Skip to main content

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014

ఆంధ్రప్రదేశ్ విభజన-సవాళ్లు
ఎపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ విభజన - సవాళ్లు అనేదీ అత్యంత కీలకమైన అంశం. ఇటు ప్రిలిమ్స్, అటు మెయిన్స్‌ రెండింటిలోనూ ఈ విభాగం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లు, పురోగమిస్తున్న తీరు, రాజధాని నిర్మాణం, నదీజలాల వివాదాలు, ప్రత్యేక హోదా ఉద్యమం, పోలవరం నిర్మాణం, హైకోర్టు విభజన...తదితర అంశాలు ఈ విభాగంలో ముఖ్యమైన ప్రాధాన్యతాంశాలు. వీటి గురించి అధ్యయనం చేసే ముందు ప్రతీ అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 మీద సమగ్రమైన అవగాహన ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 ముఖ్యాంశాలు
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు - ఫిబ్రవరి 13, 2014
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను లోక్‌సభ ఆమోదించిన రోజు : ఫిబ్రవరి 18, 2014
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన రోజు : ఫిబ్రవరి 20, 2014
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను రాజ్యసభ ఆమోదించిన రోజు : ఫిబ్రవరి 20, 2014
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు - 2013ను అప్పటి రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆమోదించిన రోజు : మార్చి 1, 2014
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014ను ప్రభుత్వ రాజముద్ర(గెజిట్)లో ప్రచురించిన రోజు : మార్చి 4, 2014
    గమనిక: 2014, జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం భాగాలు : 12
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం షెడ్యూళ్లు : 13
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని మొత్తం సెక్షన్లు : 108

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014:
భాగాలు - సంబంధిత సెక్షన్లు

పార్ట్ I - ప్రాథమికం(ప్రిలిమినరీ)/ ప్రవేశిక: సెక్షన్లు 1-2
పార్ట్ II - ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ: సెక్షన్లు 3-11
పార్ట్ III - చట్టసభలలో ప్రాతినిధ్యం: సెక్షన్లు12-29
పార్ట్ IV - హైకోర్టు : సెక్షన్లు 30-43
పార్ట్ V - వ్యయానికి అనుమతి, రాబడుల పంపిణీ : సెక్షన్లు 44-46
పార్ట్ VI - ఆస్తులు మరియు అప్పుల పంపిణీ : సెక్షన్లు 47-67
పార్ట్ VII - నిర్దిష్ట కార్పోరేషన్లకు నిబంధనలు : సెక్షన్లు 68-75
పార్ట్ VII - సర్వీసులకు సంబంధించిన నిబంధనలు : సెక్షన్లు 76-83
పార్ట్ IX - జలవనరుల నిర్వహణ మరియు అభివృద్ధి : సెక్షన్లు 84-91
పార్ట్ X - మౌలికసదుపాయాలు - ఆర్థిక చర్యలు : సెక్షన్లు 92-94
పార్ట్ XI - ఉన్నత విద్యావకాశాలు : సెక్షన్ 95
పార్ట్ XII - న్యాయ మరియు ఇతర సంబంధిత నిబంధనలు : సెక్షన్లు 96-108

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 షెడ్యూళ్లు
షెడ్యూల్ 1 (సెక్షన్ 13):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 18 రాజ్యసభ సీట్లలో 7 స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానం
షెడ్యూల్ 2 (సెక్షన్ 15):
పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు - 2008కు సవరణ
షెడ్యూల్ 3 (సెక్షన్ 24):
శాసనమండలి నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు - 2006కు సవరణ
షెడ్యూల్ 4 (సెక్షన్ 22(2)):
రెండు తెలుగు రాష్ట్రాలలోని శాసనమండలి సభ్యుల జాబితా
షెడ్యూల్ 5 (సెక్షన్ 28):
తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల జాబితా
షెడ్యూల్ 6 (సెక్షన్ 29):
తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జాబితా
షెడ్యూల్ 7 (సెక్షన్ 52):
నిధుల జాబితా(ప్రావిడెంట్ ఫండ్‌‌స, పెన్షన్ ఫండ్‌‌స, ఇన్సూరెన్స్‌ ఫండ్‌‌స......)
షెడ్యూల్ 8 (సెక్షన్ 59):
ఫించన్ల బాధ్యత
షెడ్యూల్ 9 ( సెక్షన్స్‌ 68-71):
ప్రభుత్వ కంపెనీలు - కార్పోరేషన్ల జాబితా
షెడ్యూల్ 10 (సెక్షన్75):
కొన్ని నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో ప్రస్తుత వసతుల కొనసాగింపు - శిక్షణ సంస్థలు/కేంద్రాల పేర్ల జాబితా
షెడ్యూల్ 11 (సెక్షన్ 85(8)(ఇ)):
నదీ నిర్వహణా మండళ్ల విధి విధానాలు
షెడ్యూల్ 12 (సెక్షన్ 92):
బొగ్గు, చమురు - సహజ వాయువు, విద్యుత్
షెడ్యూల్ 13 (సెక్షన్ 93):
ఉన్నత విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పన

ఆంధ్రప్రదేశ్ పునర్వవీస్థీకరణ చట్టం- 2014 సెక్షన్ల వారీ వివరణ
పార్ట్ I - ప్రవేశిక (సెక్షన్స్‌ 1,2)
  • సెక్షన్ 1 : చట్టం పేరు: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం - 2014
  • సెక్షన్ 2 : నిర్వచనాలు
  • అపాయింటెడ్ డే(నియమిత తేదీ) - జూన్ 2, 2014
  • అధికరణ - రాజ్యాంగంలోని అధికరణ
  • శాసనసభ నియోజక వర్గం, శాసనమండలి నియోజక వర్గం, పార్లమెంటరీ నియోజక వర్గం : ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950 ప్రకారం ఉన్న నిర్వచనం
  • ఎన్నికల కమిషన్ - ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటుచేస్తారు
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - నియమిత తేదీకి ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
చట్టం: శాసనం, ఆర్డినెన్స్‌, రెగ్యులేషన్, చట్టబద్ధమైన ఉత్తర్వు, నిబంధన, ఉపనిబంధన, నియమం, ఉపనియమం, పథకం, నోటిఫికేషన్...
  • నోటిఫైడ్ ఆర్డర్: అధికారక గెజిట్లో ప్రచురితమైన ఉత్తర్వు
  • జనాభా నిష్పత్తి: 58.32 : 41.68 (ఏపీ: తెలంగాణ)
  • ప్రస్తుత సభ్యులు : నియమిత తేదీకి ఆయా సభలలో ఉన్న సభ్యులు
  • ఏర్పడే రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ
  • బదలాయించిన భూభాగం : నియమిత తేదీనుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడిన భూభాగం
  • ట్రెజరీ
  • జిల్లా, మండలం, తహసిల్, తాలూకా లేదా ఇతర భూభాగం

