Skip to main content

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా జాబ్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. తద్వారా కొత్తగా 1,03,075 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనుండగా పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్టీపీసీ అనకాపల్లి జిల్లాలో రూ.1.10 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పే న్యూ ఎనర్జీ పార్కుతోపాటు కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు, పలు రంగాల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారికి చేదోడుగా నిలవాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తై కార్యకలా­పాలు మొదలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం రూపొం­దించిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యో­గాలు స్థానికులకే దక్కాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ ప్రాజెక్టుల విధానంలో కీలక మార్పులు తెచ్చామని ముఖ్యమం‘త్రి తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చామన్నారు.
విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు లీజు కింద చెల్లింపులు చేస్తారని, దీనివల్ల కరువు ప్రాంతాల్లో రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని తెలిపారు. ఎస్‌జీఎస్‌టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు. గ్రిడ్‌ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవన్నారు. దీంతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. భోగాపురంలో అత్యంత అధునాతన సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.  

RBI Regional Office: విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

ఎస్‌ఐబీపీ ఆమోదించిన ప్రతిపాదనలు ఇవీ
☛ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటు కానుంది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.55 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడులతో తొలిదశలో 30 వేల మందికి, రెండో దశలో 31 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా 61 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.
☛  కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ.3,400 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2025 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
☛ శ్రీకాళహస్తి, పుంగనూరులో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీల స్థాపన ద్వారా డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్‌ తయారీ. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్లు, పుంగనూరులో రూ.171.96 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొత్తంగా రూ.1,087 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2023 డిసెంబర్‌ నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
☛  కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు. ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వీటిని ఏర్పాటు చేస్తుంది. నాలుగు విడతల్లో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడుల ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దశలవారీగా 2027 మార్చి నాటికి పూర్తి స్ధాయిలో సిద్ధం కానుంది.
☛  రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ ద్వారా  ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మే 2023లో పనులు ప్రారంభించి జూన్‌ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
☛ వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1489.23 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తిరుపతిలో నెలకొల్పే పరిశ్రమ ద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెలీ కమ్యూనికేషన్‌ ఇంటిగ్రేషన్, సెమి కండక్టర్, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది.

Granules Investments: ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ ప్లాంట్‌
☛ కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్‌ ఇంధన తయారీకి అవిశా, ఫ్యూయెల్స్‌ కంపెనీ ముందుకొచ్చాయి. మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి లభిస్తుంది. దీని సామర్థ్యం రోజుకు 500 కిలో లీటర్ల తయారీ. ఈ ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
☛ విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తోంది. మొదటి విడతలో 10 మెగావాట్లతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి స్థాయికి చేరుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం రూ.7,210 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి.. మొత్తంగా 20,450 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్కుకి ఇది అదనం.
☛ భోగాపురంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం లభించింది.
☛ రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌ తమ ప్రణాళికలను మార్చుకుంది. ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటు ప్రతిపాదనను ఎస్‌ఐపీబీ ఆమోదించింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (15-21 జనవరి 2023)

Published date : 08 Feb 2023 11:32AM

Photo Stories