Job Mela: రేపు జాబ్మేళా.. జీతం నెలకు రూ.20 వేల వరకు
మచిలీపట్నంటౌన్: ఈ నెల 20న స్థానిక పాత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పట్టాభి మెమోరియల్ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థలో జిల్లా ఉపాధి కల్పన శాఖ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాను ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడ్ ప్లస్, రవి కన్స్ట్రక్షన్, కొటక్ బ్యాంక్, టెక్రో టాస్క్, ఓజోన్ సెక్యూరిటీ, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని పదవ తరగతి, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.
పూర్తి బయోడేటా, ధ్రువ పత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.12 వేల నుంచి రూ.20వేల వరకు వేతనం లభిస్తుందని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 81424 16211 నంబర్ కు వాట్సప్ కాల్ చేయాలన్నారు.