TAFRC: అధికఫీజు వసూలుపై ఎఫ్ఆర్సీ కొరడా
ఇటీవల జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల్లో దాదాపు 20కిపైగా ప్రైవేటు కాలేజీలు నిర్ణితఫీజు కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఎఫ్ఆర్సీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ మేరకు సంబంధిత కాలేజీల యాజమాన్యాలకు కమిటీ నోటీసులిచ్చి వివరణ కోరినట్టు తెలిసింది. కాలేజీల వివరణల్లో సహేతుకమైన వాదనలేదని గుర్తించడంతో భారీ జరిమానాలకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే, కాలేజీల వివరాలుగానీ, ఎంత జరిమానా విధించబోతున్నారనే విషయంగానీ ఎఫ్ఆర్సీ వర్గాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ‘ఈ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడివన్నీ బయటపెట్టలేం’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రతీ నాలుగేళ్లకోసారి కాలేజీల ఫీజును ఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. అవి సమరి్పంచే ఆడిట్ నివేదికల ఆధారంగా ఆదాయవ్యయాలను తెలుసుకుంటుంది.
చదవండి: తగ్గాల్సిందే... తగ్గేదేలే.. ఎఫ్ఆర్సీ ఎదుట 20 కాలేజీల వాదన
2019లో నిర్ధారించిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2023 నుంచి కొత్త ఫీజు నిర్ధారణకు 2022లో చేపట్టిన ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది. మూడుదఫాలు ఆదాయవ్యయ నివేదికలను పరిశీలించారు. అనంతరం ఫీజులను ఖారారు చేశారు. ఇంతకుమించి ఎక్కువ వసూలు చేస్తే ప్రతీ విద్యారి్థకి రూ.2 లక్షల చొప్పున కాలేజీ యాజమాన్యానికి జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ క్రమంలో 20కిపైగా కాలేజీలు నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఫీజు వసూలు చేసినట్టు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కమిటీ వివరణ కోరినప్పుడు ఇతర ఖర్చుల కింద(లేబొరేటరీ, లైబ్రరీ, ఉపాధి శిక్షణ) పేరుతో వీటిని వసూలు చేసినట్టు కాలేజీలు తెలిపినట్టు సమాచారం. ఇవి కూడా వార్షిక ఫీజులోనే మిళితమై ఉంటాయని ఎఫ్ఆర్సీ భావించినట్టు తెలిసింది. త్వరలో ఈ కాలేజీలకు భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది.
చదవండి: College Fee: ఇంజినీరింగ్ కాలేజీలు మరో 15% ఫీజులు పెంపు !