Skip to main content

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏడేళ్లుగా అవే సీట్లు.. అవే కోర్సులు!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపై నిరాసక్తత కొనసాగుతోంది.
జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీ కాలేజీల్లో సీట్లకు మంచి డిమాండ్ ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క జేఎన్‌టీయూ-కరీంనగర్ కాలేజీలో మాత్రం 60 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స(ఏఐ) సీట్లు ఇచ్చారు. మినహా మరే కాలేజీలోనూ సీట్ల పెంపు ఊసేలేదు. ఫలితంగా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 3,152కే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడేళ్లలో ఒక్కసారీ సీట్ల పెంపు కోసం ప్రభుత్వానికి వర్సిటీ వర్గాలు ప్రతిపాదనలు పంపిన దాఖలాల్లేవు.

అనుమతులే అసలు సమస్య...
యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే అసలు సమస్య. దీనికి అదనంగా ఫ్యాకల్టీ సమస్య తోడరుు్యందని అధికారులు అంటున్నారు. ఏడేళ్లుగా యూనివర్సిటీల్లో వివిధ కారణాలతో అధ్యాపక నియామకాలు చేపట్టలేదు. ఇటు పాత అధ్యాపకులు రిటైర్ అవుతుండటంతో పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 2,500కు పైగా పోస్టులుంటే అందులో 1,700 వరకు ఖాళీలే. ఇందులోనూ ఉస్మానియా, జేఎన్‌టీయూల్లోనే ఎక్కువ ఖాళీలున్నాయి. సీట్లు పెంచి, అదనపు కోర్సులకు అనుమతివ్వాలంటే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక ప్రొఫెసర్ అవసరం. అందువల్ల ఈ పరిస్థితుల్లో సీట్ల పెంపు గురించి ఊహించలేమని వర్సిటీ అధికారులే అంటున్నారు.

డిమాండ్ ఉన్నా పెంపు ఏదీ?
యూనివర్సిటీ కాలేజీల్లోని సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ వంటి కోర్సుల్లో సీట్లకు బాగా డిమాండ్ ఉంది. అయితే ఇవి వందల సంఖ్యల్లోనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఈ పరిస్థితి తెలంగాణ వచ్చాక కూడా మారలేదు. ఏడేళ్లుగా రాష్ట్రంలోని 7 వర్సిటీల పరిధిలోని 14 కాలేజీల్లో 3,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఓయూలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో పదేళ్లుగా 440 సీట్లే ఉన్నాయి. దీంతో విద్యార్థులు ప్రైవేటు కాలేజీలకు వెళ్లక తప్పడంలేదు. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలు మూడే ఉండగా, వాటిలో ఉన్న సీట్లు 180. ఫార్మసీ కోర్సులకూ డిమాండ్ ఉన్నా సీట్ల పెంపు పట్టించుకోవట్లేదు. ఎంబీఏ కాలేజీలు 19 ఉం డగా 1,290 సీట్లు, ఎంసీఏ కాలేజీలు 13 ఉండగా 670 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కొత్త కోర్సులపైనా లేని ఆలోచన..
యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపైనా ధ్యాస కరువైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స, మిషన్ లెర్నింగ్, డేటా సైన్‌స వంటి కొత్త కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డిమాండ్ ఉంది. వీటిని యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశపెట్టే యోచనేదీ కనిపించడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిచ్చేసింది. రాష్ట్ర ప్ర భుత్వం కూడా ఆయా కోర్సుల్లో ఒక్క సీటుకూ కోత పెట్టకుండా దాదాపు 20 వేల సీట్లకు యథాతథంగా అనుమతిచ్చింది. కానీ యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ల పెంపునకు మాత్రం చర్యలు కరువయ్యాయి.

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఇలా..

యూనివర్సిటీ

ఇంజనీరింగ్ కాలేజీలు

సీట్లు

ఓయూ

2

440

జేఎన్‌టీయూహెచ్

4

1,468

కేయూ

3

825

మహాత్మా గాంధీ

1

180

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ

1

160

అగ్రికల్చర్

2

57

వెటర్నరీ

1

22

మొత్తం

14

3152

{పభుత్వానికి లేఖ రాయాలని చెప్పాం..
యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో సీట్ల పెంపునకు, కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించాం. అయితే దీనికోసం నిధుల కేటారుుంపు, ఫ్యాకల్టీ నియామకం అవసరం. వీటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.
-ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
Published date : 27 Jan 2021 05:28PM

Photo Stories