Skip to main content

స్ట్రెస్‌ను దూరం చేసే సైకాలజిస్టు.. అవ్వాలంటే మార్గాలు ఇవే..!

నేడు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. గ్లోబలైజేషన్‌తో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల్లో విపరీతమైన పని ఒత్తిడి. నేడు స్ట్రెస్ అనేది ఉద్యోగుల్లోనే కాకుండా.. స్కూల్ పిల్లల నుంచి టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. పరీక్షలో విజయం సాధించలేమోనని విద్యార్థులు డిప్రెషన్‌కు గురవుతుంటారు. పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. మానసిక సమస్యలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న ఎంతోమందిని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారికి వెంటనే వైద్యం అందిస్తే తిరిగి సాధారణ జీవితాన్ని గడిపే వీలుంటుంది. వీరికి మందుల కంటే సైకాలజిస్టుల సలహాలే ఔషధంలా పనిచేస్తాయనే అభిప్రాయం ఉంది! నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో సైకాలజిస్టుల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సైకాలజీ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
సైకాలజిస్టుల సేవలు..
  • క్లినికల్ అండ్ కౌన్సెలింగ్ సైకాలజిస్టులు: వీరు రోగులకు మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు పనిచేస్తారు.
  • ఆర్గనైజేషనల్,కమ్యూనిటీ సైకాలజిస్టులు: పరిశ్రమలు, బిజినెస్, సామాజిక ప్రయోజన సంస్థ(సోషల్ బెనిఫిట్ ఆర్గనైజేషన్స్)ల్లో పనిచేసేవారికి అవసరమైన సేవలు అందిస్తారు.
  • అకడెమిక్ సైకాలజిస్టులు: వీరు కాలేజీలు,యూనివర్సిటీల్లో మానసిక సమస్యలపై పరిశోధనలు చేయడంతోపాటు విద్యార్థులకు సైకాలజీ సబ్జెక్టును బోధిస్తారు. కొందరు ఆయా కళాశాలల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులను గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తారు.
  • హెల్త్ సైకాలజిస్టులు: ఒక నిర్దిష్ట వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల వివిధ ప్రతి చర్యలను ఆరోగ్య మనస్తత్వవేత్తలు(హెల్త్ సైకాలజిస్టులు) అధ్యయనం చేస్తారు. ఆ రోగులకు ఎలాంటి చికిత్స అవసరమో గుర్తిస్తారు. ఏదైనా శారీరక రోగం వల్ల మానసిక స్థితి అదుపు తప్పిందా లేక మరేదైనా కారణమా అన్నది గుర్తించి చికిత్స అందిస్తారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసైనవారికి చికిత్స అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.

సైకాలజిస్ట్ అవ్వాలంటే...
సైకాలజిస్ట్ అవ్వాలంటే.. మొదట డిగ్రీ స్థాయిలో మనస్తత్వ శాస్త్రాన్ని చదవాలి. సైకాలజీలో బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత పీహెచ్‌డీ పూర్తి చేయొచ్చు. డిగ్రీ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేసే లోపు దాదాపు పదేళ్లపాటు మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వీలుంటుంది.

కోర్సులు...
మన దేశంలో చాలా విశ్వవిద్యాలయాలు సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
అవి..
  • బ్యాచిలర్ కోర్సులు(మూడేళ్లు): బీఎస్సీ -సైకాలజీ, బీఏ(హానర్స్) -సైకాలజీ.
  • మాస్టర్స్ కోర్సులు(రెండేళ్లు): ఎంఏ-సైకాలజీ, ఎంఏ-అప్లయిడ్ సైకాలజీ.
  • ఎంఏ-కౌన్సెలింగ్ సైకాలజీ, ఎంఎస్సీ-సైకాలజీ, ఎంఫిల్-సైకాలజీ (రెండేళ్లు).
  • పీహెచ్‌డీ-సైకాలజీలో.. వివిధ విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకొని లోతుగా పరిశోధనలు చేయవచ్చు.

నైపుణ్యాలే కీలకం..
సైకాలజీలో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసినంత మాత్రాన సైకాలజిస్టుగా రాణించలేదు. వాస్తవ పరిస్థితుల్లో సైకాలజిస్ట్‌గా విజయం సాధించేందుకు నైపుణ్యాలు చాలా కీలకం. ప్రధానంగా మానసిక రుగ్మతలతో వచ్చేవారు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వారితో మాట్లాడేటప్పుడు చాలా ఓర్పు, నేర్పు, సహనం అవసరం. రోగులు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా.. స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం, నమ్మకం కలిగించాలి. సమస్యను విన్న తర్వాత పరిష్కారాన్ని రోగులు అర్థం చేసుకునేలా చెప్పగలగాలి. అందుకు సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.

