Vacancies In High Courts: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7, తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.
దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
Recruitment Drive: ఐటీఐలో ఈనెల 18న క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్..
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేసింది.
దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
ఆ తర్వాత పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 1,250, గుజరాత్లో 535, బిహార్లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.