పార్ట్ II - ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ (సెక్షన్స్‌ 3-11)
సెక్షన్ 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు
సెక్షన్4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - దాని భూభాగాలు
నోట్: విభజన తరువాత పోలవరం ముంపు గ్రామాల బదలాయింపులో భాగంగా తెలంగాణ నుంచి 7 మండలాలను(5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా) ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగింది.
  • ఏపీలో పూర్తిగా కలిపిన మండలాలు:
    కుకునూరు, వెలేరుపాడు, వర రామచంద్రాపురం, చింతూరు మరియు కూనవరం
  • ఏపీలో పాక్షికంగా కలిపిన మండలాలు: భద్రాచలం(భద్రాచలం రెవిన్యూ గ్రామం మినహాయించి), బూర్గంపాడు(పినపాక, మోరంపల్లి, బంజర, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, కృష్ణాసాగర్, టేకులపల్లి, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పసాక, నక్రిపేట, సోంపల్లి గ్రామాలను మినహాయించి)
  • పై మండలాలలో బూర్గంపాడు, కుకనూరు, వేలేరుపాడులను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు.
  • వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, భద్రాచలం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు
సెక్షన్ 5: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
5(1): నియమిత తేదీ నుంచి ‘‘10 సంవత్సరాలకు మించని కాలానికి’’రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది
5(2): ఆ కాల గడువు ముగిసిన తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది.
నోట్: ప్రస్తుత ఉమ్మడి రాజధాని ప్రాంతం అనగా...‘‘హైదరాబాద్ పురపాలక చట్టం - 1955 ప్రకారం నోటిఫై చేయబడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC)’’
సెక్షన్ 6: నూతన రాజధాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు
నోట్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014 ఆమోదించిన తేదీ నుంచి ‘‘6 నెలలు మించకుండా ‘‘ ఏపీ నూతన రాజధాని విషయమై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేస్తుంది
సెక్షన్ 7: రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నరే రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ‘‘ కొనసాగుతారు
సెక్షన్ 8: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.!!
8(1): నియమిత తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా నిర్వహణ, నివసించే ప్రజలందరి ప్రాణ, ఆస్తి, స్వేచ్ఛ, భద్రతలను కాపాడే బాధ్యత గవర్నర్‌దే.
8(2): ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రతలు, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణల బాధ్యత గవర్నర్‌దే
8(3): గవర్నర్ తన విధినిర్వహణలో ‘‘తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన పిదప’’ తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోగలరు. గవర్నర్ నిర్ణయం అంతిమం. దాన్ని ప్రశ్నించటానికి వీలులేదు
8(4): గవర్నర్‌కు సహాయసహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం ‘‘ఇద్దరు సలహాదారులను ‘‘ నియమిస్తుంది.
సెక్షన్ 9: కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నుంచి పోలీసు దళాల సహకారం
9(1): కొత్తగా ఏర్పాటయ్యే రెండు తెలుగు రాష్ట్రాలకు అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంలో కేంద్రం సహాయం చేస్తుంది.
9(2): హైదరాబాద్‌లో ఉన్న గ్రేహాండ్‌‌స శిక్షణా కేంద్రం నియమిత తేదీనుంచి మూడేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ మూడు సంవత్సరాల పాటు ఈ శిక్షణాకేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది. తరువాత ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది.
9(3): మూడేళ్ల తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్న చోట అత్యాధునిక వసతులతో కూడిన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కేంద్రప్రభుత్వం సహాయం చేస్తుంది
9(4): కొత్తగా ఏర్పాటయ్యే రెండు తెలుగు రాష్ట్రాలు తాము నిర్ణయించుకున్నచోట గ్రేహాండ్‌‌స కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది
9(5): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గ్రే హాండ్‌‌స ఆక్టోపస్ దళాలను ఆయా సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్న తరువాత రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. తరువాత వీరు ఆయా రాష్ట్రాల డీజీపీల ఆధీనంలో పనిచేస్తారు
సెక్షన్ 10: రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌కు సవరణ
సెక్షన్ 11: రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పరిరక్షించడం, కొత్తగా ఏర్పాటయ్యే రెండు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని ఏదేని జిల్లా లేదా ఇతర ప్రాదేశిక భూభాగం యొక్క పేరు, విస్తీర్ణం లేదా సరిహద్దులను మార్చుకోవడంలో సొంత అధికారాలను కలిగి ఉంటాయి.

