Drone Contracts: రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు.. కారణం ఇదే..

ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది.
ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి.
అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.
Republic Day: 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు
దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది.