Skip to main content

ప్రగతి దిశగా జన్‌ధన్ యోజన...

2015, జనవరి 26 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల సదుపాయం... కుటుంబానికి రెండు ఖాతాలు చొప్పున మొత్తం 15 కోట్ల ఖాతాలు... వీటితోపాటు రూపే డెబిట్ కార్డుల జారీ... దీని ఆధారంగా రూ.లక్ష వరకు ప్రమాద బీమా సౌకర్యం.. ఇవీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించినప్పటి లక్ష్యాలు. దేశాన్ని నెమ్మదిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశలో నడిపేందుకు నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవటంలో ప్రభుత్వం ఏ మేరకు పురోగతి సాధించింది?
2014, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ప్రధానమంత్రి జన్ ధన్‌యోజన’ పేరుతో ఆర్థిక సంఘటిత పథకం ప్రకటించారు. ఆ తర్వాత రెండు వారాల్లోపే కార్యాచరణకు ఉపక్రమిస్తూ ఆగస్టు 28న న్యూఢిల్లీలో పథకం ప్రారంభించారు. తొలిరోజే రికార్డు స్థాయిలో 1.5 కోట్ల ఖాతాలు తెరిచారు.

పథకం ప్రారంభమైనప్పటి లక్ష్యాలు
  1. బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల కుటుంబాలకు ఖాతాలు తెరవడం.
  2. రూపే డెబిట్ కార్డు జారీ
  3. రూ.5000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ (బదిలీ సౌకర్యం)
  4. రూ.లక్ష ప్రమాద బీమా, రూ.30 వేలు జీవిత బీమా

అనూహ్య స్పందన
ఖాతాలు తెరిచేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఇంతటి అనూహ్య స్పందనకు కారణాలున్నాయి. ప్రభుత్వం అందించే రాయితీ పథకాలన్నీ బ్యాంక్ ఖాతాల ద్వారానే లభిస్తాయి. ఖాతాను తెరిచేందుకు పైసా పెట్టుబడి అవసరం లేదు. ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. వాస్తవానికి ఈ ఖాతాలు తెరవడం ద్వారా జీవితబీమా సౌకర్యం మాత్రమే లభిస్తుంది.

పథకం వెనక ఉద్దేశం
ప్రపంచ వ్యాప్తంగా నగదు చలామణీ అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీని వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. నోట్ల ముద్రణ, భద్రత వంటి సమస్యలకు తోడు సమాజంలో ఎన్నో రుగ్మతలకు అధిక నోట్ల చలామణీ కారణమవుతోంది. నగదు చలామణీ తగ్గించి, అన్ని లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారా పారదర్శకంగా నిర్వహించాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతం కావాలి. దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతా ఉండటమే దీనికి సరైన మందు. అందుకే ఈ పథకాన్ని ప్రారంభించారు.

సగం మందికి ఖాతాల్లేవు
పథకం ప్రారంభమైనప్పటికి దేశంలో 58.7 శాతం కుటుంబాలు మాత్రమే బ్యాంకింగ్ సౌకర్యాలు పొందుతున్నాయి. జన్‌ధన్ యోజన పథకం ద్వారా మిగిలిన 41 శాతం మందిని ఆర్థికంగా సంఘటితం చేయాలని, 2013లో రిజర్వ్‌బ్యాంక్ నియమించిన నచికేత్ మోర్ (Nachiket Mor) కమిటీ ఈ మేరకు సూచనలు చేసింది. అంతకుముందు 2008లో నియమించిన రంగరాజన్ కమిటీ నివేదిక ఆర్థిక సంఘటిత ఆవశ్యకతను ప్రస్తావించింది. ఈ కమిటీ సేకరించిన గణాంకాల ప్రకారం 256 జిల్లాల్లో 95 శాతం వయోజనులకు బ్యాంక్ ఖాతా సౌకర్యం అందుబాటులో లేదు. ఆర్థిక సంఘటితంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అవి.. బ్యాంకు ఖాతాలు, పరపతి సౌకర్యం. ఇందులో మొదటి అంశం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకానికి ఉద్దేశించింది. రెండో అంశం ఏమేరకు ఈ పథకం ఆచరణాత్మకమవుతుందనేదే ప్రశ్నార్థకం. దీనికితోడు బ్యాంకు ఖాతా తెరిచిన వారందరికీ జీవిత బీమా సౌకర్యం లభించదు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రెండు నుంచి మూడు కోట్ల ఖాతాదారులకు మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఎందుకంటే 18 - 59 ఏళ్ల వారికే జీవిత బీమా లభిస్తుంది. జీవిత బీమా కేవలం ఆధార్ సంఖ్యకు అనుసంధానమైతేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ రెండు షరతులతో నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం వర్తించదు.

