Skip to main content

ఆర్థిక సంస్కరణలు - 2

1980వ దశకం చివరి కాలం, 1990 దశకమంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తూర్పు ఐరోపాతోపాటు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన ఇండియా, వియత్నాం, పెరూ, మొరాకో, క్యూబా వంటి దేశాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. సుస్థిర ఆర్థిక వృద్ధిని త్వరితగతిన సాధించాలనే లక్ష్యంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గుచూపాయి. ఆర్థిక సంస్కరణల అమలుతో మెక్సికో, చిలీ, స్పెయిన్ వంటి దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయి.
ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం ఆర్థిక సంస్కరణల సమర్థత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మొదటి దశ
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉత్పత్తికి సంబంధించిన సాంఘిక సంబంధాల్లో మార్పులకు అనుగుణంగా భారత్ కూడా ఆర్థిక ప్రక్రియలో ప్రపంచీకరణ పెంపునకు స్పందించింది. రాజీవ్ గాంధీ 1985లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మొదటి దశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రకటించిన నూతన ఆర్థిక విధానంలో ఉత్పాదకత పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, పూర్తి సామర్థ్య వినియోగంతోపాటు ప్రైవేటు రంగ పాత్రను ఆర్థిక వ్యవస్థలో పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో పారిశ్రామిక లెసైన్సింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపు, నియంత్రణల నిర్మూలన, విదేశీ ఈక్విటీ మూలధనం, కోశ విధానం, ద్రవ్య, పరిపాలనా సంబంధిత నియంత్రణ వ్యవస్థను సులభతరం చేయడంతోపాటు ఎగుమతి -దిగుమతి విధానానికి సంబంధించి అనేక విధాన మార్పులను నూతన ఆర్థిక విధానంలో పొందుపరిచారు.

నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన చర్యలు
  • బహిరంగ మార్కెట్లలో పంచదార స్చేచ్ఛా అమ్మకపు వాటా పెంచారు.
  • పెద్ద బిజినెస్ హౌజ్‌ల ఆస్తుల పరిమితికి సంబంధించి సీలింగ్‌ను రూ.20 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు.
  • లెసైన్సింగ్‌కు సంబంధించి బ్రాడ్‌బాండింగ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ పథకాన్ని ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో వైవిధ్యాన్ని తెచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టగా, తర్వాత ఫోర్‌వీలర్‌‌స, రసాయనాలు, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టైప్‌రైటర్‌‌స వంటి 25 రకాల పరిశ్రమలకు విస్తరించారు. 97 ఔషధాలను పూర్తిగా లెసైన్సింగ్ జాబితా నుంచి తొలగించారు.
  • 27 పరిశ్రమలను ఎంఆర్‌టీపీ (Monopolies and Restrictive Trade Practices) చట్టం పరిధి నుంచి మినహాయించారు.
  • నూతన టెక్స్‌టైల్ విధానం-1985 ద్వారా లెసైన్సింగ్ విధానానికి సంబంధించి మిల్లు, పవర్‌లూమ్, హ్యాండ్లూమ్ రంగాలు, నేచురల్, సింథటిక్ ఫైబర్‌ల మధ్య తేడాను రద్దు చేశారు.
  • ఎంఆర్‌టీపీ చట్ట నియంత్రణ నుంచి ఎలక్ట్రానిక్ పరిశ్రమలను తొలగించారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఫెరా (Foreign Exchange Regulation Act) కంపెనీల ప్రవేశాన్ని కూడా సరళతరం చేశారు.
  • ఎగుమతి - దిగుమతి విధానం-1985 ద్వారా ఎగుమతి ఉత్పత్తి బేస్‌ను పటిష్టపరచడం, సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు అవకాశాలు కల్పించడం, దిగుమతుల అందుబాటును వేగవంతం, సులభతరం చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు.
  • ఏడో పంచవర్ష ప్రణాళిక అమలు దిశగా 1985లో దీర్ఘకాల కోశ విధానాన్ని ప్రకటించారు.
రెండో దశ
ఆశించిన ఫలితాలను సాధించడంలో మొదటి దశ ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. వాణిజ్య శేషంలో లోటు ఆరోపంచవర్ష ప్రణాళికలో రూ.5,935 కోట్లు కాగా, ఏడో పంచవర్ష ప్రణాళికలో రూ.10,841 కోట్లకు పెరిగింది. మరోవైపు అదృశ్య ఖాతా (Invisible account)లో రాబడులు తగ్గాయి. తద్వారా భారత్‌లో వాణిజ్య చెల్లింపుల శేషం సంక్షోభం తలెత్తింది. ఈ స్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి 7 బిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. రుణాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంగీకరిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అంతర్గత, బహిర్గత విశ్వాసాన్ని పెంపొందించేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991-92లో అనేక స్థిరీకరణ చర్యలు ప్రవేశపెట్టింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, వినిమయ రేటులో 22 శాతం సర్దుబాటు, విదేశీ వాణిజ్య విధానాన్ని సరళీకరించడం, సులభతరం చేయడం, ద్రవ్యలోటు తగ్గింపుతోపాటు ఆర్థిక విధానంలో భాగంగా ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రారంభించింది.

