Skip to main content

బ్రేకింగ్‌ న్యూస్‌: ఇకపై మ్యాథ్స్, ఫిజిక్స్‌ లేకున్నా ఎవరైనా ఇంజనీరింగ్‌ చదవొచ్చు...

సాక్షి, హైదరాబాద్‌: బీఈ/బీటెక్‌ ప్రవేశాలకు విద్యార్థులకు అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
2021–22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేసింది.

Check Inter study material here

గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి..
2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ (రివైజ్డ్‌) 2020–21లో బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ బీప్లానింగ్‌ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరిగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్‌ వొకేషనల్‌ సబ్జెక్టు/ కంప్యూటర్‌ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌/ అగ్రికల్చర్‌/ ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌ వంటి సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్‌/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులను తప్పనిసరిగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్‌ విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ కెమిస్ట్రీ/ కంప్యూటర్‌ సైన్స్/ ఎల్రక్టానిక్స్‌/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌/ బయోటెక్నాలజీ/ టెక్నికల్‌ వొకేషనల్‌ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్‌/ ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది.
Published date : 13 Mar 2021 03:33PM

Photo Stories