పార్ట్ III- చట్టసభలలో ప్రాతినిథ్యం(సెక్షన్స్‌ 12-29):
రాజ్యసభ:
సెక్షన్ 12: రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్‌కు సవరణ
వివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాలు - 18
విభజన తర్వాత:
  • ఏపీకి- 11 రాజ్యసభ స్థానాలు
  • తెలంగాణకు - 7 రాజ్యసభ స్థానాలు
సెక్షన్ 13: ప్రస్తుత సభ్యుల కేటాయింపు
వివరణ: ఉమ్మడి ఏపీలోని 18 మంది రాజ్యసభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీచేయుటకు ఎన్నికైన వారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు

లోక్‌సభ :
సెక్షన్ 14: లోక్‌సభలో ప్రాతినిధ్యం
వివరణ: ప్రజాప్రాతినిథ్య చట్టం - 1950కు సవరణ
ఉమ్మడి ఏపీలోని లోక్ సభ సభ్యుల సంఖ్య - 42
విభజన తరువాత:
  • ఏపీకి - 25 తెలంగాణకు - 17
సెక్షన్ 15: పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన
వివరణ: పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన ఆర్డర్ - 2008కు సవరణ.
ఈ సవరణ ప్రకారం నూతన రాష్ట్రాల లోక్‌సభ మరియు శాసనసభలకు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చు
సెక్షన్ 16: ప్రస్తుత సభ్యులకు సంబంధించిన నిబంధన
వివరణ: ఉమ్మడి ఏపీలోని 42 మంది లోక్‌సభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీచేయుటకు ఎన్నికై న వారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు

శాసనసభ :
సెక్షన్ 17: శాసనసభకు సంబంధించిన నిబంధనలు
వివరణ: ఉమ్మడి ఏపీలోని శాసనసభ సభ్యులు - 294
  • రిజర్వ్‌డ్ స్థానాలు : ఎస్సీ - 39, ఎస్టీ - 15
విభజన తర్వాత :
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు - 175
  • ఎస్సీ రిజర్వ్‌డ్ - 29
  • ఎస్టీ రిజర్వ్‌డ్ - 7
  • తెలంగాణ శాసనసభ సభ్యులు - 119
  • ఎస్సీ రిజర్వ్‌డ్ - 19; ఎస్టీ రిజర్వ్‌డ్ - 12
సెక్షన్ 18: ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 333 ప్రకారం తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే గవర్నర్ రెండు తెలుగు శాసనసభలకు ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్‌ని నామినేట్ చేయవచ్చు.
నోట్: ప్రస్తుత ఏపీ శాసనసభలోని ఆంగ్లో ఇండియన్ - ఫిలిప్ సి థోచర్
సెక్షన్ 19: ప్రస్తుత సభ్యుల కేటాయింపు
వివరణ: ఉమ్మడి ఏిపీలోని 294 మంది శాసనసభ సభ్యులను నియమిత తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన సీట్లకు భర్తీ చేయుటకు ఎన్నికైనవారిగా భావించాలి. వీరి పదవీకాలంలో ఎలాంటి మార్పు ఉండదు.
సెక్షన్ 20: శాసనసభల కాలవ్యవధి
వివరణ: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల ఐదేళ్ల కాలవ్యవధి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రారంభమైన తేదీ నుంచి’’ప్రారంభమైనట్లు భావించాలి.
సెక్షన్ 21: సభాపతి, ఉపసభాపతి ప్రక్రియ నియమాలు
21(1): నియమిత తేదీకి ముందున్న ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ నియమిత తేదీ తర్వాత కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్‌గా కొనసాగుతారు. తర్వాత ఆ శాసనసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
21(2): నియమిత తేదీ తర్వాత ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్ కార్యాలయ విధులను నిర్వహిస్తారు.
21(3): నియమిత తేదీకి ముందు అమలులో ఉన్న ఉమ్మడి ఏిపీ శాసనసభ ‘‘కార్య విధాన కార్యక్రమ నిర్వహణా నియమావళి’’, కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్తగా నియమావళి రూపొందించుకునేంతవరకు, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చేసే సవరణలకు లోబడి ఆ రాష్ట్ర అసెంబ్లీ నియమావళిగా కొనసాగుతుంది.
సెక్షన్ 22: రెండు రాష్ట్రాలకు శాసనపరిషత్తులు
వివరణ: రాజ్యాంగంలోని అధికరణ 169 ప్రకారం...
  • ప్రస్తుతం ఏపీ విధానపరిషత్ స్థానాలు - 58
  • ప్రస్తుతం తెలంగాణ విధానపరిషత్ స్థానాలు - 40
సెక్షన్ 23: విధానపరిషత్ విధివిధానాలు
వివరణ: ఆంధ్రప్రదేశ్ : మొత్తం స్థానాలు - 58
  • స్థానిక ప్రజాప్రతినిధులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 20
  • శాసనసభ సభ్యులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 20
  • టీచర్ ఎమ్మెల్సీలు - 5
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు - 5
  • నామినేటెడ్ ఎమ్మెల్సీలు - 8
  • తెలంగాణ : మొత్తం స్థానాలు - 40
  • స్థానిక ప్రజాప్రతినిధులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 14
  • శాసనసభ సభ్యులచే ఎన్నికైన ఎమ్మెల్సీలు - 14
  • టీచర్ ఎమ్మెల్సీలు - 3
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు - 3
  • నామినేటెడ్ ఎమ్మెల్సీలు - 6
నోట్: సెక్షన్ 23(ii) ప్రకారం నాల్గవ షెడ్యూల్‌లో తమిళనాడు తర్వాత తెలంగాణ అనే శీర్షికలో కింది ఎంట్రీలను చేర్చాలి
  1. మున్సిపల్ కార్పోరేషన్లు
  2. మున్సిపాలిటీలు
  3. నగరపంచాయతీలు
  4. కంటోన్మెంట్ బోర్డులు
  5. జిల్లా ప్రజా పరిషత్‌లు
  6. మండల ప్రజా పరిషత్‌లు
సెక్షన్ 24: శాసనమండలి నియోజకవర్గాల పునర్విభజన - 2014కు సవరణ
సెక్షన్ 25: శాసనమండలి చైర్మన్,డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నియమాలు
25(1): నియమిత తేదీకి ముందున్న ఉమ్మడి ఏపీ శాసనమండలి చైర్మన్ నియమిత తేదీ తర్వాత కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నూతన శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతారు. తర్వాత ఆ శాసనమండలి సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
సెక్షన్ 26: నియోజకవర్గాల పునర్విభజన
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి నూతనంగా ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఈ విధంగా ఉంటుంది
  • ఆంధ్రప్రదేశ్: 175 నుంచి 225కు
  • తెలంగాణ: 119 నుంచి 153కు
నోట్: 2026 వర నియోజకవర్గాల పునర్విభజన (సీట్ల పెంపు) ఉండదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది.
సెక్షన్ 27: నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి గల అధికారాలు
సెక్షన్ 28: షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు - 1950కు సవరణ (చట్టంలోని 5వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)
సెక్షన్ 29: షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు - 1950కు సవరణ(చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)