2వ దశ ఆర్థిక సంస్కరణలు- విధానపర చర్యలు
1990-91లో ఉన్న ద్రవ్యలోటు 8.4 శాతాన్ని (జీడీపీలో) తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ద్రవ్యపర చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వ్యయంపై నియంత్రణలు విధించడంతోపాటు పన్ను, పన్నేతర రాబడి పెంపునకు చర్యలు తీసుకుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ద్రవ్య క్రమశిక్షణను విధించింది. సబ్సిడీల తగ్గింపు, సమర్థ వ్యయ వ్యవస్థను అభివృద్ధి పరచడం, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెటరీ మద్దతును ఉపసంహరించుకోవడం ద్వారా వాటిలో సమర్థత, లాభదాయకతల పెంపు వంటి చర్యలు తీసుకున్నారు.

దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు వాణిజ్య చెల్లింపుల శేషం స్థితిని మెరుగుపర్చేందుకు కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించారు.
సబ్సిడీలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించేందుకు, సరళమైన ధరల నిర్మాణతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక వస్తువులు, ఉత్పాదితాల పాలిత ధరలను పెంచింది. మార్కెట్ శక్తులకు అనుగుణంగా ధరను నిర్ణయించుకొనే స్వేచ్ఛను ప్రభుత్వ రంగ సంస్థలకు కల్పించింది.
చెల్లింపుల శేషంలోని కరెంట్ అకౌంట్ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతుల తగ్గింపు చర్యలను పాటించింది.

పారిశ్రామిక విధానంలో అవసరమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు 1991 జూలై 24న ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. పారిశ్రామిక విధాన సంస్కరణల్లో భాగంగా చేపట్టిన చర్యలు కింది విధంగా ఉన్నాయి.
పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించి భద్రత, వ్యూహాత్మక లేదా పర్యావరణ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని మూడు అంశాలు మినహా మిగిలిన వాటి విషయంలో పారిశ్రామిక లెసైన్సింగ్ రద్దు.
ప్రాధాన్యత కలిగిన 34 పరిశ్రమల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమేటిక్ అనుమతి.
లొకేషన్ విధానంలో సరళీకరణ.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ.
ట్రేడ్ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడి (1993-94)
కరెంట్ అకౌంట్‌లో రూపాయి మార్పిడి (1994-95)
మూలధన అకౌంట్‌లో రూపాయి పాక్షిక మార్పిడి (1996-97)

సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్య, గ్రామీణ తాగునీటి సరఫరా, ఉపాంత, చిన్నతరహా రైతులకు ఆర్థిక సహాయం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలతోపాటు అవస్థాపన, ఉపాధి కల్పనా కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది.
గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్లు, మెటర్నిటీ బెనిఫిట్స్, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సంబంధించిన పథకాల విషయంలో గ్రూప్ ఇన్సూరెన్‌‌స కల్పించడానికి ప్రభుత్వం 1995-96 బడ్జెట్‌లో జాతీయ సామాజిక ఆర్థిక పథకాన్ని ప్రకటించింది.

