Skip to main content

Badminton Tournament: అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు.. ఒకే వ్య‌క్తికి రెండు టైటిల్స్!

ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు అరిగెల భార్గవ్‌ రామ్‌ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు.
Surya Charisma Tamiri, Bhargav Ram win titles at India Junior International Badminton Tournament

సెప్టెంబ‌ర్ 1వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన భార్గవ్‌ అండర్‌–19 పురుషుల డబుల్స్, అండర్‌–19 మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచాడు.

డబుల్స్‌లోనూ..
పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన గొబ్బూరు విశ్వతేజ్‌తో కలిసి ఆడిన భార్గవ్‌ రామ్‌ 21–13, 21–18తో అర్ష్‌ మొహమ్మద్‌–భవ్య్‌ ఛాబ్రా (భారత్‌) జోడీని ఓడించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భార్గవ్‌రామ్‌–కలగొట్ల వెన్నెల (భారత్‌) ద్వయం 21–9, 21–12తో మొహమ్మద్‌ వితో అనాఫ్సా–కేలా అనీసా పుత్రి (ఇండోనేసియా) జంటను ఓడించి టైటిల్‌ దక్కించుకుంది.

చాంపియన్‌ సూర్య చరిష్మా
ఇక అండర్‌–19 మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సూర్య చరిష్మా తామిరి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సూర్య చరిష్మా 18–21, 21–11, 21–15తో థాలిత రమధాని విర్యావాన్‌ (ఇండోనేసియా)పై గెలుపొందింది. అండర్‌–19 మహిళల డబుల్స్‌ ఫైనల్లో తారిణి సూరి–శ్రావణి వలేకర్‌ (భారత్‌) జంట 21–17, 23–21తో చైచానా–పొలియం (థాయ్‌లాండ్‌) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది.

Shaik Sadia Alma: స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఏపీ అమ్మాయి

Published date : 03 Sep 2024 01:39PM

Photo Stories