IAS and IPS Ranker Success Stories : ఫెయిల్స్ అయ్యాం.. కానీ పట్టు పట్టాం ఇలా.. సివిల్స్లో ర్యాంకులు కొట్టాం ఇలా...
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఉద్యోగం సాధించిన వారికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాగే వీరు ప్రభుత్వంలో పెద్ద హోదాలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఉద్యోగం సాధించిన కొందరి సక్సెస్ స్టోరీలు మీకోసం...
ఎలాంటి శిక్షణకు వెళ్లకుండా సొంతంగా రోజుకు..
నా పేరు ప్రకార్గుప్తా. మాది ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గురుగంజ్ జిల్లా సుసినీ గ్రామం. నాన్న చతుర్బుజ్ గుప్తా వ్యాపారి. అమ్మ కామిణి గృహిణి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యనభ్యసించా. చదువు పూర్తయిన వెంటనే సివిల్స్పై దృష్టి సారించా. మొదటి రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. అయినా నిరాశ చెందలే. మరింత పట్టుదలతో ప్రయత్నించా. పొరపాట్లు సవరించుకుంటూ మూడో ప్రయత్నంలో విజయం సాధించా.
2024 సివిల్స్ ఫలితాల్లో ఐదో ర్యాంకు సాధించి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్కు ఎంపికయ్యా. ఎలాంటి శిక్షణకు వెళ్లకుండా సొంతంగా రోజుకు 10 నుంచి 11 గంటలు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించా. కేంద్రం నన్ను ఏ రాష్ట్రంలో కేటాయించినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తా.
టాపర్ల సక్సెస్ స్టోరీలను యూట్యూబ్లో చూస్తూ.. సివిల్స్ సాధించా..
నా పేరు రోషణ్ మీనా. మాది రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాలోని నటాటా గ్రామం. నాన్న బద్రి ప్రసాద్ మీనా. రిటైర్డు బ్యాంకు ఎంప్లాయ్. అమ్మ గీసిదేవి మీనా గృహిణి. జైపూర్లోని యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పొందాను.
చదువు పూర్తయ్యాక ఎల్ఐసీలో తర్వాత ఎస్బీఐలో ఉద్యోగం చేశా. జాబ్ చేస్తూనే సివిల్స్కు ప్రిపేరయ్యా. 2020లో బ్యాంకు కొలువును వదిలేశా. అప్పుడే కోవిడ్ ప్రారంభమైంది. ఉద్యోగం కోల్పోవడం, కరోనా తీవ్రత పెరగడంతో ఎలాగైనా సివిల్స్ సాధించాలని నిర్ణయించుకున్నా. రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గట్టిగా ఆలోచించా. ఎక్కడ వెనుకబడుతున్నా.. అనే దానిపై దృష్టి సారించా.
UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..
టాపర్ల సక్సెస్ స్టోరీలను యూట్యూబ్లో చూస్తూ సన్నద్ధమయ్యాను. మూడో ప్రయత్నంలో 565ర్యాంకు సాధించాను. రాజస్థాన్ క్యాడర్కే ఎంపికయ్యాను. నాలుగో ప్రయత్నంలో నూ సివిల్స్కు ఎంపికవ్వగా ఇంకా సర్వీస్ కేటాయించలేదు.
అమ్మ నుంచే స్ఫూర్తి పొందా.. సివిల్స్లో ర్యాంక్ సాధించానిలా..
నా పేరు పవన్జ్యోత్ కౌర్. మాది పంజాబ్ రాష్ట్రం బటాల గ్రామం. అమ్మ మారుమూల గ్రామంలో స్కూల్ టీచర్గా పనిచేసేది. పట్టణ, గ్రామీణ ప్రాంతానికి ఉన్న వ్యత్యాసాలను చిన్నప్పుడే దగ్గరగా చూశా. పల్లె ప్రాంతాల దుస్థితిని చూసి వాటిని మార్చాలంటే సివిల్స్తోనే సాధ్యమని తెలుసుకున్నాను. అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాను.
ఢిల్లీ యూనివర్సిటీలో ఎంకాం పూర్తి కాగానే సివిల్స్ వైపు దృష్టి సారించా. పట్టుదలతో ప్రయత్నించి నా కల నెరవేర్చుకున్నా. 2021 సివిల్స్లో సత్తా చాటి హిమాచల్ప్రదేశ్ క్యాడర్లో ఐపీవోఎస్కు ఎంపియ్యాను. ప్రస్తుతం పోస్టల్ డిపార్టుమెంట్లో సినీయర్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ తపాలా సేవలను అట్టడుగు వర్గాలకు అందించేలా కృషి చేస్తున్నాను.
