్లాలో అధిక తలసరి ఆదాయం నమోదైంది. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలు నిలిచాయి. ఆదిలాబాద్‌లో అత్యల్ప తలసరి ఆదాయం నమోదైంది. హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.2,94,220 కాగా, ఆదిలాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.76,921.

వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు
2015-16లో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రుణాత్మక వృద్ధి నమోదు కావడానికి వ్యవసాయ పంటల వృద్ధిలో క్షీణత అధికంగా ఉండటం కారణం. గత రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నందువల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల కింద ఉన్న విస్తీర్ణం 2014-15లో 26.13 లక్షల హెక్టార్లు కాగా, అది 2015-16లో 20.46 లక్షల హెక్టార్లకు తగ్గింది. రాష్ట్రంలోని భూకమతాల ప్రక్రియను పరిశీలించినప్పుడు సంఖ్యా పరంగా మొత్తం కమతాల్లో ఉపాంత, చిన్న కమతాలు 86 శాతం కాగా, మొత్తం విస్తీర్ణంలో వీటి వాటా 55 శాతం. సంఖ్యా పరంగా మొత్తం కమతాల్లో మధ్యస్థ కమతాల వాటా 14 శాతం కాగా, మొత్తం విస్తీర్ణంలో ఈ కమతాల విస్తీర్ణం 40.5 శాతం. సగటు కమతపు పరిమాణం హెక్టారు కంటే తక్కువగా ఉన్న జిల్లాలుగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నిలిచాయి.
  • 2013-14లో స్థూల సాగునీటి విస్తీర్ణం 31.54 లక్షల హెక్టార్లు కాగా, 2014-15లో 25.29 లక్షల హెక్టార్లకు తగ్గింది. 2013-14తో పోల్చినపుడు 2014-15లో స్థూల సాగునీటి విస్తీర్ణంలో తగ్గుదల 19.82 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి నికర సాగు నీటి విస్తీర్ణం 22.80 లక్షల హెక్టార్ల నుంచి 17.26 లక్షల హెక్టార్లకు తగ్గింది. 2013-14తో పోల్చినపుడు 2014-15లో నీటి పారుదల గల నికర విస్తీర్ణంలో తగ్గుదల 24.30 శాతం.
  • రాష్ట్రంలోని పంటల తీరును పరిశీలించినప్పుడు ఆహార పంటల కింద ఉన్న విస్తీర్ణం తగ్గుతూ, ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతోంది. 2001-02లో రాష్ట్రంలోని మొత్తం పంట విస్తీర్ణంలో 71 శాతం విస్తీర్ణం ఆహార పంటల కింద ఉండగా, 29 శాతం ఆహారేతర పంటల కింద ఉంది. 2014-15లో మొత్తం పంట విస్తీర్ణంలో ఆహార పంటల కింద ఉన్న విస్తీర్ణం 58 శాతానికి తగ్గి, ఆహారేతర పంటల విస్తీర్ణం 42 శాతానికి పెరిగింది.
  • కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు నీటి పారుదల ముఖ్యమైన సాధనం. నీటి పారుదల సౌకర్యం పెంపునకు ప్రభుత్వం రెండు ముఖ్యమైన చర్యలు చేపట్టింది. అవి.. 1) మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ప్రస్తుతం ఉన్న చెరువుల పూర్తిసామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా వాటి పునరుద్ధరణ. 2) ముఖ్య నదుల నుంచి తెలంగాణ రాష్ట్రం తన వాటా నీటిని వినియోగించుకోవడం ద్వారా భారీ నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం.
  • మిషన్ కాకతీయ కార్యక్రమం కింద దశల వారీగా 45,000 జల వనరుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం కింద 8,200 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం కాగా, 6000కు పైగా చెరువుల్లో పని పూర్తయింది. రెండో దశలో 9,000 చెరువుల్లో పనులు చేపడతారు. రాష్ట్రంలో ఉద్యానవన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, గ్రీన్‌హౌజ్/పాలీహౌజ్‌ల ఏర్పాటు, మిషన్‌ఫర్ ఇంటెగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, పండ్లు, పూలు, కూరగాయల పంటలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు, అర్బన్ ఫార్మింగ్ వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

పారిశ్రామిక రంగం
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒడిదుడుకులు పెరిగాయి. పారిశ్రామిక రంగ స్థూల కలిపిన విలువలో తయారీ రంగం వాటా 55 శాతంగా ఉన్నందువల్ల తయారీ రంగంలో వృద్ధి పారిశ్రామిక రంగంపై అధిక ప్రభావం చూపుతోంది. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగం ప్రస్తుత ధరల వద్ద 8.4 శాతం, స్థిర ధరల వద్ద (2011-12) 8.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని అంచనా. స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగంలో 2012-13లో రుణాత్మక వృద్ధి నమోదుకాగా, తదుపరి కాలంలో ధనాత్మక వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో 2008-09లో 7357 ఫ్యాక్టరీలు ఉండగా, వీటి సంఖ్య 2012-13లో 10,279 కి పెరిగింది.

సంఖ్యాపరంగా ఫ్యాక్టరీలు రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉండగా, తర్వాతి స్థానంలో మెదక్ జిల్లా ఉంది. ఆదిలాబాద్‌లో తక్కువ సంఖ్యలో(285) ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫ్యాక్టరీ రంగంలో ఉపాధి పరంగా నిజామాబాద్ జిల్లా తొలి స్థానంలో ఉండగా, ఖమ్మం జిల్లా చివరి స్థానంలో ఉంది. స్థూల కలుపబడిన విలువ పరంగా రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, ఖమ్మం జిల్లా ఆఖరి స్థానంలో ఉన్నాయి. ఫ్యాక్టరీ రంగంలో స్థూల స్థిర మూలధన కల్పన విషయంలో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో, నిజామాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి.

2014-15 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 5787 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఉన్నాయి. వీటిలో 61 శాతం సూక్ష్మ సంస్థలు కాగా, 39 శాతం చిన్న సంస్థలు, 0.4 శాతం మధ్యతరహా సంస్థలు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో 64,604 మంది ఉపాధి పొందారు.

సేవారంగం
రాష్ట్రంలో సేవారంగంలోని ముఖ్య ఉపరంగాలు రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు. సేవారంగ స్థూల కలుపబడిన విలువలో రియల్ ఎస్టేట్, నివాస స్థల యాజమాన్యం, వృత్తి పరమైన సేవల వాటా 1/3వ వంతుగా ఉంది. వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, ఇతర సేవలు 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 1300 ఐటీ యూనిట్లు ఉన్నాయి. 2014-15లో 89 నూతన యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం ఐటీ యూనిట్లలో 3,71,774 మంది ఉపాధి పొందుతున్నారు. ఐటీ ఎగుమతుల ఆదాయం రూ. 68,258 కోట్లుగా నమోదైంది. జూలై 1, 2015న డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్వదేశీ, విదేశీ పర్యాటకులకు తెలంగాణ ముఖ్య పర్యాటక కేంద్రంగా రూపొందింది. వైద్య, వ్యాపార పర్యాటకానికి హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో పర్యటించిన స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యింది. 2005లో 3.26 కోట్ల మంది పర్యాటకులు తెలంగాణలో పర్యటించగా, 2015 చివరి నాటికి ఆ సంఖ్య 9.46 కోట్లకు పెరిగింది. స్వదేశీ పర్యాటకులకు కరీంనగర్ జిల్లా అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది. తర్వాతి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉంది. విదేశీ పర్యాటకులకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ముఖ్య కేంద్రాలుగా నిలిచాయి. 2015లో తెలంగాణలో పర్యటించిన 1.26 లక్షల విదేశీ పర్యాటకుల్లో 1.22 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను సందర్శించారు.

మానవాభివృద్ధి సూచీ - అంచనా - 2015-16
2004-05, 2011-12 మధ్య కాలంలో రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచీలో సగటు వార్షిక వృద్ధి 8.3 శాతం. ఇదే కాలంలో నిజామాబాద్, ఖమ్మం జిల్లాల మానవాభివృద్ధి సూచీ విలువలో 12 శాతం వృద్ధి నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు 9 నుంచి 11 శాతం మధ్య వృద్ధి సాధించాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల వృద్ధి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. 2015లో సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోష్టల్ స్టడీస్ రూపొందించిన నివేదిక ప్రకారం 2015-16లో తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి సూచీ విలువ 0.663. 2015-16 అంచనాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తొలి మూడు స్థానాలను పొందాయి. మహబూబ్‌నగర్ జిల్లా తొమ్మిదో స్థానంలో, మెదక్ జిల్లా పదో స్థానంలో నిలిచాయి.

స్థిర ధరల వద్ద జిల్లాల స్థూల దేశీయోత్పత్తి (రూ. లక్షల్లో)

జిల్లా

2012-13

2013-14

2014-15

 

(ఎస్‌ఆర్‌ఈ)

(ఎస్‌ఆర్‌ఈ)

(ఎఫ్‌ఆర్‌ఈ)

ఆదిలాబాద్

16,73,738

17,06,142

19,63,209

నిజామాబాద్

15,35,530

17,11,286

17,79,631

కరీంనగర్

27,92,663

30,48,353

31,06,016

మెదక్

35,88,203

36,25,428

37,31,764

హైదరాబాద్

89,44,205

94,88,757

1,03,38,652

రంగారెడ్డి

83,15,306

89,38,550

1,00,55,204

మహబూబ్‌నగర్

27,02,053

27,38,124

29,80,750

నల్లగొండ

31,34,859

34,06,309

37,41,000

వరంగల్

22,06,665

23,99,025

25,65,953

ఖమ్మం

21,49,970

23,62,799

26,37,897

జీఎస్‌డీపీ

3,70,43,192

3,94,24,774

4,29,000,75

ఆధారం: డెరైక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్, తెలంగాణ, హైదరాబాద్.
Published date : 08 Apr 2016 04:11PM

Photo Stories