పార్ట్ IV - హైకోర్టు (సెక్షన్స్‌ 30-43)
సెక్షన్ 30: ఆంధ్రప్రదేశ్‌లో నూతన హైకోర్టు ఏర్పాటయ్యేంతవరకు హైదరాబాద్ హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది
30(1): నియమిత తేదీ నుంచి...
ఎ) హైదరాబాద్‌లోని హైకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం, విభజన చట్టంలోని సెక్షన్ 31 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉండాలి.
బి) నియమిత తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆ తర్వాత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులవుతారు
30(2): ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య కేటాయించాలి
సెక్షన్ 31: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
నోట్: 31(2): ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు కేంద్రస్థానం రాష్ట్రపతి నిర్ణయించిన ప్రదేశంలో ఉంటుంది
సెక్షన్ 32: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు
సెక్షన్ 33: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధి
సెక్షన్ 34: బార్ కౌన్సిల్‌లు, అడ్వకేట్లకు సంబంధించిన ప్రత్యేక నిబంధన
సెక్షన్ 35: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వృత్తి నిర్వహణ కార్య విధానం
సెక్షన్ 36: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముద్ర (సీల్) అధీనత
సెక్షన్ 37: రిట్‌లు,ఇతర ప్రక్రియల స్వరూపం
సెక్షన్ 38: న్యాయమూర్తుల అధికారాలు
సెక్షన్ 39: సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేట కార్యవిధానం
సెక్షన్ 40: హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రొసీడింగుల బదిలీ
సెక్షన్ 41: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసిన ప్రోసీడింగ్‌‌స విషయంలో అప్పీలు చేసుకోవడానికి లేదా చర్య తీసుకోవడానికి అధికారం
సెక్షన్ 42: వ్యాఖ్యానం
సెక్షన్ 43: మినహాయింపులు

ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు:
  • ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్ విడుదలైన తేదీ : 26 డిసెంబర్, 2018
  • ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు ప్రారంభైమైన రోజు : జనవరి 1, 2019 (రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా)
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రారంభించినవారు : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభించిన రోజు : ఫిబ్రవరి 3, 2019
  • ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించినవారు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్
  • ఆంధ్రప్రదేశ్ శాశ్వత హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన వారు : జస్టిస్ రంజన్ గగోయ్
  • ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఎక్కడ నిర్మించారు : నేలపాడు (గుంటూరు)
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతన తొలి న్యాయమూర్తుల సంఖ్య (ప్రస్తుతం):1+13=14
నోట్: వాస్తవంగా విభజన ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు దక్కిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య : 37
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించినవారు : ఏపీ గవర్నర్ నరసింహన్
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తరువాత పరిశీలనకు వచ్చిన మొదటి కేసు : విశాఖ మహానగరపాలక సంస్థ V/S గాజుల శోభారాణి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులు :
  1. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్(తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి)
  2. జస్టిస్ ఎ వి శేషసాయి
  3. జస్టిస్ ఎం. సీతారామమూర్తి
  4. జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి
  5. జస్టిస్ దుర్గాప్రసాద్ రావు
  6. జస్టిస్ సునీల్ చౌదరి
  7. జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి
  8. జస్టిస్ జి. శ్యామ్ ప్రసాద్
  9. జస్టిస్ కె. ఉమాదేవి
  10. జస్టిస్ యన్. బాలయోగి
  11. జస్టిస్ టి. రజని
  12. జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు
  13. జస్టిస్ కొంగరపు జయలక్ష్మి
  14. జస్టిస్ ఎం. గంగారావు

పార్ట్ V- వ్యయానికి అనుమతి, రాబడుల పంపిణీ (సెక్షన్స్‌ 44-46)
సెక్షన్ 44: తెలంగాణ రాష్ట్రంలో వ్యయానికి అనుమతి ఇవ్వడం
సెక్షన్ 45: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు లెక్కలకు సంబంధించిన నివేదికలు
సెక్షన్ 46: రాబడిని పంపిణీ చేయుట
వివరణ: 46(1): రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం నుంచి వచ్చే పన్ను పంపకం 13 వ ఆర్థికసంఘం ఆదేశాలకు అనుగుణంగా చేయాలి
ప్రాతిపదిక: జనాభా దామాషా
46(2): నూతనంగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సముచిత గ్రాంట్లను ఇవ్వవచ్చు.
46(3): అవశేష ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల అభివృద్దికి కేంద్రం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని, తగిన ప్రోత్సాహాకాలను కల్పించాలి

పార్ట్ VI - ఆస్తులు,అప్పుల పంపకం(సెక్షన్స్‌ 47-67)
సెక్షన్ 47:
ఈ భాగం వర్తింపు
47(1): ఈ భాగంలోని నిబంధనలు నియమిత తేదీకి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి వర్తిస్తాయి
47(2): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి
47(3): రెండు రాష్ట్రాల అవసరాన్ని బట్టి ఆర్థిక సర్దుబాటుకు లోబడి ఆస్తులు, అప్పుల పంపకం జరగాలి
47(4): రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం విషయంలో సమస్యలు తలెత్తితే ‘‘భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’’ సలహాపై కేంద్రం పరిష్కరించాలి
సెక్షన్ 48: భూమి మరియు వస్తువులు
వివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు, అన్ని స్టోర్లు, సామాగ్రి, వస్తువులు...
ఎ) బదీలీ అయిన సరిహద్దు లోపల ఉంటే తెలంగాణ రాష్ట్రానికి
బి) ఇతర ఏ సందర్భంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి.
నోట్: 48(1): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని భూములు, అన్ని స్టోర్లు, సామాగ్రి, వస్తువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నెలకొని ఉంటే అట్టి ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంపకం చేయాలి.
48(2): ప్రత్యేక సంస్థలు, వర్క్‌షాప్‌లు, స్టోర్ లు... మొదలైన వాటిని అవి ఏ రాష్ట్రంలో నెలకొల్పి ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి
48(3): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అధికార పరిధి కలిగిన సచివాలయ శాఖాధిపతులను
సెక్షన్ 49: ఖజానా మరియు బ్యాంకు నిల్వలు
పంపిణీ ప్రాతిపదిక - జనాభా దామాషా
నోట్: ఈ పంపిణీ భారత రిజర్వ్ బ్యాంకు పుస్తకాల్లో రెండు రాష్ట్రాల పరపతి నిల్వలను సర్దుబాటు చేయడం ద్వారా భాగ నిర్ణయాన్ని అమలుపరచాలి. అంతేకానీ ట్రెజరీల ద్వారా నగదు బదిలీ చేయకూడదు
సెక్షన్ 50: పన్ను బకాయిలు
వివరణ: బకాయిలను వసూలు చేసే హక్కు సంబంధిత ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం కలిగి ఉంటుంది
సెక్షన్ 51: రుణాలు,అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు
51(1): రుణాలు, అడ్వాన్సులు పొందిన సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం సంబంధిత రుణాలు, అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు కలిగి ఉంటుంది
51(2): ఒకవేళ ఆ రుణాలు, అడ్వాన్సులు పొందిన సంస్థలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉంటే వాటిని వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంటుంది.
ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ వసూలు చేసిన రుణాలు, అడ్వాన్సులు ‘‘జనాభా ప్రాతిపదికన’’ రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.
సెక్షన్ 52: కొన్ని నిధులలో పెట్టుబడులు, పరపతులు
సెక్షన్ 53: రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులు
పంపిణీ ప్రాతిపదిక: స్థానిక సంస్థల ఆస్తులు, అప్పులు - అవి ఉన్న రాష్ట్రానికి
అంతరాష్ట్ర హోదా కల్గిన సంస్థల ప్రధాన కార్యాలయాలను ‘‘జనాభా ప్రాతిపదికన ‘‘ పంచాలి.
సెక్షన్ 54: ప్రజారుణం
వివరణ: జనాభా దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగాలి
సెక్షన్ 55: స్వల్పకాలిక రుణం
వివరణ: స్వల్పకాలిక రుణ ఉద్దేశ్యాలు నియమిత తేదీన లేదా ఆ రోజు నుంచి ఏర్పాటయ్యే రాష్ట్రాలలో ఏదైనా రాష్ట్రం నిమిత్తం అయినట్లయితే అప్పుడు ఆ రాష్ట్రానికే ఉండాలి
ఏదైనా ఇతర సందర్భాలలో దానిని జనాభా ప్రాతిపదికన పంచాలి
సెక్షన్ 56: అధికంగా వసూలు చేసిన పన్నులను వాపసుచేయుట
వివరణ: నియమిత తేదీ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికంగా వసూలు చేసిన పన్నులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంచాలి
సెక్షన్ 57: డిపాజిట్లు
వివరణ: నియమిత తేదీ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్వహించిన ఏవైనా పౌరడిపాజిట్‌లు, రుణనిధులు లేదా దాతృత్వ లేదా ఎండోమెంట్ సంస్థల నిధులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంచాలి
సెక్షన్ 58: భవిష్యనిధి
వివరణ: నియమిత తేదీ నాటికి సర్వీసులో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వితంగా ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో భవిష్యనిధి ఖాతా విషయంలో ఆ రోజు నుంచి ఉత్తరాధికారం పొందిన రాష్ట్రం బాధ్యత వహించాలి
సెక్షన్ 59: ఫించన్లు
వివరణ: చట్టంలోని 8వ షెడ్యూల్‌లోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాలు ఫించన్లను బదిలీ చేయాలి
సెక్షన్ 60: ఒప్పందాలు
సెక్షన్ 61: చర్య తీసుకోదగిన తప్పు చేసినట్లయితే బాధ్యత
వివరణ: సంబంధిత చర్య ఏ రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతంలో జరిగి ఉంటే ఆ రాష్ట్రమే బాధ్యత వహించాలి.
ఇతర సందర్భాలలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపదికన పంపకాలు జరగాలి
సెక్షన్ 62: పూచీదారుని బాధ్యత
వివరణ: రాష్ట్రం లోపల జరిగిన పూచీకత్తు సందర్భాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే బాధ్యత వహించాలి
ఇతర ఏదైనా సందర్భాలలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన విధంగా జనాభా ప్రాతిపదికన పంపకాలు జరగాలి
సెక్షన్ 63: అనిశ్చిత స్థితిలో ఉన్న అంశాలు
సెక్షన్ 64: అవశేష నిబంధన
సెక్షన్ 65: ఆస్తులపంపకం లేదా ఒప్పందం వలన బాధ్యతలు
సెక్షన్ 66: కొన్ని సందర్భాలలో కేటాయింపు లేదా సర్దుబాటు చేయడంలో కేంద్రప్రభుత్వానికి గల అధికారం
సెక్షన్ 67: సంచితనిధి పై ఛార్జీ చేసే కొన్ని వ్యయాలు

పార్ట్ VII - కొన్ని కార్పోరేషన్లకు సంబంధించిన నియమాలు (సెక్షన్స్‌68-75):
సెక్షన్ 68: వివిధ కార్పోరేషన్లు, కంపెనీలకు సంబంధించిన నిబంధనలు
వివరణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పాటైన కంపెనీలు,కార్పోరేషన్లు నియమిత తేదీ నుంచి కూడా అదే ప్రాంతంలో కొనసాగాలి. కార్పోరేషన్ల ఆస్తులు,హక్కులు, బాధ్యతలు రెండు రాష్ట్రాల మధ్య పంచాలి
సెక్షన్ 69: విద్యచ్చక్తి ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకు, నీటి సరఫరా కొనసాగించడానికి నియమాలు
సెక్షన్ 70: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ
వివరణ: రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం - 1951లోని 63వ చట్టం ప్రకారం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ప్రస్తుతం మాదిరిగానే నియమిత తేదీ తరువాత కూడా కేంద్రప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ ఉంటుంది
సెక్షన్ 71: కొన్ని కంపెనీలకోసం నిబంధనలు
సెక్షన్ 72: ప్రస్తుతమున్న రోడ్డు రవాణా పర్మిట్లను కొనసాగించడానికి తాత్కాలిక నిబంధనలు
సెక్షన్ 73: తొలగింపు నష్టపరిహారానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు
సెక్షన్ 74: ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రత్యేక నిబంధన
సెక్షన్ 75: కొన్ని రాష్ట్ర సంస్థలకు సౌకర్యాల కొనసాగింపు

పార్ట్ VIII - సర్వీసులకు సంబంధించిన నియమాలు(సెక్షన్స్‌ 76-83)
సెక్షన్ 76: అఖిలభారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలు
వివరణ: రాష్ట్ర క్యాడర్ అంటే...
  • ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐఎఎస్
  • ఇండియన్ పోలీస్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐపీఎస్
  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నియమావళి-1954 ప్రకారం ఐఎఫ్‌ఎస్
సెక్షన్ 77: ఇతర సర్వీసులకు సంబంధించిన నిబంధనలు
సెక్షన్ 78: సర్వీసు నియమాలు
వివరణ: సర్వీసు వ్యవహారాలు, విఙ్ఞప్తులు, వివాదాలు పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి నియమిత తేదీ నుంచి 30 రోజులలోపు కేంద్రం సలహాసంఘాలను నియమిస్తుంది
సెక్షన్ 79: అదే పదవిలో అధికార్ల కొనసాగింపునకు నిబంధన
సెక్షన్ 80: సలహాసంఘాలు
సెక్షన్ 81: ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి గల అధికారం
సెక్షన్ 82: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు నిబంధన
వివరణ: నియమిత తేదీ నుంచి రాష్ట్రప్రభుత్వరంగ సంస్థలలోని, కార్పోరేషన్లు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలోని ఉద్యోగులు అట్టి ప్రభుత్వరంగ సంస్థలలోని ఉద్యోగాలలో ఒక సంవత్సరం పాటు కొనసాగుతారు. ఈ సమయంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు పై రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకానికి విధివిధానాలను రూపొందిస్తాయి
సెక్షన్ 83: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిబంధనలు
వివరణ: నియమిత తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కొనసాగుతుంది.
తెలంగాణకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి అనుమతితో యూపీఎస్సీ విధులు నిర్వహిస్తుంది.

