Skip to main content

Ravi Aruna: సైన్స్‌ ఎక్కడో లేదు... యాసిడ్‌ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కానూరు ‘జిల్లా పరిషత్‌ హైస్కూల్‌’ ఫిజిక్స్‌ టీచర్‌ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సునీతారావు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు.
Ravi Aruna Selected for National Best Teachers Award
రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా

‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్‌ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్‌ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్‌ పోస్టింగ్‌ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్‌ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్‌ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ టెక్నాలజీస్‌ మీద పీహెచ్‌డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్‌ లో మరో పీహెచ్‌డీ చేస్తున్నాను.

చదవండి: Famous Personalities: గురువుని మించిన శిష్యులు వీళ్లే..?

ప్రత్యామ్నాయం వెతకాలి!

సైన్స్‌ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్‌ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్‌ అలా ఫెయిల్‌ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్‌ మస్కిటో రిపెల్లెంట్‌ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్‌ ఎడ్యుకేషన్‌కి వాటర్‌ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్‌ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్‌ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్‌ సిటిజన్‌ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది.
– రావి అరుణ, ఫిజిక్స్‌ టీచర్, జిల్లా పరిషత్‌ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా

చదవండి: Real Story: నాడు కూలీ..నేడు టీచ‌ర్

Published date : 29 Aug 2022 05:21PM

Photo Stories