Admissions in Model school: మోడల్‌ స్కూల్‌ పిలుస్తోంది..

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కార్పొరేట్‌ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొన్నేళ్ల కిందట మోడల్‌ స్కూళ్లను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలతో వసతి కల్పించడమే కాక ఇంగ్లిష్‌ మీడియం విద్య బోధిస్తున్నారు. కేవలం పాఠాలకే పరి మితం కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో ప్రవేశా నికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉమ్మడి జిల్లా లో కారేపల్లి, పెనుబల్లి మండలాల్లో మాత్రమే మోడల్‌ స్కూళ్లు ఉండగా.. ప్రస్తుతం ఇందులో 1,214 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఆరో తరగతిలో ప్రవేశం
మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు బోధన సాగుతోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో తరగతికి వంద సీట్లు ఉంటాయి. అయితే, ఆరో తరగతిలో మాత్రమే పరీక్ష ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. అనంతరం పదో తరగతి వరకు చదువుకోవచ్చు. కాగా, మిగతా తరగతుల్లో ఎవరైనా విద్యార్థులు వెళ్లిపోతే ఆ సీట్లు ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇక పదో తరగతిలో ఉత్తమ జీపీఏ సాధించిన వారికి ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌లు, ఒక్కో గ్రూప్‌లో 40 మందిని తీసుకుంటారు. కాగా, మోడల్‌ స్కూళ్లలో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుండగా.. హాస్టల్‌ వసతి మాత్రం ఇంటర్‌ చదివే విద్యార్థినులకే మాత్రమే ఉంటుంది.

చదవండి: Admissions in Telangana Model Schools: ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు
2024 – 25వ విద్యాసంవత్సరానికి మోడల్‌ స్కూల్‌లో ప్రవేశం పొందాలనుకునేవారు https://telanganams.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌కార్డు వివరాలు నమోదు చేయాలి. రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. మిగతా తరగతుల్లో ఖాళీ సీట్లకు సైతం ప్రవేశపరీక్ష ద్వారానే అవకాశమిస్తారు. ఇక అనంతరం ఎస్సెస్సీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులైతే రూ. 125, ఇతరులైతే రూ.200ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మూడు రోజులే గడువు
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశపరీక్ష కోసం విద్యార్థులు ఈ నెల 22వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్‌ 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల జాబితా ను మే 25న విడుదల చేసి, మే 27 నుంచి 31వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి
ఆసక్తి కలిగిన విద్యార్థులు మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభు త్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 22వరకు అవకాశం ఉంది.
– ఈ.సోమశేఖరశర్మ, డీఈఓ, ఖమ్మం
 

#Tags