పార్ట్ IX- జలవనరుల నిర్వహణ,అభివృద్ధి(సెక్షన్స్‌ 84-91)
సెక్షన్ 84: గోదావరి,కృష్ణా నదీజలాల వనరులు,వాటి నిర్వహణ మండళ్ళకు అపెక్స్ కౌన్సిల్ (శిఖరాగ్ర మండళి) ఏర్పాటు
84(1): గోదావరి,కృష్ణా నదీజలాల వనరనలు,వాటి నిర్వహణ మండళ్ళ పనితీరుని పర్యవేక్షించడం కోసం కేంద్రప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ (శిఖరాగ్ర మండళి) ఏర్పాటు చేస్తుంది
84(2): ఈ అపెక్స్ కౌన్సిల్ కు
ఎ)ఛెర్మైన్: కేంద్ర జలవనరుల మంత్రి
బి)ఒక సభ్యుడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
సి)మరొక సభ్యుడు: తెలంగాణ ముఖ్యమంత్రి
84(3): అపెక్స్ కౌన్సిల్ విధులు:
i)గోదావరి,కృష్ణా నదుల మండళ్ళ నిర్వహణ బాధ్యతలను చేపట్టడం
ii)అవసరమైన సంధర్భాలలో కృష్ణా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం నదీ నిర్వహణ మండళ్ళు,కేంద్ర జలసంఘం చేసిన ప్రతిపాదనలపై ప్రణాళిక రూపొందించడం,ఆమోదించడం
iii)కొత్తగా ఏర్పడే రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ పై ఏదైనా వివాదం తలెత్తితే సంప్రదింపుల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకొని పరిష్కరించడం
iv)కృష్ణా నదీజలాల వివాదైల పరిష్కార ట్రిబ్యునల్ పరిధిలో లేని వివాదాలను అంతరాష్ట్ర నదీ
జలవివాదాల చట్టం: 1956 ప్రకారం ఏర్పాటు చేయబడే ట్రిబ్యునల్ కు రెఫర్ చేయడం
సెక్షన్ 85: జల నిర్వహణ మండళి ఏర్పాటు,విధులు
85(1).రాష్ట్రం ఏర్పాటైన 60 రోజుల్లోగా ప్రస్తుత,భవిష్యత్ లో వచ్చే ప్రాజెక్టుల పరిపాలన,క్రమబద్ధీకరణ,నిర్వహణ,పనితీరు పర్యవేక్షణకు కేంద్రప్రభుత్వం విడిగా గోదావరి జల నిర్వహణ మండలి,కృష్ణా జల నిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తుంది.
85(2) గోదావరి జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం తెలంగాణలో, కృష్ణా జల నిర్వహణ మండలి ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తారు.
85(3) ఈ రెండు బోర్డులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తాయి
85(4) జల నిర్వహణ మండలి బోర్డు ఛెర్మైన్ మరియు సభ్యులుం
ఎ)ఛెర్మైన్: భారత ప్రభుత్వ కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి హోదా గల వ్యక్తి(కేంద్ర నియామకం)
బి)ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించే ఇద్దరు సభ్యులు.ఒకరు చీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని సాంకేతిక నిపుణుడు;మరొకరు పరిపాలనా రంగ నిపుణుడు
సి)కేంద్రం నియమించే ఇంకొక నిపుణుడు
85(5).బోర్డు యొక్క పూర్తిస్థాయి సభ్యకార్యదర్శి: కేంద్రజలవనరుల సంఘం ఛీఫ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని వ్యక్తి(కేంద్ర నియామకం)
85(6). కేంద్ర జలసంఘంలో అవసరమైనన్ని ఛీఫ్ ఇంజనీర్ స్థాయి పోస్టులను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలి
85(7).రిజర్వాయర్ల రోజువారి నిర్వహణ కోసం బోర్డులు కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సహాయం చేసుకుంటాయి.ఆ విధివిధానాలను కేంద్రం నిర్దేశిస్తుంది.
85(8)బోర్డుల విధులు:
ఎ)కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటిసరఫరా నియంత్రణ
i) అంతరాష్ట్ర నదీ జలవివాదాల చట్టం: 1956 కింద ఏర్పడిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా..
ii)ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంతో ఏదేనీ రాష్ట్రం లేదా కేంద్రపేరాంతపాలిత ప్రాంతం తో జరిగిన ఒప్పందాలు,ఏర్పాట్లకు అనుగుణంగాం.
బి)ఆయా సంస్థలకు విద్యుత్ సరఫరాను నియంత్రించడం
సి) కొత్తగా ఏర్పడే రాష్ట్రాల నదులు,వాటి ఉపనదులపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను మదింపు చేయడం
డి)గోదావరి,కృష్ణా నదులపై ఇప్పటికే నిర్మించిన, నియమిత తేదీనాటికి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు నష్టం కలగదని, జలవివాద ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం కలగదని నిర్ధారించుకున్నాక,నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సాంకేతిక ఆమోదం తెలపడం
ఇ)11 వ షెడ్యూల్ లో పేర్కొన్న అంశాల ప్రాతిపదికన కేంద్రం అప్పగించే ఇతర కర్తవ్యాలు
సెక్షన్ 86: బోర్డు సిబ్బంది
నోట్: బోర్డు సిబ్బంది యొక్క జీతభత్యాల నిష్పత్తిని కేంద్రం నిర్ణయించిన మేర రెండు రాష్ట్రాలు భరించాలి
సెక్షన్ 87: మండలి పరిధి
నోట్: గోదావరి,కృష్ణా బోర్డుల పరిధి ఆ రెండు నదులకు విస్తరించి ఉంటుంది.
ఇందులో ఏదైనా సమస్య ఉంటే దాని నివృత్తికి కేంద్రానికి పంపిస్తారు
సెక్షన్ 88: మండలి అధికారం
ఎ)సమావేశ సమయం,స్థలం,నిర్వహణా పద్దతిని నిర్ణయించుకోవడం
బి)బోర్డు ఛెర్మైన్ లేదా అధికారి అధికారాలను దఖలు పరచడం
సి)అధికారులు, సిబ్బంది నియామకాలు, విధి విధానాలను నిర్ణయించడం
డి)అవసరమైన ఇతర నిబంధనలను రూపొందించుకోవడం
సెక్షన్ 89: నీటి వనరుల కేటాయింపు
నోట్: కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ గడువు కింది విధివిధానాలతో పొడిగించబడుతుంది.
ఎ)ఇప్పటి వరకు ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు చేయని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడం
బి)నీటి ప్రవాహం తగ్గిన సందర్భాలలో ఆయా ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు విధివిధానాలను నిర్ణయించడం.
సెక్షన్ 90: జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు
90(1). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమైనది
90(2). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి,నియంత్రణను కేంద్రం చేపడుతుంది
90(3). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం తన ఆమోదాన్ని తెలియచేసినట్టే భావించాలి
90(4). పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల పర్యావరణ,అటవీ,పునరావాస,పునర్నిర్మాణ నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను పొంది కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.
సెక్షన్ 91: తుంగభద్ర బోర్డు ఏర్పాటు
వివరణ: ఈ బోర్డులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి.
ఈ బోర్డు పర్యవేక్షించే పథకాలు: హై లెవల్ కెనాల్,లో లెవల్ కెనాల్,రాజోలి బండ మళ్ళింపు పథకాలు

