Engineering Admissions : ఇంజనీరింగ్ ప్రవేశాలకు సర్వం సిద్ధం.. నెల చివరిలో అడ్మిషన్ల ప్రక్రియ.. విద్యార్థుల కౌన్సెలింగ్ ఇలా..!
తిరుపతి సిటీ: ఇంజినీరింగ్లో ప్రవేశాలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ర్యాంక్ కార్డుల ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. బీటెక్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఆన్లైన్ ద్వారా తమకు నచ్చిన బ్రాంచ్, కళాశాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇస్తుంది. ఈనెల చివరి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు పెట్టుకునే సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తతతో వ్యవహరించాలి.
Gurukul School Admissions: బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి తీవ్ర పోటీలు..
ప్రధానంగా బ్రాంచ్ ఎంపికలోనూ కచ్చితమైన నిర్ధారణకు రావాలి. ఫలానా బ్రాంచ్ తీసుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే బ్రాంచ్ని ఎంపిక చేసుకుని తమకు నచ్చిన ఒకే కళాశాలను ఆప్షన్లలో ఉంచితే అంతే సంగతులు. తాము ఎంపిక చేసుకున్న బ్రాంచ్ కోసం 50 నుంచి 70 కళాశాలలను ఆప్షన్లలో ఉంచుకోవడం మంచిది. ఐదు వేల ర్యాంకు పైబడిన వారు మొదటి దశ కౌన్సెలింగ్లోనే 50కి మించి కళాశాలల్లో సీటు కోసం ఆప్షన్లు పెట్టాలి. లక్ష వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులు సైతం వెబ్ ఆప్షన్లలో అధిక సంఖ్యలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. ఒక్క బ్రాంచ్పై ఆధార పడకుండా కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్లను ఎంచుకోవాలి.
ఇంజినీరింగ్ అడ్మిషన్లకు యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ర్యాంకు కార్డులను సైతం విద్యార్థులకు అందించింది. ఈనెల చివరి వారంలో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. జూలై మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్తోపాటు పద్మావతి మహిళా వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రెండు యూనివర్సిటీలలో వంద శాతం కన్వీనర్ కోటాలోనే సీట్ల భర్తీ ప్రక్రియ ఉంటుంది.
Free Coaching: సివిల్ సర్వీస్ అప్టిట్యూడ్ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అటానమస్ కళాశాలల్లో పెరగనున్న సీట్లు
ఏపీ ఈఏపీసెట్లో మంచి ర్యాంకు సాధించలేకపోయామనే ఆలోచన అవసరం లేదు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎత్తివేసింది. దీంతో అటానమస్ కళాశాలలు అదనపు సెక్షన్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు పొందాయి. అన్ని బ్రాంచ్లలో సీట్లు భారీగా పెరగనున్నాయి. ఏపీ ఈఏపీసెట్లో పెద్ద ర్యాంక్ వచ్చినా విద్యార్థులు ఏదో ఒక కళాశాలలో తమకు నచ్చిన బ్రాంచ్లో కన్వీనర్ కోటాలోనే ఫ్రీ సీటు సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలోనే ఏకైక మహిళా ఇంజినీరింగ్ కళాశాల
పద్మావతి మహిళా వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మహిళలకు ప్రత్యేకంగా నెలకొల్పబడిన ఏకైక ప్రభుత్వ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ. ఇందులో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో మాత్రమే అడ్మిషన్లు స్వీకరిస్తారు. ఇందులో సీఎస్ఈ, ఈసీఈలో 120 సీట్లు ఉండగా మరో 10 శాతం సీట్లు ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేస్తారు. అదేవిధంగా ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్లలో 60 సీట్లు మాత్రమే ఉండగా మరో 10 శాతం అంటే అదనంగా ఒక్కో బ్రాంచ్కు 6 సీట్లు ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేస్తారు.
