Aadhar for students: మండల కేంద్రాల్లోనే విద్యార్థులకు ఆధార్
ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంట్లో భాగంగా పాత మండలాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాలకు గతంలో పంపిణీ చేసిన ఆధార్కిట్లను వినియోగంలోకి తీసుకురావాలని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి మండల కేంద్రాల్లోనే క్యాంప్లు నిర్వహించి విద్యార్థులకు ఆధార్ కార్డులు అందించాలని సూచించింది.
పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రతి విద్యార్థికి ఆధార్ నంబర్ ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొత్తగా స్కూళ్లలో చేరిన పిల్లలకు ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
చదవండి: అత్యంత భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. అలాగే ఆఫీస్లకు కూడా..
సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 1,282 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో సుమారు 1.31లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఈ ఏడాది ఒకటో తరగతిలో నాలుగు వేల మంది వరకు చేరారు. చాలామంది పిల్లలు ఆధార్కార్డులు లేకుండా పాఠశాలలో చేరారు. దీంతో వీరికి ప్రభుత్వ సదుపాయాలు కల్పించడం ఇబ్బందిగా మారుతోంది. దీన్ని గుర్తించిన విద్యాశాఖ మండల ఎమ్మార్సీ కార్యాలయాల్లో ఆధార్కార్డులు దింపేందుకు చర్యలు చేపట్టింది.
ప్రతి సంవత్సరం యూడైస్(డిస్ట్రిక్ ఇన్ఫ్ర్మేషన్ సిస్టం ఎడ్యుకేషన్)లో పాఠశాలల్లో సదుపాయాలతో పాటు విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థి ఆధార్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన వారిలో 1,670 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేనట్లుగా గుర్తించి ఆధార్ నమోదు చేయనున్నారు. దీంతో పాటు విద్యార్థుల ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులను అవసరమైతే నమోదు చేయనున్నారు.
PM YASASVI: పేద విద్యార్థులకు వరం... ఏడాదికి లక్షరూపాయలకు పైగా ఉపకారవేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి
18 మండలాల్లోనే కిట్లు...
సూర్యపేటా జిల్లాలో 23 మండలాలు ఉండగా పాత మండలాలైన 18 చోట్లలోనే ఆధార్ కిట్లు ఉన్నాయి. అవికూడా నిరుపయోగంగా మారి మూలనపడ్డాయి. వీటికి మరమ్మతులు చేయించాల్సి ఉంది. కొత్త ఆధార్ నంబర్లు కావాలన్నా.. మార్పులు చేయించుకోవాలన్నా.. పాత మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు వెళ్లాల్సిందే. కొత్తవైన అనంతగిరి, నాగారం, మద్దిరాల, చింతలపాలెం, పాలకవీడు మండలాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాల్లో ఆధార్ కిట్లు లేవు. వీరంతా పక్క మండలాల్లో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయాల్లోకి వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉంది. పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలంటే కొత్త మండలాలకూ కిట్లు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.