NEET 2024: ప్రశాంతంగా ‘నీట్‌’.. ఈసారి కటాఫ్‌ మార్కులు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినా, ఒక సెంటర్‌లో మాత్రం అన్యాయం జరిగిందని విద్యార్థులు వాపోతున్నారు.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఒక రూంలో నీట్‌ పరీక్ష పేపర్‌ను 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. దీనిపై ఆయా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక అనేక సెంటర్ల వద్ద విద్యార్థులు ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. మధ్యమధ్యలో ఇన్విజిలేటర్లు విద్యార్థులను రాసుకోనీయకుండా ఏదో ఒక సమాచారం అడుగుతూ అంతరాయం కలిగించారని చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 80 వేల మంది పరీక్ష రాశారు.  

చదవండి: College Predictor - 2024 - AP EAPCET TS EAMCET

ఫిజిక్స్‌ డిసైడింగ్‌ సబ్జెక్టు అవుతుంది 

గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి నీట్‌ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని శ్రీచైతన్య కాలేజీ డీన్‌ శంకర్‌రావు విశ్లేషించారు. ’’గతంలో పేపర్లు అన్నీ సులువుగా ఉండేవి. ఫిజిక్స్‌ పేపర్‌ గత మూడేళ్లుగా సులువుగా ఇచ్చేవారు. ఈసారి కఠినంగా ఉంది. గతంలో కెమిస్ట్రీలో స్పష్టత లేని ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి కెమిస్ట్రీ ఈజీగానే ఉంది. ఫిజిక్స్‌లో థియరీ ప్రశ్నలు ఇచ్చారు. అవి కూడా కన్‌సెప్షివల్‌గా కొంచెం ట్విస్టింగ్‌గానే వున్నాయి.

నార్మల్‌ స్టూడెంట్లు, మెరిట్‌ వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. నాలుగైదు ప్రశ్నలు తప్పు రాసేవిగా గందరగోళంగా ఉన్నాయి. చాలా మంది ఫిజిక్స్‌ లెంథీగా ఫీల్‌ అయ్యారు. ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు సమాధానాలు కన్ఫ్యూజన్‌గా ఉన్నాయి. ఏ ఆప్షన్‌ కరెక్ట్‌ అనేది గందరగోళంగా మారింది.

బాటనీ, జువాలజీ సబ్జెక్టులలో ప్రశ్నపత్రాలు సులువుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఫిజిక్స్‌ తప్ప మిగతా మూడు సబ్జెక్టులు ఎక్కువమంది ఈజీగా ఆన్సర్‌ చేసేలాగా ఉన్నాయి కాబట్టి మెరిట్‌ విద్యార్థులకు ర్యాంకు డిసైడ్‌ చేయటానికి ఫిజిక్స్‌ డిసైడింగ్‌ సబ్జెక్టు అవుతుంది.

ఎక్కువమంది విద్యార్థులు బయాలజీ అండ్‌ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్‌ చేస్తారు. కాబట్టి సామాన్య విద్యార్థులకు పెద్దగా తేడా ఉండదు.’’అని ఆయన అభిప్రాయపడ్డారు 

కటాఫ్‌ మార్కు పెరుగుతుంది..

గతంలో 450 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చింది. ఈసారి కూడా 430–440 మధ్య మార్కులు వస్తే సీటు రావొచ్చు. గతేడాది జనరల్‌ కటాఫ్‌ 137... ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 107గా ఉంది.

ఈసారి జనరల్‌ కటాఫ్‌ 145... ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 115 వరకు ఉండొచ్చని శంకర్‌రావు తెలిపారు. దేశ వ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ ఏడాది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.   

#Tags