Asha Workers Salary Hike : కనీస వేతనం రూ.18 వేలు ఇవాల్సిందే.. అలాగే ప్రమోషన్ కూడా..
ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ ఆశావర్కర్స్ యూనియన్ నాయకురాలు లత మాట్లాడుతూ, అధిక పనిభారం మోపుతున్న ప్రభుత్వం తమ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. 18 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ జీతం, అదీ సమయానికి రాకపోవడంతో ఎలా బతకాలని ప్రశ్నించారు.
ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో..
డిసెంబర్, జనవరి పెండింగ్ జీతంతో పాటు కనీస వేతనం రూ.18వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అభయహస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఏఎన్సీ డెలివరీల పేరుతో టార్గెట్లు పెట్టి వేధించొద్దని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్ అవకాశం కల్పించాలన్నారు. జాబ్ చార్ట్ విడుదల చేసి పనిభారం తగ్గించాలని కోరారు. అనంతరం జగిత్యాల కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు.