ఆ 2,290 మందికి ఎంసెట్ ర్యాంకులు ఇచ్చేశాం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు తామే ర్యాంకులను కేటాయించామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.

ఇంటర్మీడియట్లో ఒక పేరు, ఎంసెట్ దరఖాస్తులో మరో పేరు ఉన్న వారికే డేటా మిస్ మ్యాచ్ అవడం వల్ల ర్యాంకులు కేటాయించలేదని పేర్కొన్నారు. అలాంటి వారు జేఎన్టీయూలోని ఎంసెట్ కార్యాలయానికి వచ్చి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే వారికి ఆ సమాచారాన్ని కూడా పంపించామని వెల్లడించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా బోర్డుల నుంచి డేటా తీసుకొని 1,400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు, 800 మంది అగ్రికల్చర్ విద్యార్థులకు ర్యాంకులను కేటాయించామని వివరించారు. మే 31న మరో 90 మందికి ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. మొదటి రెండు రోజులు పొరపాట్ల సవరణకు సంబంధించి అధిక సంఖ్యలో మెయిల్స్ వచ్చాయని, వాటిని పరిశీలించడంలో ఆలస్యం అయిందని చెప్పారు. ఇంకా ఎవరైనా డేటా మిస్ మ్యాచ్ అయి ర్యాంకులు రాని వారు ఉంటే ఎంసెట్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి ర్యాంకులను కేటాయిస్తామని వివరించారు.
Published date : 01 Jun 2018 01:40PM