గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్వహణ, మరమ్మతులు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
పాఠశాలలకు 15వ ఆర్థిక సంఘం నిధులు
ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తాజాగా రాష్ట్రాలకు లేఖ రాశారు. గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికీ ఖర్చు కాకుండా మిగిలిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆరి్థక సంవత్సరం కేటాయించిన మేరకు వినియోగించుకోవచ్చని సూచించారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించిన నిధులను వాటి పరిధిలోని పాఠశాలల్లో విద్య, ఇంటర్నెట్ వసతి ఏర్పాటు, తరగతి గదుల తలుపులు, కిటికీలు మరమ్మతులు, స్కూలు ప్రహరీ, ప్రధాన ద్వారం గేటు, ఆటస్థలం, మంచినీటి వసతి, టాయిలెట్ల నిర్మాణం వంటి వాటికి ఉపయోగించవచ్చన్నారు. కాగా, కేంద్రం సూచించిన ప్రకారం 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు తగిన ఆదేశాలను జారీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.