సక్రమ అమలుకు సందేహాలెన్నో
పథకం ప్రారంభించిన తర్వాత దీని అమలుపై కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అవి..
  • బ్యాంకు ఖాతాలన్నింటిలో క్రమబద్ధంగా లావాదేవీలు జరుగుతున్నాయా?
  • ఖాతాదారులకు కల్పించే రుణ సౌకర్యానికి డబ్బు ఎలా వస్తుంది?
  • జీవిత బీమా పథకాన్ని ఖాతాదారులందరికీ ఎలా వర్తింపజేయాలి?
  • ఖాతాలు తెరవడానికి, వాటి నిర్వహణకు అయ్యే అదనపు వ్యయాన్ని బ్యాంకులు భరించే స్థితిలో ఉన్నాయా?
  • ఈ అదనపు భారాన్ని కేంద్రం భరిస్తుంది. కానీ దాని ప్రభావం మిగిలిన సంక్షేమ పథకాల మీద పడుతుందా?
అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించి, పథకం అమల్లో కొంత పురోగతి కనిపించింది.

పథకం మంచిదే
జన్‌ధన్‌యోజన అమలుతో బ్యాంకులపై ఆర్థిక భారం పడదని ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఎందుకంటే..
  • ఖాతాల ద్వారా బ్యాంకులకు కరెంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్‌ల రూపంలో తగినన్ని వనరులు సమకూరుతాయి.
  • పథకం అమలుతో కల్పించే మౌలిక సదుపాయాల వలన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో నగదు జమ అవుతుంది. దీంతో సర్కారు అందించే ఆర్థిక సాయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.
  • రూపే డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation Of India)కు కొంత ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని ప్రమాదబీమా పథకం అమలుకు వినియోగించవచ్చు.
  • రూపే డెబిట్ కార్డులు విస్తృతంగా వాడుకలోకి వచ్చి వాటిని అన్ని బ్యాంకుల ఏటీఎంలు, దుకాణాలలో వాడటానికి వీలైతే ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు బ్యాంక్ కరస్పాండెంట్‌లపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. విస్తృత వాడకం వల్ల వినియోగ ఫీజు తగ్గుతుంది.
  • బహుళ జాతిసంస్థలు జారీచేసే వీసా, మాస్టర్ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతర్జాతీయ కార్డుల వాడకం మన ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తాయి.
  • కనీసం ఆరునెలలపాటు ఖాతాను విజయవంతంగా నిర్వహించిన వారికే రుణ సౌకర్యం ఖాతా అందుతుంది. ఇది బ్యాంకుల మీద ఎలాంటి భారం మోపదు. బీమా పథకం బ్యాంకులు ఇచ్చిన రుణాలకు హామీని ఇస్తుంది.

బ్యాంకుల జాతీయీకరణ
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసింది. 1980లో మరికొన్నింటిని జాతీయం చేశారు. అప్పుడు ఈ చర్యను చాలా మంది విమర్శించారు. కానీ, బ్యాంకుల జాతీయీకరణ నేడు సగటు పౌరునికి ఎంతో ఉపయోగపడుతుంది. 1968-69లో 12 శాతంగా ఉన్న సగటు పౌరుని పొదుపు రేటు 1979-80 నాటికి 20 శాతానికి పెరిగింది. పెట్టుబడుల శాతం 13 నుంచి 21 శాతానికి చేరింది. 1970లో కేవలం 3.5 శాతానికి పరిమితమైన పెరుగుదల 1980 నాటికి 5.5 శాతం నమోదైంది. బ్యాంకుల జాతీయీకరణ అనే ఆర్థిక సంఘటితం ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను పటిష్ట పరిచింది. ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కూడా అలాంటిదే.

ఆ వైఖరే లాభించింది...
వాస్తవానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం 2013-14 లోనూ 6.1 కోట్ల ఖాతాలు తెరిచింది. కానీ, దానివల్ల ఒరిగింది నామమాత్రం. బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమంటే కేవలం బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వడమే కాదు. దాని ద్వారా కొన్ని ప్రయోజనాలూ కల్పించాలి. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే దాన్ని అమలుచేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి, అంకితభావం అవసరం. వీటితోపాటు అమలును పర్యవేక్షించే సరైన రాజకీయ నాయకత్వంలో ధృడ సంకల్పం అవసరం. వీటన్నింటికీ మించి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కొంత మేర జనాదరణ చూరగొంది. తమకు మంచి జరుగుతుందనే బలమైన న మ్మకం ప్రజల్లో ఉంది. ఆ వైఖరే జన్ ధన్ యోజనను సరైన మార్గంలో నడిచేలా చేస్తుంది.

లక్ష్యాలను అధిగమించి ముందుకు..
జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించి ఏడాది పూర్తయింది. గణాంక ప్రాతిపదికన విశ్లేషిస్తే నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించింది. ఇది శుభదాయకం. 2015, అక్టోబరు 28 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 11.58 కోట్ల ఖాతాలు, పట్టణ ప్రాంతాల్లో 7.45 కోట్ల ఖాతాలు (మొత్తం 19.03 కోట్లు) తెరిచారు. రూపే కార్డులు 16.38 కోట్లు జారీ అయ్యాయి. మొత్తం ఖాతాల్లో జమ అయిన డబ్బు 25913.56 కోట్లు. అయితే 37.54 శాతం ఖాతాలు జీరో బ్యాలెన్స్‌తో ఉన్నాయి.

భారతీయ స్టేట్‌బ్యాంకు ప్రధాన ఆర్థిక సలహాదారులు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆచార్యులు పథకం అమలుపై సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా లభించిన వివరాల ప్రకారం... దేశంలోని అన్ని ప్రాంతాల్లో స్టేట్‌బ్యాంకులో తెరిచిన ఖాతాలు గణనీయంగా పెరిగాయి. నెలలో కనీసం ఒక్కసారైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగిన ఖాతాలు 25 రెట్లు పెరిగాయి. అదే విధంగా నిరర్ధకం (In active)గా ఉన్న ఖాతాల సంఖ్య పది రెట్లు పెరిగాయి. రెండు కంటే ఎక్కువ సార్లు లావాదేవీలు జరిపిన ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో 16 శాతం పెరిగాయి. ఖాతాల్లో సగటు నిల్వ రూ.250 నుంచి రూ.2000కు పెరిగింది. పశ్చిప్రాంతంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సగటు నిల్వ రూ.3,000 వరకు పెరిగింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారు, కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ ఖాతాల్లో ఎక్కువగా జమ చేయటం ప్రారంభించారు. వీరు దూరంగా ఉన్న తమ కుటుంబాలకు తేలిగ్గా డబ్బు పంపించేందుకు పథకం తోడ్పడుతుంది. ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కాని పేదలకు పథకం మంచి అవకాశం కలిగించింది. మరో శుభపరిణామం ఏంటంటే మహిళల ఖాతాల్లో లావాదేవీలు పెరిగాయి. జీవనోపాధి కోసం వలస వెళ్లిన పురుషులు కుటుంబ ఖర్చుల కోసం గృహిణులకు డబ్బు పంపిస్తున్నారు. ఇది పరోక్షంగా మహిళా సాధికారతకు దోహదం చేస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టికి దోహదం చేస్తోంది. జామ్ (JAM) జన్‌ధన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అననుసంధానమైనప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ధన సహాయం మరింత సులువుగా లభిస్తుంది. దళారీల బెడద, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి తగ్గించటానికి వీలవుతుంది.

మరింత విజయవంతం కావాలంటే..
  • పథకం మరింత విజయవంతం కావాలంటే బ్యాంక్ మిత్ర (బ్యాంకింగ్ కరస్పాండెంట్) పాత్ర ఎంతో కీలకం. ఖాతాదారునికి, బ్యాంకుకు అనుసంధానకర్తగా వీరు సమర్థత కనబరచాలి. అప్పుడే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు జరుగుతాయి. ఇందుకోసం 2 లక్షల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు కావాలి. ఇప్పటికి 1.26 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలి. వీరి జీతభత్యాలు సరిగా ఇచ్చి, సమర్థవంతంగా పనిచేయిస్తే పథకం మరింత విజయవంతమవుతుంది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పథకం అమలును వేగవంతం చేయాలి.
Published date : 06 Nov 2015 12:14PM

Photo Stories