తొలి ప్రయత్నంలోనే... సివిల్స్లో విజయం సాధించానిలా..
నా పేరు డేవిడ్ వెంకట్రావు చనాప్. మాది మహారాష్ట్రలోని గోండియా జిల్లా హర్దూరి గ్రామం. నాన్న వెంకట్రావు చనాప్. రిటైర్డు పోలీస్ అధికారి. అమ్మ యశోదాబాయి. గృహిణి. పూణేలో మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేశాను.
కొద్దిరోజుల పాటు ప్రైవేట్గా ఉద్యోగం చేస్తూ సివిల్స్కు సన్నద్ధమయ్యాను. తర్వాత జాబ్ వదిలి ఫోకస్ పెంచా. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. 2021 సివిల్స్ ఫలితాల్లో ఐఎఫ్ఎస్ మధ్యప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం అక్కడి సాగర్ జిల్లా నోరాదేవి టైగర్జోన్కు ఎస్డీపీవోగా పనిచేస్తున్నా. శిక్షణలో భాగంగా ఇక్కడకు వచ్చి పథకాలను అధ్యయనం చేస్తున్నా.
సివిల్స్కు సొంతంగానే సన్నద్ధమయ్యా... కానీ..
నా పేరు సిమ్రాన్. మాది ఢిల్లీ. మా నాన్న బిజేందర్ సింగ్. పోలీస్ అధికారి. అమ్మ ఇందు. గృహిణి. ఢిల్లీ యూని వర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశాను. కళాశాలలో చదివే సమయంలోనే సివిల్స్పై అవగాహన పెంచుకున్నా. ఎమ్మెస్సీ పూర్తి కాగానే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాను.
ఎప్పుడూ నిరాశకు..
తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. అయితే ఎప్పుడూ నిరాశకు లోను కాలేదు. లక్ష్యాన్ని వీడకుండా పట్టుదలతో ముందుకెళ్లా. మూడో ప్రయత్నంలో సక్సెస్ వచ్చేసింది. 2024 సివిల్స్లో 19వ ర్యాంకు సాధించి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్కు ఎంపికయ్యాను. ఎలాంటి కోచింగ్ వెళ్లకుండా సొంతంగా సన్నద్ధమయ్యా. లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా.
ఈ పట్టుదలే.. నా సక్సెస్ మంత్రం..
నా పేరు ఎండీ.ఖమరుద్దీన్ఖాన్. మాది కర్నాటక రాష్ట్రంలోని బీదర్. మా నాన్న ఫిరొజుద్దీన్ ఖాన్ ఏఈఈగా రిటైరయ్యారు. అమ్మ జోఫిషాన్ గృహిహిణి. గౌహతిలోని ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. అనంతరం ఉద్యోగ సాధనలో భాగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యా. అసిస్టెంట్ కమిషనర్ (జీఎస్టీ)గా వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగం సాధించాను.
తెలంగాణలో..
తెలంగాణలోని హైదరాబాద్ జిడిమెట్లలో అసిస్టెంట్ కమిషనర్గా కొన్నేళ్లపాటు విధులు నిర్వహించాను. ఈ క్రమంలోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. పట్టుదలతో ప్రయత్నించాను. 2022 ఫలితాల్లో సక్సెస్ సాధించా. ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. పట్టుదల, సంకల్పమే నా విజయానికి నాంది.
ఒకటి, రెండుసార్లు నిరాశ ఎదురైనా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయంరా..’ అంటూ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలు ఆచరణలో అక్షర సత్యాలుగా పేర్కొంటున్నారు వీరు. సంకల్పమే విజయానికి నాందిగా నిలు స్తుందని.. ఒకటి, రెండుసార్లు నిరాశ ఎదురైనా నిరుత్సాహం దరి చేరనివ్వద్దని అంటున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందని సివిల్స్ ట్రెయినీలు అభిప్రాయపడుతున్నారు.
ఆలిండియా సివిల్ సర్వీసెస్కు ఎంపికైన 21 మందిని కేంద్రం శిక్షణ నిమిత్తం ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించింది. 2021, 2024 బ్యాచ్లకు సంబంధించి ఐపీఎస్ క్యాడర్ ఐదుగురు, ఐఎఫ్వోఎస్ నలుగురు, ఐఆర్ఎస్ నలుగురు, ఐపీవోఎస్ ఒకరు, ఐఈఎస్ ఇద్దరు, ఐపీ అండ్ టీఏఎఫ్ఎస్ ఒకరు, ఐఎస్ఎస్ క్యాడర్ నలుగురు ఉన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన వీరంతా ఈ నెల 21 నుంచి 28 వరకు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించనున్నారు. ప్రజల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ అధ్యయనం చేయనున్నారు.
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..