Formative Assessment Exams: ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం

కర్నూలు సిటీ: జిల్లాలోని పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు సోమవారం నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీన ప్రారంభమైంది.
ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం

అకడమిక్‌ ప్లానింగ్‌ ప్రకారం జూన్‌, జూలై నెలల్లో విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌ను పూర్తి చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకుని సరిదిద్దేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఉదయం 1 నుంచి 8వ తరగతులకు చెందిన విద్యార్థులకు క్లాస్‌రూం బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ) విధానంలో, 9,10 తరగతులకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. తర్వాత పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సామర్థ్యాలను పెంచేందుకు పరీక్షల విభాగం చర్యలు తీసుకుంటుంది.

రెండు భాషల్లో ప్రశ్నపత్రాలు

ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్యను అందిస్తున్నారు. అయితే, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు, ఇంగ్లిష్‌ విధానంలో పాఠ్యపుస్తకాలను అందించి టీచర్లతో రెండు భాషల్లో బోధన చేయిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఏ ప్రశ్నపత్రాలను సైతం రెండు భాషల్లో ఇస్తున్నారు. జిల్లాలో 2,239 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

#Tags