Anudeep Durishetty: విద్యార్థులు పరీక్షలు తప్పితే..టీచర్లదే బాధ్యత

సాక్షి,సిటీబ్యూరో: పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే సంబంధిత ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి స్పష్టం చేశారు.

 జ‌నవ‌రి 4న‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం కంటే అత్యు త్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. విద్యార్థి 10వ తరగతి లో పాస్‌ అయితేనే జీవితంలో మెరుగైన స్థితిలో ముందుకు సాగుతాడన్నారు.

గతంలో కంటే పాఠశాలల్లో వనరులు మెరుగుపడ్డాయని, విద్యార్థులు ఎంత వెనకబడి ఉన్నా మెరుగైన శిక్షణ ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలగుతారన్నారు. వందకు వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి పాస్‌ అయ్యేలా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినా విద్యార్థులు ఫెయిలైతే అది మనలోపమేనన్నారు. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో జిల్లా పూర్తిగా వెనుకబడిందని.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నించాలన్నారు. గురువులకు తన శిష్యుడు ఉన్నత స్థానానికి వెళితే ఎంత గౌరవమని, అదే ఫెయిలైతే అవమానంగా భావించాలన్నారు. ఉత్తీర్ణత పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. డిప్యూటీ ఈవోలు, డీఐలు వంద శాతం శ్రద్ధతో పని చేస్తే ఫలితాలు వస్తాయని,వచ్చే 70 రోజుల్లో శ్రద్ధగా కృషి చేస్తే ఫలితం సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాన సబ్జెక్టుల్లోనే వెనుకబాటు

విద్యార్థులు అత్యధిక శాతం మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లోనే వెనుకబడి ఉన్నారని, ఆలాంటి వారిపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఫలితం ఉంటుందని కలెక్టర్‌ సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ఎక్కువగా స్లిప్‌ టెస్టులు, మాక్‌ టెస్ట్‌లు నిర్వహించి వాటిపై రివిజన్‌ చేస్తే విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షల భయం పోతుందన్నారు.

రివిజన్‌ చేస్తే విద్యార్థి మరిచిపోడని ప్రాక్టీస్‌ ఎక్కువగా చేయించేలా ప్రోత్సహించాలన్నారు. డిప్యూటీఈవో లు, డీఐఓ లు పర్యవేక్షణలతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వెనుకబాటుపై చర్చించి వారికి సూచనలు చేయాలన్నారు.

ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సమావేశంలో డీఈఓ రోహిణి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

#Tags