అవకాశాలు ఎన్నో..
  • సైకాలజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య సేవల విభాగాల్లో కొలువులు దక్కించుకునే వీలుంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, క్లినిక్స్, ప్రభుత్వ సంస్థల్లో చేరొచ్చు. వీరు సైకో థెరపిస్ట్, కౌన్సిలర్, టీచర్, కన్సల్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, క్లినికల్ సోషల్ వర్కర్‌గా సేవలు అందించవచ్చు.
  • ఉద్యోగ నియామక ఇంటర్వ్యూ బోర్డుల్లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్టుల సేవలు అవసరం అవుతాయి.
  • పోలీసు విభాగంలో నేర పరిశోధనలకు సైతం సైకాలజిస్టుల సేవలు దోహదపడతాయి. ముఖ్యంగా నిందితులు చెప్పేది నిజమో కాదో తెలుసుకునేందుకు, వారు నేరబాట పట్టడానికి గల కారణాలను విశ్లేషించి.. వారిలో పరివర్తన తెచ్చేందుకు సైకాలజిస్టులు ప్రయత్నిస్తారు.

సైకాలజీ - సైకియాట్రీ వేర్వేరు
వాస్తవానికి మనస్తత్వశాస్త్రం అనేది మనసు, దానివల్ల మనిషి ప్రవర్తనను అధ్యయనం చేసేదని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ తెలిపింది. మనసు ఎలా పనిచేస్తుంది.. మనిషి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది అనేదాన్ని అధ్యయనం చేస్తుంది సైకాలజీ. మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడంలో సైకాలజిస్టులు (మనస్తత్వవేత్తలు), సైకియాట్రిస్టులు (మనోరోగ వైద్యులు) కలిసి పనిచేస్తారు. మందుల ద్వారా మానసిక రోగాన్ని తగ్గించే వారు సైకియాట్రిస్టులు.. కాగా, మాటలు, కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలకు చికిత్స అందించే వారు సైకాలజిస్టులు. ప్రస్తుతం విద్య, వ్యాపారం, పోలీస్ డిపార్ట్‌మెంట్, క్రిమినల్ జస్టిస్, మానసిక ఆరోగ్య కేంద్రాలు వంటి అనేక విభాగాల్లో సైకాలజిస్టుల అవసరం పెరుగుతోంది.

డిగ్రీ స్థాయి నుంచే..
సైకాలజిస్టులు.. మానసిక సమస్యలు ఉన్నవారికి మందులు లేకుండా కౌన్సెలింగ్ ద్వారా రోగం నయం చేస్తారు. శరీరానికి రోగం వస్తే డాక్టర్‌ను కలిసినట్టే.. మనసుకు సమస్య వచ్చినప్పుడు సైకాలజిస్టులను కలిసేవారి సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో ఫ్యామిలీ డాక్టర్‌లాగే ఫ్యామిలీ సైకాలజిస్టును నియమించుకుంటారు. ఏమాత్రం మానసిక ఒత్తిడి ఉన్నా వెంటనే వారిని సంప్రదిస్తారు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లోని దాదాపు అన్ని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైకాలజీ కోర్సు అందుబాటులో ఉంది. డిగ్రీ, పీజీ స్థాయిలో సైకాలజీ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. ఇటీవల పోలీస్ ఉద్యోగాల నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు పర్సనాలిటీ టెస్ట్, ట్రైనింగ్‌లో సైకాలజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు.
- డాక్టర్ పైడిపాటి స్వాతి, సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, చైర్‌పర్సన్ బోర్డు ఆఫ్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ

సైకాలజిస్టులు అవసరం..
ప్రస్తుతం సమాజంలో సైకాలజిస్టుల సేవల అవసరం పెరిగింది. పోటీ ప్రపంచంలో కంపెనీల్లో పనిచేసే చోట, కుటుంబంలోనూ ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు సైకాలజిస్టులను సంప్రదించేవారి సంఖ్య పెరుగుతోంది. కాని డిమాండ్‌కు తగ్గట్టు నిపుణులు అందుబాటులో లేరు. సైకాలజిస్ట్‌గా రాణించేందుకు డిగ్రీ, పీజీ స్థాయిలో సైకాలజీ చదువుకొని కొంత అనుభవం సంపాదించాలి. రాబోయే రోజుల్లో కాలేజీలు, కార్యాలయాలు సహా ప్రతి చోటా సైకాలజిస్టుల సేవలు అవసరమవుతాయి. అందుకు అనుగుణంగా ఈ కోర్సు ప్రాధాన్యతను గుర్తించి డిగ్రీ, పీజీ స్థాయిలో కోర్సులను అందించే కాలేజీలు, సీట్ల సంఖ్యను పెంచాలి.
- డాక్టర్ ఎ.అనుపమ, ఓయూ సైకాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ
Published date : 22 May 2020 02:25PM

Photo Stories