AP TET, DSC Update News 2024 : ఏపీ టెట్‌, డీఎస్సీ-2024ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ప్రిపరేషన్‌కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే టెట్‌, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. 

16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ ఫైల్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించిన‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా తెస్తుంది.

ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు..
ఎన్నికలకు ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు ప్రస్తుత‌ డీఎస్సీకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు.  అలాగే వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

#Tags