నూతన ఆర్థిక విధానంపై అనుకూల వాదనలు
  • ఆసియాన్ దేశాలైన సింగపూర్, మలేసియా, హాంకాంగ్, దక్షిణ కొరియాల ఆర్థిక వృద్ధిరేటుకు సమాన వృద్ధిని భారత్ (7.5 శాతానికి పైగా) సాధించడం.
  • అంతర్జాతీయ మార్కెట్‌లో దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తులకు సంబంధించి పోటీతత్వం పెరగడం.
  • ఆదాయం, సంపదల పంపిణీలో పేదరిక తీవ్రత, అసమానతలు తగ్గడం.
  • నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల సమర్థత, లాభదాయకత పెంపొందడం.
  • చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంస్కరణలు తోడ్పడటం.
  • దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో పెరుగుదల.
  • బడ్జెట్‌లో ద్రవ్యలోటు తగ్గుదల.
  • విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యం నివారణ.
  • లోటు బడ్జెట్ తగ్గుదల. ప్రభుత్వ వ్యయ పరిమాణం తగ్గుదల. సప్లయ్ యాజమాన్యం ద్వారా నూతన ఆర్థిక విధానం ద్రవ్యోల్బణ నియంత్రణకు దోహదపడింది.
నూతన ఆర్థిక విధానం - ప్రతికూల వాదనలు
  • పారిశ్రామిక, వాణిజ్యం, సేవా రంగాలతో పోల్చితే వ్యవసాయ రంగాన్ని నూతన ఆర్థిక విధానం నిర్లక్ష్యం చేసింది.
  • భారతదేశం ప్రపంచ ఆర్థిక సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టింది.
  • స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్మరించడం ద్వారా విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది.
  • నూతన ఆర్థిక విధానం శ్రామికుల వేతనాల్లో వ్యత్యాసాలకు దారితీసి ఆదాయ అసమానతలను పెంచింది.
  • ఎగ్జిట్ విధానం ద్వారా దేశంలో నిరుద్యోగం పెరిగింది.
  • ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా దేశంలో సాంఘిక రంగం నిర్లక్ష్యానికి గురైంది.
  • విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల వినిమయతత్వానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు బలపడేందుకు నూతన ఆర్థిక సంస్కరణలు కారణమయ్యాయి.
  • ధరలు, ద్రవ్యలోటు పెరుగుదల, సబ్సిడీలను నియంత్రించడం, ప్రభుత్వ ప్రణాళికేతర వ్యయంలో పెరుగుదలను నియంత్రించడం వంటి అంశాల్లో నూతన ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి.
2వ తరం ఆర్థిక సంస్కరణలు
  • 2001-02 బడ్జెట్‌లో రెండో తరం ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర ఎజెండాలో భాగంగా కింది వ్యూహాలను అవలంబించాలని భావించారు.
  • వ్యవసాయ రంగంలో సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా ఆహార ఆర్థిక వ్యవస్థ (Food Economy) యాజమాన్యం.
  • అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడి పెంపు. విత్త, మూలధన రంగంలో సంస్కరణల కొనసాగింపు. నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం.
  • విద్యా అవకాశాలను పెంపొందించడం, సాంఘిక భద్రతా పథకాలను అమలుచేయడం ద్వారా మానవాభివృద్ధి.
  • అనుత్పాదక వ్యయంపై కఠిన నియంత్రణ, ప్రభుత్వ వ్యయ నాణ్యత పెంపు.
  • ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణం, ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం.
  • ట్యాక్స్ బేస్‌లను విస్తృతం చేయడం ద్వారా రెవెన్యూ పెంపు.
అన్ని స్థాయిల్లో అమలు
  • 2002-03 బడ్జెట్ ఈ విధానాలను అన్ని స్థాయిల్లో అమలుపరచాలని పేర్కొంది. సమగ్ర వ్యూహాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాల స్థాయిలో ఈ ప్రక్రియను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
  • వ్యవసాయ, ఆహార ఆర్థిక వ్యవస్థ సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగించడం.
  • అవస్థాపనా రంగంపై ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపు.
  • విత్త రంగం, మూలధన మార్కెట్‌ను పటిష్ట పరచడం.
  • అధిక పారిశ్రామికాభివృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయడం.
  • పేద వర్గాల ప్రజలకు సాంఘిక భద్రత.
  • పన్ను సంస్కరణలను ఏకీకృతం చేయడం, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల స్థాయిలో విత్త సర్దుబాటును కొనసాగించడం.
  • విదేశీ సహాయం - సంస్కరణలు అమల్లో ఉన్న దేశాల్లో ప్రత్యేక ప్రాజెక్టు ఆధారితంగా లేదా విదేశీ చెల్లింపుల శేషంలో సంక్షోభాన్ని నివారించే సమర్ధత కలిగి ఉండాలి.
  • నిర్మాణాత్మక సర్దుబాటులో భాగంగా ఆర్థిక సంస్కరణల సమర్థత.. పెట్టుబడి, సంస్థల ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడుల ప్రోత్సాహం, సంస్థల నిర్మాణతలో ప్రైవేటు రంగం పాత్ర ప్రధానమైంది.
  • సంస్కరణలు విజయవంతం కావాలంటే వాటికి సంబంధించిన అనేక కార్యక్రమాల అమలులో ఆయా దేశాల ప్రభుత్వాల పాత్ర ప్రధానమైంది. జెకోస్లోవేకియా, పోలండ్, చిలీ దేశాలు విధానపర మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా సంస్కరణల ఫలితాలను చవిచూశాయి.
Published date : 07 Mar 2017 02:28PM

Photo Stories