Skip to main content

భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్‌టీ పభావం

భారత ఆర్థిక వ్యవస్థలో ఏకైక ఏకీకృత పన్నుగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని అమలు చేయాలని నిర్ణయించడం.. పన్నుల వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సంస్కరణగా చెప్పుకోవచ్చు. ఇది పన్ను నిర్మాణతలో పారదర్శకతను పెంపొందించి, భారత ఆర్థిక వ్యవస్థపై ధనాత్మక ప్రభావానికి అవకాశం కల్పిస్తుంది. జాతీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పన్నుపై పన్ను విధానానికి స్వస్తి పలకడానికి జీఎస్‌టీ ఉపకరిస్తుంది. జీఎస్‌టీ విధానంలో పంపిణీ వ్యయాలు, సేకరణ వ్యయాలు తక్కువగా ఉంటాయి.
జీఎస్‌టీ-పరిణామ క్రమం
భారతదేశంలో పరోక్ష పన్నుల నిర్మాణత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని మూడు జాబితాలపై ఆధారపడి ఉంది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన మూడు జాబితాలు భారత ప్రభుత్వ చట్టం 1935పై ఆధారపడి ఉన్నాయి. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో పరోక్ష పన్నుల నిర్మాణతకు కాలం చెల్లింది. ప్రపంచం.. వస్తు, సేవల పన్నుపై దృష్టిసారించింది. దీన్ని 21వ శతాబ్దపు పన్నుగా భావించవచ్చు. భారత్‌లో మొదటిసారిగా 2004లో జాతీయ వస్తు, సేవల పన్ను విధింపును విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సు చేసింది. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టడానికి సంబంధించి మొదటగా ప్రకటన చేశారు. 2010 ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినప్పటికీ, రాజకీయ విభేదాల కారణంగా అది నెరవేరలేదు. తర్వాత జీఎస్‌టీని ప్రవేశపెట్టే చర్యల్లో భాగంగా కేంద్ర అమ్మకం పన్ను తగ్గింపు ప్రారంభమైంది. 2007 ఏప్రిల్ 1న కేంద్ర అమ్మకం పన్నును 4 నుంచి 3 శాతానికి; 2008 జూన్ 1న 3 నుంచి 2 శాతానికి తగ్గించారు. జీఎస్‌టీ నమూనాను రూపొందించే బాధ్యతను రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ 2009 నవంబరు 10న మొదటి చర్చా పత్రాన్ని విడుదల చేసింది.

లోక్‌సభలో 2011 మార్చిలో 115వ రాజ్యాం గ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంటరీ కమిటీకి నివేదించగా, తన నివేదికను 2013 ఆగస్టులో సమర్పించింది. లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లుకు కాలం చెల్లింది. 2013 ఫిబ్రవరిలో మూడు జీఎస్‌టీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. అనేక చర్చల అనంతరం రాజ్యాంగ (122 వ సవరణ) బిల్లును 2014 డిసెంబర్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. 2016 ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీ అమలు లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ బిల్లును 2015 మేలో లోక్‌సభ ఆమోదించింది. జీఎస్‌టీ అమల్లో భాగంగా 2015 మార్చి 1న ఎక్సైజ్ డ్యూటీని 12.5 శాతానికి, 2015 నవంబర్ 15న సేవల పన్నును 14.5 శాతానికి పెంచారు. 2016 జూన్ 1 నుంచి సేవల పన్ను 15 శాతంగా ఉంది. లోక్‌సభ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మూడు సవరణలను సూచించింది. అవి.. 1) జీఎస్‌టీ సీలింగ్ పరిమితిని 18 శాతంగా నిర్ణయించి, రాజ్యాంగంలో పొందుపరచాలి. 2) 2011 రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న జీఎస్‌టీ Dispute Resolution Authority (DRA)ని తిరిగి ప్రవేశపెట్టాలి. 3) వస్తు సప్లయ్‌లో భాగంగా అంతర్ రాష్ట్ర లావాదేవీలపై ప్రతిపాదిత 1 శాతం అదనపు పన్ను ప్రతిపాదనను విరమించుకోవాలి.
  • 2015 అక్టోబర్‌లో సాధికారత కమిటీకి సంబంధించిన మూడు జాయింట్ కమిటీలు.. తిరిగి చెల్లింపు ప్రక్రియ, జీఎస్‌టీ చెల్లింపు ప్రక్రియ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మూడు నివేదికలను సమర్పించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. తాము సూచించిన మూడు మార్పులను చేస్తేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఎట్టకేలకు 2016 ఆగస్టు 3న రాజ్యసభ జీఎస్‌టీ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి జీఎస్‌టీని విధించే అధికారం కల్పిస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్నుతోపాటు ఇతర పరోక్ష పన్నులు రద్దయి ఏకీకృత పన్ను అమల్లోకి వస్తుంది.
  • జీఎస్‌టీ అమలు ద్వారా రాష్ట్రాలు ఎదుర్కొనే రెవెన్యూ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుంది. ప్రస్తుతమున్న కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ (పెట్రోలియం ఉత్పత్తులు మినహా), సేవల పన్ను, మెడికల్, టాయిలెట్ ప్రిపరేషన్స్‌పై ఎక్సైజ్ డ్యూటీలు సీజీఎస్‌టీలో విలీనం అవుతాయి. కానీ, వీటిపై ఎస్‌జీఎస్‌టీ ఉంటుంది. రాష్ట్రాల వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, ఆక్ట్రాయ్, ప్రవేశ పన్ను, వినోద పన్ను, విలాస పన్ను, లాటరీలపై పన్ను, బెట్టింగ్, గాంబ్లింగ్ వంటివి ఎస్‌జీఎస్‌టీలో విలీనం అవుతాయి. కానీ, వీటికి సంబంధించి సీజీఎస్‌టీ చెల్లించాలి. ఐజీఎస్‌టీకి సమానంగా దిగుమతి చేసుకున్న వస్తువులపై సీవీడీ, ప్రత్యేక సీవీడీ ఉంటుంది.

జీఎస్‌టీ రేట్లు
2016 జీఎస్‌టీ Law నమూనా జీఎస్‌టీ రేట్ల నిర్మాణతను సూచించలేదు. జీఎస్‌టీ Law నమూనా (2016) క్లాజ్ 7లో పేర్కొన్న విధంగా జీఎస్‌టీ రేటు ఉంటుంది. జీఎస్‌టీ కింద ఉండే పాజిబుల్ రేట్లకు సంబంధించి చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను ఆర్థిక మంత్రికి సమర్పించింది. రెవెన్యూ న్యూట్రల్ రేటును 15 నుంచి 15.5 శాతం మధ్య (కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి), స్టాండర్డ్ రేటును 17-19 శాతం మధ్య కమిటీ సిఫార్సు చేసింది. మొత్తంగా సగటున సీజీఎస్‌టీ 9 శాతం, ఎస్‌జీఎస్‌టీ 9 శాతం, ఐజీఎస్‌టీ 18 శాతంగా ఉండే సూచనలున్నాయి. సింగపూర్‌లో 1994 ఏప్రిల్‌లో జీఎస్‌టీని ప్రవేశపెట్టి రేటును 3 శాతంగా నిర్ణయించారు. అనంతరం 2007 జూలై 1 నుంచి 7 శాతానికి పెంచారు. జపాన్‌లో జీఎస్‌టీ రేటు 5 శాతం. 1986 అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో జీఎస్‌టీని ప్రవేశపెట్టారు. 2010 అక్టోబర్ 15 నుంచి అక్కడ జీఎస్‌టీ 15 శాతంగా ఉంది.

మూడు రకాలుగా జీఎస్‌టీ
సమాఖ్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని జీఎస్‌టీని సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీగా రూపొందించారు. అంతర్ రాష్ట్ర సరకు రవాణా, సేవలపై ఐజీఎస్‌టీ విధిస్తారు. ఈ పన్నును కేంద్రం వసూలు చేసి రాష్ట్రాల మధ్య పంచుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు ధర నిర్ణయ ప్రక్రియ మొత్తంలో ఏకకాలంలో జీఎస్‌టీని విధిస్తాయి. సీజీఎస్‌టీ కేంద్ర పన్ను కాగా, ఎస్‌జీఎస్‌టీ రాష్ట్రాలు విధించే పన్ను. బిల్లులో సూచించిన విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాబడిని పంచుకుంటాయి.

భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్‌టీ అమలు ప్రభావం
  • జీఎస్‌టీ అమలు భారత వినియోగ మార్కెట్ల రంగంలోని value chainపై ధనాత్మక ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో వేర్‌హౌస్‌లను తగ్గించడం ద్వారా ఉత్పత్తిదారులు, రిటైలర్లు సప్లయ్ చెయిన్ లాజిస్టిక్ వ్యయాలను తగ్గించుకోగలుగుతారు. ఈ క్రమంలో వస్తువులు చౌకగా లభిస్తాయి.
  • వ్యాపారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తిరిగి ధరలను తగ్గించి, దానిలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం వల్ల తమ మార్జిన్‌లను మెరుగు పరుచుకొనే అవకాశం ఉంటుంది.
  • ఏకీకృత పన్ను భారత్‌లో వ్యాపారం సులభతరానికి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రస్తుత పరోక్ష పన్నులకు సంబంధించి అమల్లో ఉన్న లోపభూయిష్ట విధానాన్ని తొలగించి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకారిగా ఉంటుంది. ద్వంద్వ పన్నుల వ్యవస్థ, పన్నుపై పన్నును నిర్మూలిస్తుంది. దీర్ఘకాలంలో జీఎస్‌టీ అమలు కారణంగా జీడీపీ వృద్ధిలో 1 నుంచి 2 శాతం మేర పెరుగుదల ఉంటుందని అంచనా.
  • భారత ఆర్థికాభివృద్ధికి జీఎస్‌టీ ప్రయోజనకారిగా ఉండగలదు. చాలా కాలంగా జీఎస్‌టీని తక్కువ అంచనా వేశారు. అయితే ప్రస్తుతం దాదాపు అవరోధాలన్నింటినీ అధిగమించిన నేపథ్యంలో 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీని అమలు చేస్తే దేశ ఆర్థికాభివృద్ధి రేటు వేగవంతమవుతుందని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆడి గోద్రెజ్ అభిప్రాయపడుతున్నారు.
  • పరోక్ష పన్నుల ఎగవేతే.. ప్రత్యక్ష పన్నుల ఎగవేతకు ప్రధాన కారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ అమలుతో పరోక్ష పన్నుల ఎగవేతను నిర్మూలించడం వల్ల ప్రత్యక్ష పన్నుల రాబడి కూడా పెరిగే సూచనలున్నాయి.
  • ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఎస్‌టీ బిల్లుకు సంబంధించిన అధికారిక సవరణలో భాగంగా అంతర్ రాష్ట్ర సప్లయ్‌పై గతంలో ప్రతిపాదించిన 1 శాతం అదనపు పన్నును విరమించుకుంది. దీంతో వ్యాపారులు తమ కార్యకలాపాలను పన్ను వాతావరణంలో తీసుకునే నిర్ణయాలకు విరుద్ధంగా వ్యాపార కోణంలో తీసుకునే వీలుంటుంది. ఈ స్థితి అధిక పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది.
  • 18 నుంచి 19 శాతం కంటే అధికంగా జీఎస్‌టీ రేటును నిర్ణయిస్తే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే వ్యాట్‌తో కలిపి ప్రవేశ పన్ను రూపంలో కొన్ని రాష్ట్రాలు 27 నుంచి 28 శాతం మధ్య పన్నులను విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు జీఎస్‌టీ రేటును 20 శాతానికి పైగా విధించాలని, తద్వారా తమకు ఎదుర య్యే రెవెన్యూ నష్టాలను నివారించుకోగలమని అభిప్రాయపడుతున్నాయి.
  • 27 శాతం జీఎస్‌టీ రేటు వద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. 18 నుంచి 19 శాతం వరకు ఉండే జీఎస్‌టీ రేటు ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. 22 శాతం వరకు ఉండే జీఎస్‌టీ రేటు కారణంగా ద్రవ్యోల్బణంలో కొన్ని బేసిస్ పాయింట్లు పెరుగుతాయి. రెస్టారెంట్లు, మొబైల్ ఫోన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతమున్న 15 శాతం పన్నురేటులో పెరుగుదల ఉన్నట్లైతే ఆయా రంగాల్లో వృద్ధి మందగిస్తుంది.
  • జీఎస్‌టీ అమలుతో ఉపాధి నష్టం సంభవిస్తుందనే ఆందోళన కారణంగా కొంత మంది రాజకీయ నాయకులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. జీఎస్‌టీ అమలు వల్ల ప్రత్యేకంగా సంఘటిత రంగం ప్రయోజనం పొందినప్పటికీ అసంఘటిత రంగంలో ఉపాధి నష్టం ఏర్పడవచ్చు. సంఘటిత రంగంతో పోల్చినప్పుడు అసంఘటిత రంగంలో ఆరు రెట్లు ఉపాధి ఎక్కువ.
  • టెలికాం రంగంపై జీఎస్టీ 15 శాతానికి మించితే ధనాత్మక ప్రభావం ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఆశిస్తున్న connected digital indiaను సాధించడంతో పాటు తక్కువ ధరకే సేవలందించే అవకాశం ఉంది.
  • వాహనాల ఆన్‌రోడ్ ధరల్లో 8శాతం మేర తగ్గుదల ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. తక్కువ ధరలకు లభిస్తే కంపెనీలు తమ వాహనాల పరిమాణాన్ని పెంచుకుంటాయి.
  • ఏప్రిల్ 2017 నుంచి పన్నురేటులో 300 బేసిస్‌పాయింట్లు పెరుగుదల కారణంగా జీవిత, ఆరోగ్య, వాహనాల బీమా వ్యయం పెరుగుతుంది. ఎయిర్‌లైన్స్‌లో ప్రస్తుత సేవల పన్ను 6-9 శాతం కాగా జీఎస్టీ 15 - 18గా ఉన్నప్పుడు ఆ రంగంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సిమెంట్ కంపెనీలపై ప్రస్తుతమున్న పన్ను రేటు 25 శాతంగా ఉండగా, అది 15 - 18 శాతానికి తగ్గితే ఆ రంగంలో వృద్ధి మెరుగవుతుంది.
Published date : 08 Aug 2016 12:16PM

Photo Stories