TOEFL Exam: విజయవంతంగా ‘టోఫెల్‌’ ప్రైమరీ

సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రపంచ స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్‌ ప్రిపరేటరీ సర్టిఫికేషన్‌ పరీక్ష ఏప్రిల్‌ 10న‌ ప్రశాంతంగా ముగిసింది.

రాష్ట్రవ్యాప్తంగా 13,104 పాఠశాల్లో టోఫెల్‌ ప్రైమరీ పరీక్ష నిర్వహించారు. ఇందులో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,53,265 మంది విద్యార్థులకుగానూ 4,17,879 మంది (92 శాతం) హాజరైనట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 12న జూనియర్‌ టోఫెల్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

చదవండి: TOEFL Exam: టోఫెల్‌ ప్రిపరేటరీ సర్టిఫికేషన్‌ పరీక్ష.. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సర్టిఫికెట్‌ ప్రదానం

ఏప్రిల్‌ 10న‌ జరిగిన పరీక్షను అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) సంస్థ ప్రతినిధులు లిజో, రాజీవ్‌ పరీక్ష జరిగిన విధానాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా, ఈటీఎస్‌ సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ అలైన్‌ డుమాస్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది విద్యార్థులు టోఫెల్‌ రెడీనెస్‌ టెస్ట్‌ ద్వారా తమ తొలి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పరీక్ష రాసిన అందరికీ విజయం సిద్ధించాలని అలెన్‌ డుమాస్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు.   

#Tags