పోలవరం ప్రాజెక్టు: ముఖ్యమైన సమాచారం
  • పోలవరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ!
  • గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు.
  • ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవడం లేదు. అనేక ఒడుదొడుకుల మధ్య పయనిస్తోంది.
  • సకాలంలో నిధులు ఇవ్వడం లేదంటోంది రాష్ట్రం. ఇచ్చినవాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది.
  • ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏమిటి?
ఇలా ప్రారంభం..
  • పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది.
  • 1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
  • ఈ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు.
  • దీని అంచనా వ్యయం రూ.129 కోట్లు.
  • విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు.
  • పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడం.
  • విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు.
వెనకడుగు :
  • రామపాదసాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణపరంగా అడుగు ముందుకు పడలేదు.
  • ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
  • ఒకటి వ్యయం.. రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత.
  • పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు.
  • డ్యాం కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం ఉండటం లేదు. మరోవైపు కొండలు, గుట్టలు ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు.
1953 వరదలు :
  • 1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది.
  • మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి.
  • దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది.
  • ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు :
  • బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం..
  • పూర్తి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం
  • స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు
  • పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతు న్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి.
  • 1976లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
  • 1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
  • అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు.
  • 1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు.
  • ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది.
  • నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు.
పోలవరం మౌలిక స్వరూపం :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి.
  1. రిజర్వాయర్
  2. స్పిల్‌వే
  3. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
రిజర్వాయర్: ఇందులో నీటిని నిల్వ చేస్తారు.
స్పిల్‌వే: రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్‌వే ఉపయోగడుతుంది. రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు.
కాలువలు: రిజర్వాయర్‌కు రెండు కాలువలు ఉంటాయి. ఒకటి కుడి వైపు. రెండోది ఎడమ వైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు.
ఆనకట్ట: ఇది రిజర్వాయర్ ఆనకట్ట. ఇందులో అనేక భాగాలున్నాయి.
డయాఫ్రం వాల్.. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ. నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడు తుంది. దీని పొడవు 2.454 కిలోమీటర్లు.
రాతి, మట్టి కట్టడం.. డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా రాతి, మట్టి కట్డడం (ఎర్త్-కం-రాక్ ఫిల్ డ్యాం) నిర్మిస్తారు.
కాఫర్ డ్యాం: ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యాం అంటారు.
  • పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యామ్‌లు ప్రతిపాదించారు.
  • నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువున ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఇలా..
  • రామపాదసాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువున పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
  • 2,454 మీటర్ల పొడవైన ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యాం, 1,128 మీటర్ల పొడవైన స్పిల్ వేను నిర్మించేందుకు నిర్ణయించారు.
ఎడమ కాలువ: 181.50 కిలోమీటర్ల పొడవు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి తాగు నీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జలరవాణాకు కూడా ఉపయోగించనున్నారు.
కుడి కాలువ: 174 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.
  • అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించనున్నారు.
జలవిద్యుత్: 960 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
ప్రయోజనాలు..
  • విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చనున్నారు.
  • విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు.
  • విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందించనున్నారు.
  • కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.
నిధులు-వ్యయం :
  • 2017 ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది.
  • 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.58,319 కోట్లకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తం వ్యయంలో పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా.
జాతీయ ప్రాజెక్ట్ :
  • పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.
  • 2017 జనవరి నాటికి పోలవరంపై రూ.8,898 కోట్లు ఖర్చు పెట్టారు.
  • జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు రూ.3,349.70 కోట్లు.
  • 2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు.
  • పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు.
  • 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది.
  • అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చు అయితే దానిని రాష్ట్రమే భరించాలి.
అనుమతులు..
  • పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2004లో ప్రారంభమైంది.
  • 2005లో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి.
  • గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజనశాఖ అనుమతులు 2007లో లభించాయి.
  • అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి.
ముంపు ప్రాంతం :
  • ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్‌గఢ్‌లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 3427.52 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది.
  • రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురవుతున్న మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
  • అవి భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, భద్రాచలం మండలాలు.. పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలాలు.
ఎత్తిపోతల పథకాలు :
  • పోలవరం భారీ ప్రాజెక్టు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ఇందులో భాగంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది.
  • ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్‌లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
  • వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.
పట్టిసీమ: పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది.
పురుషోత్తమపట్నం: రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు. (ఆధారం: లోక్‌సభ, రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ)

పార్ట్ X: మౌళిక సదుపాయాలు,ప్రత్యేక ఆర్థిక చర్యలు(సెక్షన్స్‌ 92: 94)
సెక్షన్ 92: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మూలసూత్రాలు,మార్గదర్శకాలు మొదలగు వాటిని కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అనుసరించాలి
సెక్షన్ 93: కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి, అభివృద్ధి కోసం చర్యలు
సెక్షన్ 94: పన్ను ప్రోత్సాహకాలతో సహా ఆర్థిక చర్యలు
94(1).రెండు రాష్ట్రాలలోనూ పారిశ్రామికీకరణను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఏర్పడే రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహాకాలతో సహా తగు విధమైన ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకొనవలెను
94(2).భౌతిక,సాంఘిక పరమైన మౌళిక వనరులు విస్తరణతో సహా ఏర్పడే రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేయాలి
94(3).రాజ్ భవన్,హైకోర్టు,ప్రభుత్వ సచివాల యం,శాసనసభ,శాసనమండలి,అవసరమైన ఇతర మౌళిక సదుపాయాలతో సహా కొత్తగా ఏర్ప డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసర మైన సౌకర్యాల ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి
94(4). కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని భావిస్తే శిథిలమైన అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించాలి

పార్ట్ XI: అందుబాటులో ఉన్నతవిద్య(సెక్షన్ 95)
సెక్షన్ 95:
విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యలో సమాన అవకాశాలు
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ల కోటా పదేళ్ళకు మించకుండా కొనసాగించ వలెను.ఆకాలంలో ప్రస్తుతమున్న ఉమ్మడి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగవలెను

పార్ట్ XII: న్యాయ మరియు వివిధ సంబంధ నిబంధనలు(సెక్షన్స్‌ 96: 108)
సెక్షన్ 96: రాజ్యాంగంలో ఆర్టికల్ 168 కు సవరణ
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 యొక్క క్లాజ్: (1)లోని ఉప క్లాజ్ -(ఎ) లో ‘తమిళనాడు’ అనే పదానికి బదులు ‘‘తమిళనాడు, తెలంగాణ ‘‘అనే పదాలను చేర్చాలి
సెక్షన్ 97: రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డి కు సవరణ
సెక్షన్ 98: 1951 సంవత్సరపు 43వ నెంబరు చట్టంలోని సెక్షన్ 15కు సవరణ
సెక్షన్ 99: 1956 సంవత్సరపు 37వ నెంబరు చట్టం లోని సెక్షన్ 15ఎ కు సవరణ
సెక్షన్ 100: చట్టాలను ప్రాదేశిక విభాగాలను విస్తరించుట
సెక్షన్ 101: చట్టం అనుసరణకు అధికారం
సెక్షన్ 102: చట్టాలను అన్వయించుకోవడానికి అధికారం
సెక్షన్ 103: చట్టబద్ద విధులను నిర్వర్తించడం కోసం అథారిటీలు మొదలైన వాటికోసం పేర్లు పెట్టే అధికారం
సెక్షన్ 104: న్యాయసంబంధ ప్రొసీడింగులు
సెక్షన్ 105: పెండింగ్ ప్రొసీడింగుల బదిలీ
సెక్షన్ 106: కొన్ని కేసులలో ప్రాక్టీసు చేయడానికి న్యాయవాదులకు హక్కులు
సెక్షన్ 107: ఇతర చట్టాలకు అసంగతంగా ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబం దనల ప్రభావం
సెక్షన్ 108: సంకటాలను తౌలగించే అధికారం
Published date : 28 Feb 2019 08:36PM

Photo Stories