Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 14, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 14th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 14th current affairs

Andhra Pradesh: టూరిస్ట్ పోలీస్ స్టేష‌న్ల‌కు సీఎం జ‌గ‌న్ శ్రీకారం
పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్‌ స్టేషన్లు ఉపయోగపడతాయన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టామ‌ని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

టూరిస్ట్ పోలీస్‌ బూత్
అలాగే విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్‌ను కూడా సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. పోలీస్‌ బూత్‌తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రత చేకూరేల బీచ్ పోలీసింగ్‌ను తీర్చిదిద్దారు.

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా జాబ్స్‌
 
WPL 2023 Auction: ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం.. 87 మంది ప్లేయర్ల కోసం రూ.59.5 కోట్లు ఖర్చు!
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా.. ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్‌కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.. యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్‌ 18 మంది చొప్పున తీసుకున్నాయి. వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్‌–10 జాబితాలో భారత్‌ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్‌ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్‌ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. సీనియర్‌ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు  నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్‌లో అవకాశం దక్కింది.

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

అయితే అండర్‌–19 ప్రపంచకప్‌లో రాణించిన హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్‌ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్‌ డబ్ల్యూపీఎల్‌ వేలంను నిర్వహించింది.  
వేలం విశేషాలు.. 
భారత జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్‌బాష్‌ లీగ్, ‘హండ్రెడ్‌’ లీగ్‌లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్‌పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్‌ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ అయిన యాష్లే గార్డ్‌నర్‌పై కూడా టీమ్‌లు ఆసక్తి చూపించాయి. ఆసీస్‌ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌లకు కూడా మంచి విలువ దక్కింది. మహిళల టి20 క్రికెట్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్‌ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్‌ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. భారత కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కోసం గుజరాత్‌ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)

• అసోసియేట్‌ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్‌ తారా నోరిస్‌ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. 
• యూఏఈకి చెందిన మనిక గౌర్‌ కోసం గుజరాత్‌ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  
• 16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు.   
• 448 వేలం బరిలో నిలిచిన ప్లేయర్లు 
• 87 అమ్ముడైన మొత్తం ప్లేయర్లు 
• 57 భారత క్రికెటర్లు 
• 30 విదేశీ క్రికెటర్లు 
• రూ.12 కోట్లు ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంచైజీకి కేటాయించిన మొత్తం 
• రూ. 59 కోట్ల 50 లక్షలు ఐదు ఫ్రాంచైజీలు కలిసి వెచ్చించిన మొత్తం 
• రూ. 50 లక్షలు వేలం పూర్తయ్యాక మిగిలిన మొత్తం.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి


WPL Auction 2023: ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. స్నేహ దీప్తికి డబ్ల్యూపీఎల్‌ అవకాశం 
16 ఏళ్ల 204 రోజులు.. 2013 ఏప్రిల్‌లో స్నేహ దీప్తి అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ టి20ల్లో ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మరో టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె అదే నెలలో తన ఏకైక వన్డే కూడా ఆడింది. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమె దూరమైంది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత స్నేహ దీప్తికి అరుదైన రీతిలో తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. సాధారణంగా దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అంటే కెరీర్‌ ముగిసినట్లే. కానీ దీప్తి 26 ఏళ్ల వయసులో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇన్నేళ్ల పాటు ఆటకు దూరం కాకుండా ‘అమ్మ’గా మారిన తర్వాత కూడా క్రికెట్‌లో ఆమె కొనసాగిన తీరు స్ఫూర్తిదాయకం. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)

దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఆంధ్ర జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో చిన్న వయసులోనే భారత జట్టులో అవకాశం దక్కించుకుంది. దేశవాళీలో దక్షిణ మధ్య రైల్వే తరఫున చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2021లో ఆమెకు పాప పుట్టింది. ఈ సమయంలోనే ఆటకు విరామమిచ్చి స్నేహ సెపె్టంబర్‌లోనే మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి క్రికెట్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. 

Shubman Gill: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా గిల్‌ 
టీమిండియా నయా సంచలన బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ 2023 జనవరి నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా ఎంపికయ్యాడు. జ‌నవ‌రి 2023లో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలతో సహా మొత్తం 567 పరుగులు చేసిన భారత ఓపెనర్‌ గిల్‌. కాన్వే (న్యూజిలాండ్‌), సహచరుడు సిరాజ్‌లను వెనక్కినెట్టి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. గతంలో భారత్‌ నుంచి పంత్, అశ్విన్, భువనేశ్వర్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ ఈ అవార్డు గెల్చుకున్నారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)

International Chess Federation: గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నీ రన్నరప్‌గా హంపి 
అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ రెండో టోర్నమెంట్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. ఫిబ్ర‌వ‌రి 13న‌ ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్‌ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. 
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్‌లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ 64 ఎత్తుల్లో జినెల్‌ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది.  

U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో' ప్రారంభం
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా–2023’ను ప్రధాని మోదీ ఫిబ్ర‌వరి 13వ తేదీ కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్‌ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. విదేశీ పరికరాలకు మన దేశాన్ని ఒక మార్కెట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. శక్తివంతమైన రక్షణ భాగస్వామిగా భారత్‌ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు.  
5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు  
రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నెన్నో ఘనతలు సాధించామని నరేంద్ర మోదీ తెలియజేశారు. మిలటరీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి విషయంలో మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ‘తేజస్‌ లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాటవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్‌ సెక్టార్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల వైమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగే ‘ఏరో ఇండియా’లో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్‌ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రక్షణ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 
ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్‌–13ఏ ఫైటర్‌ జెట్లు  
ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్‌ మల్టీరోల్‌ ఎఫ్‌–35ఏ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్‌–35ఏ లైట్నింగ్‌–2, ఎఫ్‌–13ఏ జాయింట్‌ స్ట్రైక్‌ ఫైటర్‌ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి సోమవారం బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్‌ జెట్లు భారత్‌ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్‌–16 ఫైటింగ్‌ ఫాల్కన్, ఎఫ్‌/ఏ–18ఈ, ఎఫ్‌/ఏ–18ఎఫ్‌ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి.    
 
 Lithium: బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన తెల్ల బంగారం

Published date : 14 Feb 2023 06:23PM

Photo Stories