Free Admissions: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలు ఈ పథకానికి అర్హులని వివరించారు. ఆసక్తి ఉన్న వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, భూమి హక్కుల పత్రం, జాబ్‌ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, విద్యుత్‌ బిల్లు, రెంటల్‌ అగ్రిమెంట్‌ కాపీల్లో ఏదైనా ఒకటి జత చేయాలి. అలాగే, జనన ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించారు. ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
మార్చి 20 నుంచి 22 వరకూ గ్రామ సచివాలయ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ విద్యార్థుల అర్హతలను నిర్ధారిస్తారు. ఏప్రిల్‌ 1న మొదటి విడత లాటరీ ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి 10వ తేదీ వరకూ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారిస్తారు. ఏప్రిల్‌ 15న రెండో విడత లాటరీ ఫలితాలు ప్రకటించి, ఏప్రిల్‌ 16 నుంచి 23 వరకూ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారిస్తారు.

చదవండి: Admission in Tribal Gurukul Schools: 5వ తరగతి నుంచి 9 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags