ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏయూఈఈటీ–2023 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు.
దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
ఏప్రిల్ 17న ఏయూ సెనేట్ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ పరీక్షకు ఇంటర్ విద్యార్హత కలిగిన, ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.750 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
మే 3న విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప కేంద్రాల్లో పరీక్షను నిర్వహించి, మే 5న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం బీటెక్ డిగ్రీతో వెళ్లే అవకాశం ఉందన్నారు. విద్యార్థి కోరితే ఎంటెక్ కోర్సునూ పూర్తిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. www.audoa.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.