TS Government Jobs 2024 : ఎవ‌రు అడ్డువ‌చ్చినా.. ఈ ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇలా.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల పండ‌గ మ‌ళ్లీ మొద‌లైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ ఏడాదికాలంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

పోలీసుశాఖలో త్వరలో 15 వేల ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపడతామని, పోలీసు నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. 

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ద్వారా...
తెలంగాణ వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 5000 ఉద్యోగాలకు కూడా ప్రకటనలు ఇస్తామని.. తర్వాత తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. 

మేం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న..
నిరుద్యోగుల కలల సాకారమే తెలంగాణ రాష్ట్రమని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లపాటు నిరుద్యోగులు దగాపడ్డారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. గ‌త ప్రభుత్వంలో కేవలం కేసీఆర్‌ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టడంతో రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేశామ‌ని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టామని, కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు, భర్తీ ప్రక్రియపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో 6,956 మందికి స్టాఫ్‌ నర్స్‌ నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. 

ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి..
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఇంత పెద్ద సంఖ్యలో స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల భర్తీ గొప్ప విషయమన్నారు. ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు.

కొత్తగా నియమితులైన స్టాఫ్‌ నర్సుల్లో 88 శాతం వీరే..
కొత్తగా నియమితులైన స్టాఫ్‌ నర్సుల్లో 88 శాతం మహిళలు ఉండటం ఆనందంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్య విభాగానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి విద్య, వైద్యం, సంక్షేమం ఎంతో కీలకమని.. తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వేగంగా స్టాఫ్‌ నర్సు నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఎందరు డాక్టర్లు వచ్చినా రోగికి దగ్గరగా ఉండి సేవలు అందించేది నర్సులేనని చెప్పారు. 

#Tags