NEET-UG Exam Row: తప్పు జరిగితే ఒప్పుకుని సరిదిద్దుకోండి.. NTA తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు
అడ్మిషన్లలో వందశాతం కన్వీనర్ కోటాలోనే సీట్ల భర్తీ ఉంటుంది. కళాశాలలో పూర్తి స్థాయిలో అన్ని వసతులు ఉన్నారు. ప్రతి ఏటా సుమారు 70శాతం వరకు ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నారు. పేరొందిన ఎంఎన్సీ కంపెనీలు క్యాంపస్ డ్రైవ్లను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎంపికై న విద్యార్థినులకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, డేటాసైన్స్ వంటి మరో రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతుల కోసం వేచిస్తున్నారు.
ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో...
ఎస్వీయూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఆరు బ్రాంచ్లకు కలిపి 396 సీట్లు వంద శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్లో ఒక్కో బ్రాంచ్లో 60సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. దీంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద మరో 10శాతం అంటే ఒక్కో బ్రాంచ్కి 6సీట్లు అదనంగా భర్తీ చేస్తారు. అదేవిధంగా లేటరల్ ఎంట్రీలో భాగంగా డిప్లొమో పూర్తిచేసి ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంది. లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం ప్రతి బ్రాంచ్లో ఆరు సీట్లు చొప్పున ఈసెట్ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చు. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన సుమారు 70శాతం మందికి పేరొందిన ఎంఎన్సీ కంపెనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందారు.
ఈ ఏడాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో అడ్మిషన్లు లేనట్టే!
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో ఈ ఏడాది అడ్మిషన్లు చేయరాదనే నిర్ణయంతో ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఈ కోర్సులలో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ కోర్సులకు అడ్మిషన్లు పూర్తిగా నిలిపి వేయనున్నట్లు సమాచారం.
కౌన్సెలింగ్కు కావాల్సిన ధ్రువపత్రాలు
ఏపీ ఈఏపీసెట్–2024 ర్యాంకు కార్డు
ఏపీ ఈఏపీసెట్–2024 హాల్ టికెట్
ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష మార్కుల జాబితా
పుట్టిన తేదీ ధ్రువపత్రం కోసం ఎస్ఎస్సీ మార్కుల జాబితా
బదిలీ సర్టిఫికెట్ (టీసీ)
స్టడీ సర్టిఫికెట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు
ఆర్థికంగా వెనుకబడిన వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్–2025 వ్యాలిడిటీ (ఓసీ విద్యార్థులు)
కుల ధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు)
ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు
పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు
ఇంజినీరింగ్ అడ్మిషన్లకు రెడీ
బ్రాంచ్ ఎంపిక, వెబ్ ఆప్షన్ల విషయంలో జాగ్రత్త
జూలై మొదటి వారంలోనే కౌన్సెలింగ్
ఎస్వీయూలో ఆరు బ్రాంచ్లు.. 396 సీట్లు
మహిళా వర్సిటీలో నాలుగు బ్రాంచ్లు... 396 సీట్లు
ఆ రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం ప్లేస్మెంట్స్
రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ మహిళా ఇంజినీరింగ్ కళాశాల
బ్రాంచ్ మహిళా ఎస్వీయూలో వర్సిటీలో
సీఎస్ఈ 132 66
ఈసీఈ 132 66
ఈఈఈ 66 66
మెకానికల్ 66 66
సివిల్ – 66
కెమికల్ – 66
UPSC Exam: కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
విద్యార్థి ఆసక్తిని బట్టి బ్రాంచ్ ఎంపిక
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్లను తీసుకోవడం మంచిది. ఎవరో చెప్పారనో బ్రాంచ్ని ఎంపిక చేసుకుని చేరిన తర్వాత పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టకపోతే లక్ష్యాన్ని సాధించలేరు. ఇంజినీరింగ్లో ప్రతి బ్రాంచ్కు మార్కెట్లో డిమాండ్ ఉంది. విద్యార్థి ఎంపిక చేసుకున్న బ్రాంచ్లో రాణిస్తూ స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేటివ్ నాలెడ్జ్, కమూనికేషన్ స్కిల్స్పై దృష్టి సారించాలి. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. తల్లిదండ్రులు ఫలానా బ్రాంచ్లోనే బీటెక్ చేయాలని అంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయరాదు. విద్యార్థి అభిరుచి ఆసక్తిని పరిగణలోని తీసుకోవాలి.
–ఎం.దామోదర్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్, ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి